TEMPLE | సారంగాపూర్ : మండలంలోని రేచపల్లి గ్రామ శివారు అటవీ ప్రాంతంలోనీ ప్రధాన రహదారికి అనుకుని ఉన్న శ్రీ గండి వేంకటేశ్వర స్వామి ఆలయం చిన్నగా రేకులతో ఉండేది. కాగా గత భారీ వర్షాలకు ఆలయం ముందు ఉన్న స్లాబు దెబ్బతింది. దీంతో ఆలయం ముందు నిల్చునే వీలు లేకుండా ప్రమదకరంగా మారింది. గ్రామంలోని పలువురు యువత ముందుకు వచ్చి నూతన ఆలయం పునర్నిర్మాణంచేయాలని నిర్ణయించుకున్నారు.
విషయాన్ని వాట్సాప్ గ్రూపుల్లో ఆలయ నిర్మాణం చేయాలని దాతలు ముందుకు వచ్చి తమవంతు సహకారం అందించాలని కోరారు. యువత వారి వంతుగా విరాళాలు ప్రకటించడంతో గ్రామంలోని వివిధ కుల సంఘాల నాయకులు, యువత, గ్రామస్థులతో పాటు ఇతర ప్రాంతాల వారు కూడా తమవంతుగా విరాళాలు అందించారు. దాతల సహకారంతో సుమారు రూ.10లక్షల వ్యయంతో ఆలయ పున నిర్మాణం ప్రారంభించి ఆలయ నిర్మాణం పూర్తి చేశారు.
ఆలయం అనుకుని శ్రీ అభయా ఆంజనేయ స్వామి విగ్రహ ఏర్పాటుకు గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు ముందుకు వచ్చి నిర్మాణ పనులు చేపట్టారు. ఆలయ నిర్మాణ పనులు పూర్తి కావడంతో ఆలయంలో ప్రతిష్ఠ వేడుకలు వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టారు. ఆలయ అర్చకులు శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో ఈనెల 18 నుండి 20 వరకు మూడు రోజులు పాటు ఉత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణంలో తమవంతు కృషి చేసిన యువతను, దాతలను, గ్రామస్తులను పలువురు అభినందిస్తున్నారు.