పెద్దపల్లి, ఫిబ్రవరి 24(నమస్తే తెలంగాణ): రామగుండం కార్పొరేషన్లో ఇటీవల జరిగిన ఎన్నికలను రద్దు చేసి, మళ్లీ నిర్వహించాలని బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ డిమాండ్ చేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ రిగ్గింగ్కు పాల్పడిందని, అంతే కాకుండా కరెంట్ తీసేసి బ్యాలెట్ బాక్స్లను సైతం మార్చారని ఆరోపించారు. ఈ మేరకు మంగళవారం ఆయన పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్షకు వినతి పత్రం సమర్పించారు. నిష్పక్షపాతంగా విచారణ జరిపి ఎన్నికలను నిర్వహించాలని కోరారు.
అనంతరం కలెక్టరేట్ ఎదుట మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఇటీవలి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారం అడ్డుపెట్టుకొని అనేక అక్రమాలకు పాల్పడిందని, స్థానిక ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ మక్కాన్ సింగ్ బీఆర్ఎస్ అభ్యర్థులను, నాయకులను, ఓటర్లను బెదిరింపులకు గురి చేశారని, రిగ్గింగ్ చేయడంతోపాటు బ్యాలెట్ బాక్స్లనే మార్చివేశారని ఆరోపించారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 43 డివిజన్లలో అక్రమాలు జరిగాయని, ఆ డివిజన్లలో రీపోలింగ్ చేయించాలని కోరారు. ఈ ఎన్నికలపై తమకు అనుమానాలున్నాయని, రిజల్ట్కు సంబంధించి సైతం బ్యాలెట్లు ఓపెన్ చేసిన తర్వాత ఏ డబ్బా ఓపెన్ చేసినా పూర్తి స్థాయిలో కాంగ్రెస్కు సంబంధించిన గుర్తులు రావడం చూసి ఓటర్లంతా విస్తుపోయారని చెప్పారు.
డివిజన్లలో ప్రజలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్కు ఓటు వేశామని చెబుతుంటే.. రిజల్ట్ ఇలా రావడాన్ని ప్రజలు సైతం స్వాగతించడం లేదన్నారు. అందుకే మెజార్టీ ప్రజలు గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థుల దగ్గరికి వెళ్లకుండా.. ఓడిన బీఆర్ఎస్ అభ్యర్థుల వద్దకు ఓదార్చుతున్నారన్నారు. నిజాయితీగా ఎన్నికలను నిర్వహించామనే ధీమా ఉంటే.. తిరిగి ఎన్నికలను నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఫలితాల వెల్లడి రోజు పూర్తిగా కరెంటు పోయిందని, సీసీ కెమరాలకు సంబంధించిన పూర్తి విజువల్స్ను బయటపెడితే అసలు బండారం బయటపడుతుందని చెప్పారు. త్వరలోనే ఎన్నికల కమిషన్ను సైతం కలిసి విజ్ఞప్తి చేస్తామని చెప్పారు. ఆయన వెంట బీఆర్ఎస్ పెద్దపల్లి పట్టణ అధ్యక్షుడు ఉప్పు రాజ్కుమార్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు నారాయణదాస్ మారుతితోపాటు తదితరులు ఉన్నారు.