ఫర్టిలైజర్సిటీ, ఫిబ్రవరి 15 : ర్యాగింగ్ శిక్షార్హమైన నేరమని, ర్యాగింగ్కు పాల్పడితే నిరోధక చట్టం మేరకు చర్యలుంటాయని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాసులు హెచ్చరించారు. కళాశాలలో సీనియర్ విద్యార్థులు జూనియర్లకు ఒక గైడ్, సోదరుల్లా మార్గదర్శకంగా ఉండాలని సూచించారు. గోదావరిఖని మెడికల్ కళాశాలలో గురువారం పోలీసుల ఆధ్వర్యంలో యాంటీ ర్యాగింగ్, యాంటీ డ్రగ్స్పై నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
విద్యార్థుల భవిష్యత్ను నిర్మించడంలో కళాశాల క్యాంపస్ కీలకమని చెప్పారు. ర్యాగింగ్ రహిత క్యాంపస్గా మార్చడానికి విద్యార్థులు కృషి చేయాలని సూచించారు. తాను రామగుండం సీపీగా బాధ్యతలు తీసుకున్న రోజు ఈ కళాశాలలో ర్యాగింగ్ ఘటన కలచివేసిందని, దీంతో విద్యార్థులకు కౌన్సిలింగ్, సలహాలు కాకుండా భవిష్యత్లో ర్యాగింగ్కు పాల్పడకూడదని హెచ్చరించాలని ఈ సదస్సు చేపట్టినట్టు తెలిపారు. తోటి విద్యార్థులతో సుహృద్భావ వాతావరణం ఉండేలా చేసుకోవాలన్నారు. అన్ని కళాశాలల్లో షీటీంలు మఫ్టీలో తిరుగుతూ బాడీ కెమెరాలతో రికార్డు చేస్తూ నిరంతరం నిఘా పెడుతాయని చెప్పారు.
అనంతరం కాలేజీ సిబ్బంది, విద్యార్థులతో కలిసి ‘ర్యాగింగ్ అనేది నేరం’ అనే వార్నింగ్ పోస్టర్ను సీపీ ఆవిష్కరించారు. ఇక్కడ కళశాల ప్రిన్సిపాల్ హిమబిందుసింగ్, పెద్దపల్లి సెషన్స్ కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం జ్యోతి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ నుచ్చు శ్రీనివాస్, సీడీపీఓ కమలాకర్, వన్టౌన్ సీఐ ప్రమోద్రావు, మహిళా పోలీస్టేషన్ సీఐ ప్రవీణ్కుమార్, షీటీమ్ ఎస్ఐలు రాజేంద్రప్రసాద్, హైమ, ఎస్ఐలు శరణ్య, సుగుణాకర్, స్వామి తదితరులు పాల్గొన్నారు.