Peddapally | పెద్దపల్లి, ఏప్రిల్ 4(నమస్తే తెలంగాణ): పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో గల మాతా శిశు సంరక్షణ కేంద్రం(ఎంసిహెచ్)లో వరుసగా అరుదైన శస్త్ర చికిత్సలు కొనసాగుతున్నాయి. రెండు రోజుల క్రితం క్రిటికల్ కేర్ ఆపరేషన్ చేయగా, తాజాగా గురువారం రాత్రి మరో ట్విన్స్ డెలివరీ ఆపరేషన్ ను వైద్య బృందం విజయవంతంగా పూర్తి చేసింది.
దవాఖాన వర్గాల వివరాల ప్రకారం.. పెద్దపల్లి మండలం బొంపల్లి గ్రామానికి చెందిన అరికిళ్ల మేఘన గర్భిణిగా ఎంసిహెచ్ లో ఆరోగ్య పరీక్షలు పూర్తిచేసుకుని మొదటి కాన్పు కోసం బుధవారం పెద్దపల్లి ఎంసిహెచ్ లో చేరింది. గర్భంలో ట్విన్స్ ఉండడంతో వైద్యులు పాపల ఊపిరితిత్తుల పరిణతి కోసం చికిత్సను అందించారు. గురువారం సాయంత్రం నుంచి మేఘనకు పెయిన్స్ రావడంతో ఆమె వస్తుంది చూసి అప్రమత్తమైన వైద్య బృందం ఆమె డెలివరీ కోసం ఏర్పాట్లు చేశారు.
గర్భంలో ట్విన్స్ ఉండడంతో రక్తస్రావం ఎక్కువ జరిగే అవకాశం ఉండడంతో ప్రత్యేక జాగ్రత్తలతో ఆమెకు ప్రసవం చేశారు. దీంతో మేఘనకు సుఖ ప్రసవం జరిగి ఒక మగ, మరో ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. చిన్నారులకు పిల్లల డాక్టర్ వైద్య పరీక్షలు నిర్వహించి తల్లి ఒడిలోకి చేర్చారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్రిటికల్ కేర్ వైద్య సేవలు అందించిన వైద్యులు ప్రియాంక, కృష్ణవేణి, సంధ్యను కలెక్టర్ కోయ శ్రీహర్ష, డిసిహెచ్ఎస్ కొండ శ్రీధర్ ప్రత్యేకంగా అభినందించారు. జిల్లా ప్రజలు హై రిస్క్ క్రిటికల్ సేవలను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని డిసిహెచ్ఎస్ శ్రీధర్ కోరారు.
జిల్లా ఆసుపత్రి, ఎంసిహెచ్ లో ఆధునిక వైద్యం అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. ప్రతీ గర్భిణీకి 2d ఈకో తో పాటుగా ప్రతి ఆర్గాన్ ని పరీక్షించే టిఫా స్కాన్లను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు వైద్యులు తెలిపారు .