కార్యకర్తలను తమ స్వార్థానికి వాడుకొని వదిలివేసే రాజకీయ పార్టీలే మనకు కనిపిస్తాయి.. అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని పట్టించుకోకుండా గాలికొదిలేస్తాయి.. కానీ, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఇందుకు విరుద్ధంగా సభ్యుల యోగక్షేమాలను భుజాలపై వేసుకుంటున్నది. గులాబీ కుటుంబంలో సభ్యత్వం తీసుకున్నారంటే చాలు, ఆ వ్యక్తిని తన కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నది. ఆ కుటుంబానికి అండగా నిలుస్తున్నది. అందుకోసం పార్టీ అధిష్టానం పకడ్బందీ ప్రణాళికలు అమలు చేస్తూ, ప్రతి ఒక్కరికీ ముందుగానే 2 లక్షల ప్రమాద బీమా చేయిస్తున్నది. అందుకయ్యే ప్రీమియం మొత్తాన్ని చెల్లిస్తున్నది. దురదృష్టవశాత్తూ సభ్యత్వం తీసుకున్న వారు చనిపోతే.. ప్రజాప్రతినిధులు, నాయకుల ద్వారా 2 లక్షల బీమా చెక్కును నేరుగా కుటుంబానికి అందిస్తున్నది. అవసరమైతే వ్యక్తిగతంగానూ సాయం అందేలా చూస్తున్నది. ఇలా ఒకటి రెండు కాదు.. వందలాది కుటుంబాలకు ఈ తరహా సాయం అందించి, భరోసానిచ్చింది.
– కరీంనగర్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
బిడ్డ పెళ్లి చేసిన.. కొడుకును చదివిస్తున్న
.. ఇక్కడ ఫొటో చేతులో పట్టుకుని ఉన్న మహిళ పేరు దుర్గం పద్మ. ఈమె భర్త పేరు మల్లయ్య. చొప్పదండి మండలం మల్లన్నపల్లి గ్రామమైన వీరికి కొడుకు, కూతురు ఉన్నారు. మల్లయ్య బీఆర్ఎస్లో సభ్యత్వం తీసుకుని పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాడు. అయితే ‘పార్టీలల్ల తిరిగితే ఏం వస్తది’ అని చాలా మంది హేళన చేసేవారు. కానీ, మల్లయ్య అవేమీ పట్టించుకోకుండా పార్టీనే నమ్ముకునేది. రెండేండ్ల కిందట ప్రమాదంలో ఆయన మరణించడంతో కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడింది. అయితే, మల్లయ్య పేరున పార్టీ బీమా చేయించడంతో ఇన్సూరెన్స్ ద్వారా పద్మకు 2 లక్షలు వచ్చాయి. దీంతో ఆ కుటుంబానికి భరోసా దొరికింది. తమకున్న అప్పు చెల్లించింది. ఏడాది కిందట బిడ్డ పెండ్లి చేసింది. తన కొడుకును ఉన్నత చదువులు చదివిస్తున్నది. తన కుటుంబానికి అండగా నిలిచి కంటికి రెప్పలా కాపాడుకున్న సీఎం కేసీఆర్ కేసీఆర్కు రుణపడి ఉంటామని, బీఆర్ఎస్ సభ్యత్వం వల్లే తాము బతికి బయట పడ్డామని పద్మ చెబుతున్నది.
గులాబీ శ్రేణులకు బీఆర్ఎస్ ప్రమాద బీమాతో భరోసా కల్పిస్తున్నది. సాధారణ సభ్యత్వం నుంచి మొదలు క్రియాశీలక సభ్యత్వం వరకు ప్రతి ఒక్కరికీ 2 లక్షల పాలసీ చేయిస్తున్నది. అందుకయ్యే ఖర్చును పార్టీయే భరిస్తూ, అండగా నిలుస్తున్నది. కరీంనగర్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ చొప్పదండి/ హుజూరాబాద్టౌన్/ హుజూరాబాద్రూరల్/ తిమ్మాపూర్ : ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఆది నుంచీ బీఆర్ఎస్కు అండగా నిలుస్తోంది. అందులోనూ పార్టీకి అత్యధిక సభ్యత్వం ఉమ్మడి జిల్లాలో ఉన్నది. పూర్వపు జిల్లాలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కలిపి ఏడున్నర లక్షలపై చిలుకు సభ్యత్వం ఉన్నది. ఒక్కో నియోజకవర్గంలో కనీసం 50 వేలకు తగ్గకుండా ఉండగా సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గంలో లక్షకు పైగా సభ్యత్వమున్నది. మెజార్టీ నియోజకవర్గాల్లో 60 వేల నుంచి 80 వేల మధ్య ఉన్నది. గతంలో నిర్వహించిన సభ్యత్వ నమోదు కూడా స్వచ్ఛందంగానే సాగింది. ఉమ్మడి జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులు, అమలవుతున్న పథకాలు, కండ్ల ముందు కనిపిస్తున్న ఫలాలు వంటి వాటిని పరిగణలోకి తీసుకుంటున్న ప్రజలు.. స్వచ్ఛందం\గా ముందుకొచ్చి సభ్యత్వం తీసుకుంటున్నారు. నిజానికి ఇతర పార్టీలేవీ సభ్యత్వం విషయంలో బీఆర్ఎస్ దరిదాపుల్లోనూ లేవు. అంతేకాదు, ఇంత పెద్దమొత్తంలో కూడా ఏ పార్టీ గతంలో సభ్యత్వం నమోదు చేయలేదు. నమోదును కూడా పకడ్బందీగా చేశారు. ఇతర పార్టీల మాదిరి కాకుండా పూర్తి వివరాలతో కంప్యూటరీకరణ చేశారు.
