Godavarikhani | కోల్ సిటీ, ఏప్రిల్ 17 : రామగుండం అగ్నిగుండంగా మారింది. అడుగు బయట పెడదామంటే అగ్గిలా మండుతుంది. ఉదయం 7 గంటల నుంచి ఎండ దగడు జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. రామగుండంలో గడిచిన నాలుగు రోజులు ఈ ప్రతికూల వేడి వాతావరణం మరింత ఆందోళనకు గురి చేస్తోంది. శుక్రవారం గరిష్టంగా 40 డిగ్రీలు దాటడంతో వడగాలులు.. ఉక్క పోత తో ప్రజలు బెంబేలెత్తిపోయారు.
సాయంత్రం 6 దాటినా దగడు తగ్గడం లేదు. వృద్ధులే కాదు యువకులు సైతం.. ఎండకు తట్టుకోలేక అస్వస్థతకు గురవుతున్నారు. వారం రోజుల కిందట గోదావరిఖని జీఎం కాలనీకి ఎల్ఐసీ ఏజెంట్ శ్రీనివాస్ అనే వ్యక్తి వడదెబ్బకు గురై మృతి చెందిన సంఘటన విధితమే. అయితే అనూహ్యంగా వాతావరణం లో రోజురోజుకు వేడి తీవ్రత పెరుగుతుండడంతో ఆందోళనకర పరిస్థితి నెలకొంది. కూలర్లు, ఫ్యాన్ల ముందు కూర్చున్నా వేడి నుంచి ఉపశమనం కలగడం లేదు. వివిధ భారీ పరిశ్రమలకు నిలయంగా ఉన్న రామగుండంలో ప్రతీ ఎండాకాలం రికార్డు స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడం సాధారణమే అయినప్పటికీ… ప్రస్తుత ప్రతికూల పరిస్థితి ప్రజలకు ముచ్చెమటలు పట్టిస్తోంది. ఈ ప్రమాదకరమైన ఎండల కు ప్రజలు బయటకు రాకుండా ఉండడమే శ్రేయస్కరమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దంటూ అధికారులు హెచ్చరిక జారీ చేస్తున్నారు.