పదో తరగతి మూల్యాంకనానికి వివిధ కారణాలు చూపుతూ గైర్హాజరైన ఉపాధ్యాయులపై విద్యాశాఖ ఉక్కుపాదం మోపుతున్నది. ఇప్పటికే కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశాలతో 62 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేయగా, తాజాగా మరికొందరిపై కఠిన చర్యలకు ఉపక్రమించింది. అటు క్యాంపునకు, ఇటు స్కూల్కు రాకుండా డుమ్మా కొడుతున్న 80 మందిపై కొరడా ఝుళిపించింది. రిలీవ్ ఆర్డర్ ఇచ్చే దాకా వారిని పాఠశాల విధుల్లో చేర్చుకోవద్దని ఆయా స్కూల్ హెచ్ఎంలకు డీఈవో కార్యాలయం ఆదేశాలు జారీ చేయడమే కాకుండా నిబంధనలు ఉల్లంఘిస్తే మీపైనా చర్యలు తప్పవని ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొన్నది. దీంతో కంగుతిన్న సదరు టీచర్లు సంఘాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ పైరవీలు చేస్తున్నట్టు తెలుస్తుండగా, విద్యాశాఖ అధికారులు నిక్కచ్చిగా వ్యవహరిస్తున్నారు. ఇందులో ఎవరికీ మినహాయింపు లేదని చర్యలు తప్పవని స్పష్టం చేస్తుండగా, సదరు టీచర్లు కలవరపడుతున్నారు.
కరీంనగర్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): పదోతరగతి మూల్యాంకనం విషయం రోజుకో మలుపు తిరుగుతున్నది. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న టీచర్లకు దెబ్బమీద దెబ్బ తగులుతున్నది. ఉపాధ్యాయుల గైర్హాజరు విషయాన్ని కలెక్టర్ పమేలా సత్పతి సీరియస్గా తీసుకోవడంతో ఇటీవలే పలువురికి విద్యాశాఖ నుంచి షోకాజ్ నోటీసులు రాగా, తాజాగా మరికొందరిని విధుల్లోకి తీసుకోవద్దంటూ హెచ్ఎంలకు ఆదేశాలు వెళ్లడం హాట్టాపిక్గా మారింది. కరీంనగర్ సెయింట్జాన్స్ పాఠశాలలో పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం ఈనెల 3న ప్రారంభమైంది. ఇది 11వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ కేంద్రానికి వివిధ జిల్లాల నుంచి 2.20 లక్షల పైచిలుకు జవాబు పత్రాలు వచ్చాయి.
వీటిని మూల్యాంకనం చేసేందుకు రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాలకు చెందిన 1,087 మంది ఉపాధ్యాయులకు విద్యా శాఖ విధులు కేటాయించింది. విద్యాశాఖ ఆదేశాల మేరకు సం బంధిత పాఠశాలల హెచ్ఎంలు సదరు ఉపాధ్యాయులను ఆయా పాఠశాలల నుంచి రిలీవ్ చేశారు. కాగా, అందులో చాలా మంది ఉపాధ్యాయులు అనారోగ్య కారణాలు చూపుతూ మూల్యాంకన విధుల నుంచి తొలగించాలని అర్జీలు పెట్టుకున్నారు. సగానికి పైగా అంటే.. దాదాపు 600 మంది పంతుళ్లు తమకు విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ అర్జీలు పెట్టడంతో విద్యాశాఖ కంగుతిన్నది.
ఇలా అయితే, మూల్యాంకనం ఎలా పూర్తి చేస్తామని భావించింది. అయితే, మెజార్టీ టీచర్లు అనారోగ్య కారణాలను చూపడంతో కలెక్టర్ ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్నారు. నిగ్గు తేల్చేందుకు డీఈవోకు ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు అర్జీలు పెట్టుకున్న వారికి మూల్యాంకన కేంద్రంలోనే మెడికల్ బోర్డు ద్వారా టెస్టులు నిర్వహించారు. ఇందులో అనారోగ్యం లేని వారిని విధుల్లో చేరాలని ఆదేశాలు ఇవ్వగా, నిర్లక్ష్యం చేసిన 62 మందికి ఇటీవలే షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ విషయాన్ని ‘పంతుళ్లపై చర్యలు’ అనే శీర్షికతో ‘నమస్తే తెలంగాణ’ ఆదివారం కథనం ప్రచురించిన విషయం తెలిసిందే.
రిలీవ్ ఆర్డర్ ఇచ్చే వరకు చేర్చుకోవద్దు.
మూల్యంకనం వివరాలపై కలెక్టర్ ఎప్పటికప్పుడు ఆరా తీస్తూనే ఉన్నారు. ఉపాధ్యాయుల గైర్హాజరుపై జిల్లా విద్యాధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లుగా అధికారుల ద్వారా తెలుస్తోంది. అయితే, ఈ వ్యవహారంలో తీగలాగితే డొంకంతా కదులుతోంది. మూల్యాంకనం పేరుతో పాఠశాలల నుంచి రిలీవ్ అయిన సుమారు 80 మందికిపైగా ఉపాధ్యాయులు క్యాంపునకు హాజరు కావడంలేదని, వారికి మూల్యాంకనం విధుల నుంచి ఎటువంటి మినహాయింపూ లేదని విద్యాశాఖ గుర్తించింది.