సభ్యులకు అండగా..
చాలా పార్టీలు వారి కార్యకర్తలు బతికి ఉండగానే వాడుకొని. వారిని, వారి కుటుంబాలను గాలికొదిలి వేస్తాయి. అధికారంలోకి వస్తే కార్యకర్తలను ఏమాత్రం పట్టించుకోవు. క్షేత్రస్థాయి పరిస్థితులను పూర్తిగా విస్మరిస్తాయి. కానీ, బీఆర్ఎస్ మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా తన ప్రస్థానం సాగిస్తున్నది. ఆది నుంచీ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరినీ తన కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నది. అందుకోసం సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికీ ముందుగా 2 లక్షల ప్రమాద బీమా చేయిస్తున్నది. ప్రమాదవశాత్తు సదరు కార్యకర్త ప్రాణాలు కోల్పోతే.. బీమా ద్వారా వచ్చే 2 లక్షల చెక్కును తీసుకెళ్లి సదరు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఆ కుటుంబాలకు అందిస్తున్నారు. అంతే కాదు, సదరు కుటుంబాల ఆర్థిక పరిస్థితిని చూసి.. అవసరమైతే వ్యక్తిగతంగానూ సాయం చేస్తూ బాధిత కుటుంబాలకు భరోసా ఇస్తున్నారు. ఇప్పటికే వందలాది కుటుంబాలకు ఈ పద్ధతిలో బీఆర్ఎస్ అండగా నిలిచింది. నిజానికి ప్రమాదవశాత్తు కుటుంబ పెద్దను కోల్పోతే.. ఆ కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుదో ఆర్థం చేసుకోవచ్చు. అర్థిక పరిస్థితులు తలకిందులై కుటుంబాలు రోడ్డు పాలయ్యే అవకాశాలు అధికంగా ఉంటాయి. ఇలాంటి పరిస్థితులు బీఆర్ఎస్ సభ్యత్వం తీసుకున్న వారిలో ఎవరికీ రావద్దన్న ఉదాత్త ఆశయంతో పార్టీ ఈ నిర్ణయాన్ని తీసుకొని అమలు చేస్తోంది. తద్వారా కొన్ని వందలాది కుటుంబాలు కొంత మేరకైనా ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నాయి.
కొడుకు చదువుకు అక్కెరకొచ్చాయి..
మద్దులపల్లి మాజీ సర్పంచ్, బీఆర్ఎస్ కార్యకర్త కంబాల ఎల్లవ్వ రెండున్నరేండ్ల కిందట రోడ్డు ప్రమాదంలో మరణించింది. పార్టీ ఆమె పేరిట బీమా చేయించింది. ఏడాది క్రితం రూ.2లక్షల బీమా పరిహారం మంజూరైంది. మంత్రి కొప్పుల ఈశ్వర్ చెక్కును అందించిండు. ఈ డబ్బులు బీటెక్ చదువుతున్న చిన్న కొడుకు సతీశ్కు అక్కెరకొచ్చాయి. బీఆర్ఎస్లో సభ్యత్వం తీసుకోవడం వల్లే మేలు జరిగింది. పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం తపిస్తున్న సీఎం కేసీఆర్ సారుకు కృతజ్ఞతలు.
