ఫర్టిలైజర్సిటీ, మార్చి 17: పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు పటిష్టమైన భద్రత చర్యలు చేపట్టాలని రామగుండం సీపీ శ్రీనివాసులు నిర్దేశించారు. శనివారం రామగుండం కమిషనరేట్లో పోలీసు అధికారులకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేయాలన్నారు.
నేర చరిత్ర ఉన్నవారు, రౌడీషీటర్లను రెవెన్యూ అధికారుల ఎదుట బైండోవర్ చేయాలని సూచించారు. ప్రలోభాలకు లొంగకుండా విధులు నిర్వర్తించాలని కోరారు. పోలీసు అధికారులకు వారం పాటు శిక్షణ ఉంటుందని, తర్వాత ఏఎస్ఐ, హెడ్కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లకు సైతం ఎన్నికల కోడ్పై అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. ఇక్కడ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల ఏసీపీలు, సీఐలు, ఎలక్షణ్ సెల్ సీఐ, ఎస్ఐలు ఉన్నారు.