విద్యాశాఖ అధికారులు విషయా న్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో సీరియస్గా తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఆ మేరకు మూ ల్యాంకనం విధుల పేరుతో స్కూల్ నుంచి రిలీ వ్ అయిన టీచర్లను తిరిగి డీఈవో కార్యాల యం నుంచి రిలీవ్ ఆర్డర్ ఇచ్చే దాకా పాఠశాల ల్లో చేర్చుకోవద్దని ఆయా స్కూళ్ల ప్రధానోపాధ్యాయులకు విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఆ ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరిస్తే సదరు హెచ్ఎంలపై చర్యలు తీసుకుంటామని ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే, ఈ విషయం సీరియస్ అవుతుండడంతో సదరు ఉపాధ్యాయులంతా ఉపాధ్యాయ సంఘాలను ఆశ్రయి స్తూ, కాపాడాలని వేడుకుంటున్నట్లు తెలిసింది.
మూల్యాంకనం విధుల కోసం ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం ఉపాధ్యాయులు నడుచుకోవాల్సి ఉంటుంది. అప్పుడే ప్రభుత్వం నిర్దేశించిన సమయంలో మూల్యాంకనం పూర్తి చేసే ఆస్కారం ఉంటుంది. నిజంగానే మూల్యాంకనం చేయడానికి ఏమైనా ఇబ్బందులున్నా, అనారోగ్య కారణాలున్నా సదరు టీచర్లు అర్జీ పెట్టుకోవాలి. సదరు అర్జీని పరిశీలించి విధుల నుంచి మినహాయింపు ఇచ్చే అధికారం జిల్లా విద్యాధికారికి మాత్రమే ఉంటుంది. ఆయన సమ్మతిస్తేనే అధికారికంగా విధుల నుంచి మినహాయింపు లభించినట్లు అవుతుందని విద్యాశాఖ చెబుతోంది. కానీ, చాలామంది ఉపాధ్యాయులు అనారోగ్య కారణాలు చూపుతూ అర్జీ పెట్టేసి చేతులు దులుపుకున్నారు.
అది ఆమోదం పొందిందా? లేదా ? అన్న వివరాలు తెలుసుకోకుండానే విధులకు గైర్హాజరవుతున్నారు. సదరు టీచర్లకు ఒకటికి రెండు సార్లు అధికారుల నుంచి సమాచారం వెళ్లినా పెడచెవిన పెట్టారు. దీంతో విద్యాశాఖ మెడికల్ బోర్డు ద్వారా టెస్టులు చేయించడంతో సిక్ లేని వారు విధులకు హాజరుకాక తప్పలేదు. కాగా, మెడికల్ బోర్డు ద్వారా టెస్టులు నిర్వహించి ఉపాధ్యాయుల గౌరవాన్ని దెబ్బతీశారంటూ పలు ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన చేసేందుకు కరీంనగర్ డీఈవో జనార్ధన్రావుకు నోటీసు ఇవ్వగా, ఆయన ఏమాత్రం వెనక్కి తగ్గలేదు.
ఇదిలా ఉండగా ప్రస్తుతం విధుల నుంచి తప్పించుకొని తిరుగుతున్న ఉపాధ్యాయుల విషయం సీరియస్ అవుతున్న నేపథ్యంలో సదరు ఉపాధ్యాయులు తిరిగి పలు సంఘాలను ఆశ్రయిస్తున్నారు. ఆ మేరకు డీఈవోపై సదరు సంఘాలు ఒత్తిడి తెస్తున్నాయి. అంతేకాదు కొన్ని సంఘాలు బెదిరింపులకు పాల్పడుతున్నాయి. అయితే, మూల్యాంకనం విషయంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోకతప్పదని, ఈ విషయంలో సహకరించాల్సింది పోయి పైరవీలు చేయడం ఏంటంటూ సంఘాలను విద్యాశాఖ అధికారులు ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తోంది.
అంతేకాదు జరిగిన వ్యవహారం అంతా కలెక్టర్ దృష్టిలో ఉండడంతో విద్యాధికారులు వెనక్కి తిరిగి చూడకుండా.. చర్యలపైనే దృష్టిపెడుతున్న తీరు పలు సంఘాలకు, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ఉపాధ్యాయులకు మింగుడు పడడం లేదు. కాగా, గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి విద్యాశాఖాధికారులు మూల్యాంకన విషయంలో నిక్కచ్చిగా వ్యవహరిస్తున్న తీరు విద్యాశాఖవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇదే విషయంపై కరీంనగర్ జిల్లా విద్యాధికారి జనార్ధన్రావుతో ‘నమస్తే తెలంగాణ’ మాట్లాడగా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై శాఖాపరమైన చర్యలు తప్పవని, ఇందులో ఎవరికీ ఎటువంటి మినహాయింపూ లేదని స్పష్టం చేశారు.