– ముని, మద్దులపల్లి (పెగడపల్లి)
మనో ధైర్యం పెరిగింది
నా భార్య కల్యాణపు కమల బీఆర్ఎస్ పార్టీలో మహిళా కార్యకర్త చురుకుగా పాల్గొనేది. రెండేళ్ల క్రితం నేను, నా భార్య కమల మంథని నుంచి బైక్పై ముత్తారం వైపు వస్తుండగా కింద పడి మృతి చెందింది. బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ఉన్న నా భార్య మృతితో పార్టీ ద్వారా రూ. 2లక్షల ప్రమాద బీమా చెక్కు మంజూరైంది. ఈ డబ్బులు నా కూతురు ఉన్నత చదువులకు ఉపయోగపడుతున్నయ్. భార్య మృతితో ఆవేదనలో ఉన్న నాకు, నా కూతురుకు ఈ డబ్బులు మనోధైర్యాన్ని ఇచ్చినయ్.
– కల్యాణపు ఇజ్జగిరి (ముత్తారం)
బతికున్నంత వరకు బీఆర్ఎస్ కోసం పనిచేస్త
మా అమ్మానాన్నలు శ్రీమతి- రవీందర్. వీరిద్దరూ 2022లో బైక్ మీద కమలాపూర్ నుంచి వస్తుంటే రోడ్డు ప్రమాదం జరిగింది. ఇద్దరికీ తలకు దెబ్బలు తగిలాయి. దీంతో హన్మకొండలోని ఓ ప్రైవేటు దవాఖానకు తీసుకెళ్లినం. నాన్నను రెండు రోజులు ప్రైవేటులో ఉంచి ఎంజీఎంకు, అక్కడి నుంచి హైదరాబాద్కు తీసుకువెళ్లినం. అయినా పరిస్థితి విషమించి మరణించాడు. అమ్మ కోలుకొని ఇంటికి వచ్చింది. ఇద్దరికి సుమారు రూ.3 లక్షల వరకు ఖర్చయింది. మేం వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తాం. అప్పు తీసుకువచ్చి చికిత్స చేయించాం. అయితే, నాన్న అప్పటికే బీఆర్ఎస్ సభ్యత్వం తీసుకోవడంతో ప్రమాద బీమా ద్వారా రూ.2 లక్షలు, అమ్మకు సీఎంఅర్ఎఫ్ ద్వారా రూ.28 వేలు వచ్చినయ్. వీటితో తీసుకువచ్చిన అప్పులు చెల్లించాం. ఇప్పుడు ధీమాగానే ఉన్నం. మాకింత సాయం చేసిన సీఎం సార్ను ఎప్పటికీ మరువం. నేను బతికున్నంత వరకు పార్టీ కోసం పనిచేస్త.
– ముద్రబోయిన మధూకర్, రాంపూర్ (హుజూరాబాద్ రూరల్)
వృద్ధాప్యంలో నాకు అండగా ఉన్నయ్
నా భర్త కౌటం నర్సయ్య. రెండేళ్ల కిందట పొలం దున్నుతున్నుతుండగా, ట్రాక్టర్ బోల్తా పడి అక్కడిక్కడే చనిపోయిండు. మాకు ముగ్గురు కూతుళ్లు, ఒక కొడుకు. అందరికీ పెండ్లిళ్లు జేసినం. నా భర్త చనిపోవడంతో చాన రందిన వడ్డ. నా భర్తకు బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ఉంది. రూ.2 లక్షల ప్రమాద బీమా చెక్కు వచ్చింది. ఆ బీమా డబ్బులే నాకు ఇప్పుడు ఆసరా అయితున్నయ్.
-కౌటం శ్యామల, విలోచవరం (మంథని)
బిడ్డ పెళ్లికి బ్యాంక్ల డిపాజిట్ చేసిన
మేము హుజూరాబాద్లోని పాత రిజిస్ట్రేషన్ ఆఫీస్ సమీపంల ఉంటున్నం. నా భర్త పేరు సత్యం. మాకు కొడుకు, కూతురు ఉన్నరు. రెండేండ్ల కింద నా భర్త పార్టీ మీటింగ్ కోసం హైదరాబాద్కు వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదంల చనిపోయిండు. పార్టీల కార్యకర్తగా ఉన్న ఆయన పేరు మీద ఇన్సూరెన్స్ ఉండడంతో రూ.2 లక్షల చెక్కు వచ్చింది. వచ్చిన పైసలను ఖర్చు చేయకుండా నా బిడ్డ యామిని పెళ్లి కోసం బ్యాంకుల ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మా కుటుంబానికి పార్టీ ఆసరాగా నిలిచింది. వచ్చిన పైసలతోటి బిడ్డ పెళ్లి చేస్త. మాకు అండగా ఉన్న పార్టీని ఎప్పటికీ వీడం. జీవితాంతం మా ఇంటి పార్టీగా అండగా ఉంటం.
– కర్రి పూర్ణ (హుజూరాబాద్టౌన్)
నా ఖర్చులకు పనికస్తున్నయ్
మేం కొన్నాళ్ల నుంచి బీఆర్ఎస్లనే కొనసాగుతున్నం. సీఎం కేసీఆర్ సార్ పార్టీ కార్యకర్తల కోసం బీమా పెట్టిండని మా కొడుకు అనిల్ మా ఇంట్ల అందరి పేరు మీద బీమా రాయించిండు. మా ఆయన ఐదేండ్ల కింద ప్రమాదంల చనిపోయిండు. ఆయన పేరు మీద బీమా ఉండడంతో రూ.2 లక్షల చెక్కు వచ్చింది. ఆయన పోయినప్పుడు కొడుకుల మీద ఆధార పడాల్సి వస్తుందేమోనని బాధ ఉండె. కానీ, ఇప్పుడు మా పార్టీ బీమా నుంచి వచ్చిన రూ.రెండు లక్షలు నా ఖర్చులకు పనికస్తున్నయ్. పార్టీని నమ్ముకున్నందుకు మాలాంటి ఎందరో కార్యకర్తల కుటుంబాలకు అండగా నిలుస్తున్నది.
– పొన్నం కనుకలక్ష్మి, మన్నెంపల్లి (తిమ్మాపూర్)
కట్నం బాకీ తీర్చిన
నా భర్త పేరు కంది పోచాలు. కుల వృత్తి (హెయిర్ సెలూన్) చేసేది. బీఆర్ఎస్ పార్టీల కార్యకర్తగ ఉంటుండె. మాకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. ఒక కొడుకుకు, కూతురు పెండ్లిళ్లు చేశాం. మా ఆయన, నేను పని చేస్తేనే పూట గడిచేది. ఏడాది కింద భూపాలపట్నం వద్ద రోడ్డు ప్రమాదంల ఆయన చనిపోయిండు. అయితే, అప్పటికే పార్టీల సభ్యత్వం ఉండడంతోటి ప్రమాద బీమా కింద రూ.2 లక్షలు వస్తయని పార్టీ నాయకులు చెప్పిన్రు. దరఖాస్తు చేసుకుంటే ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి రూ.2 లక్షల చెక్కు ఇచ్చిన్రు. ఆ పైసలతోటి కొంత బాకీ కట్టిన. బిడ్డకు కట్నం బాకీ తీర్చిన. మాకు భూమి జాగలు, ఆస్తిపాస్తులు లేవు. కష్టకాలంల కొండంత అండగా నిలిచిన బీఆర్ఎస్కు, సీఎం కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటం..
– కంది లక్ష్మి, వడ్కాపూర్, జూలపల్లి మండలం (పెద్దపల్లి)
కూతురి పెండ్లికి ఫిక్స్ జేసిన..
నా భర్త శంకర్కు తెలంగాణ పార్టీ అంటే ప్రాణం. ఎక్కడ కార్యక్రమున్న పోయేటోడు. ఆయన ఏడాది కిందట రోడ్డు ప్రమాదంలో చనిపోయిండు. పిల్లలు చదువుకుంటున్న టైంల ఇంటి పెద్దదిక్కును కోల్పోవడంతో ఆగమైన. బతుకుడెట్ల, వారిని ఎట్లా చదివించేదని, పెండ్లిళ్లు ఎట్లా జేసేదని పరేషాన్ అయినం. అప్పటినుంచి బీడీలు చేస్తే వచ్చే డబ్బులతోనే కుటుంబాన్ని ఎల్లదీత్తున్న. బీఆర్ఎస్ కార్యకర్త అయిన నా భర్తకు రూ.2 లక్షలు ప్రమాద బీమా వచ్చింది. ఎమ్మెల్యే కొడుకు సంజయ్ సార్ వచ్చి చెక్కు ఇచ్చిపోయిండు. నా బిడ్డ పెండ్లి ఖర్చుల కోసం ఈ పైసలను బ్యాంకులో ఫిక్స్ చేసిన. కష్టకాలంల ఆదుకున్న పార్టీకి రుణపడి ఉంట.
– గోదూరి లలిత, చిట్టాపూర్, (మల్లాపూర్)
ఇల్లు కట్టుకునేందుకు ఖర్చుపెట్టినం..
మాది బీర్పూర్ మండలం కొల్వాయి గ్రామం. నాభర్త కుంబాల చంద్రయ్య, మాకు ముగ్గురు బిడ్డలు సుధారాణి, ఉమ, అభినయ, నా పెనిమిటికి తెలంగాణ పార్టీ అంటే మస్తు ఇష్టం. అందుకే పార్టీ సభ్యత్వం తీసుకున్నడు. కొన్నేండ్ల కిందట పాముకుట్టి చనిపోయిండు. ఇంటి పెద్ద మరణంతో మస్తు ఆగమైనం. నాభర్త పేరిట పార్టీ బీమా చేయించింది. పరిహారం కింద రూ.2 లక్షలు అచ్చినయ్. ఈ పైసలను ఇల్లు కట్టుకునేందుకు ఖర్చుపెట్టినం. ఇద్దరు బిడ్డల పెండ్లిళ్లు చేసిన, వారికి కల్యాణలక్ష్మి ద్వారా ఒక్కొక్కరికీ రూ. లక్ష చొప్పున, రూ. 2లక్షలు అచ్చినయ్. కష్టకాలంల ఆదుకున్న కేసీఆర్ సార్ను బతికినంత కాలం గుర్తుపెట్టుకుంటం.
– కుంబాల ప్రమీల, కొల్వాయి, (బీర్పూర్), సారంగాపూర్
బిడ్డ పెండ్లికి బీమా పైసలు ఆసరైనయ్
మాది ముస్తాఫానగర్. నా భర్త అనంత రమేశ్ 15 ఏళ్ల పాటు దుబాయ్ పోయిండు. తెలంగాణ రాష్ట్రం వచ్చినంక ఇంటికి వచ్చి హమాలీ పని చేసుకుంటూ ఇక్కడే ఉన్నడు. బీఆర్ఎస్ల చేరి, ఎప్పుడూ పార్టీ మీటింగులకు పోతుండె. 17 జనవరి 2018న రోడ్డు ప్రమాదంలో చనిపోయిండు. నాకు కూతురు శైలజ, కొడుకు రాకేశ్ ఉన్నాడు. కూతురుకు పెళ్లి సంబంధం చూస్తున్న టైంల నా భర్త చనిపోవడంతో చేతిలో పైసలు లేక ఆగమాగం అయిన. బిడ్డ పెండ్లి ఎట్ట అని రందిన వడ్డ. ఆ టైం రమేశ్ బీఆర్ఎస్ సభ్యత్వం ఉందని, పార్టీ తరపున రెండు లక్షల రూపాయలు వస్తాయని స్థానిక నాయకులు చెప్పిండ్రు. దీంతో నాకు ధైర్నమచ్చింది. అప్పుడు సంబంధం చూసి బిడ్డ పెండ్లి జేసిన. బిడ్డ పెండ్లికి మొత్తం నాలుగు లక్షల వరకు ఖర్సయింది. కొండూరి రవీందర్రావు సారు మా ఇంటికి వచ్చి పార్టీ బీమా కింద రెండు లక్షల రూపాయల చెక్కును నా చేతికి ఇచ్చిండు. పెళ్లికి అప్పు చేసిన నాలుగు లక్షలలో కేసీఆర్, కేటీఆర్ సారు ఇచ్చిన రెండు లక్షలు వారికి కట్టిన. బిడ్డ పెళ్లి ఖర్చులలో సగం ఖర్చులకు పార్టీ బీమా పైసలు ఆసరైనయ్.
– అనంత లక్ష్మి, ముస్త్తాఫానగర్ (గంభీరావుపేట)
పార్టీ సభ్యత్వమే ఆదుకున్నది
బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వమే ఈ రోజు నా కుటుంబాన్ని ఆదుకున్నది. నా భర్త బొంతల ఆర్జయ్య చేపలు పట్టేందుకు బిట్టుపల్లి గ్రామంలో పెద్ద చెరువుకు పోయి నాచు చుట్టుకొని చని పోయిండు. మాకు కూతురు శ్రావ్య, కుమారుడు సంతోష్ ఉన్నరు. ఇంటికి పెద్ద దిక్కు చనిపోవడంతో మాకు ఏం జెయ్యాల్నో మనసునవట్లె. మా ఆయనకు జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ గతంలనె పార్టీ సభ్యత్వం ఇచ్చిండు. దీంతో మాకు రూ. 2లక్షల బీమా పైసలు అచ్చినయ్. ఆ పైసలే ఇప్పుడు మా కుటుంబాన్ని ఆదుకుంటున్నయ్. ఆ పైసలతో నేను నా ఇద్దరు పిల్లలను చదివించుకుంటున్న.
– బొంతల స్వరూప, ధర్మారం (మంథని)