కొండగట్టు అటవీ క్షేత్రం ఇక దట్టమైన వృక్ష సంపదతో అలరారనున్నది. ఇప్పటికే సీఎం కేసీఆర్ ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించగా, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్కుమార్ గుట్ట చుట్టుపక్కల ఉన్న 1095 ఎకరాలను దత్తత తీసుకుని, ఏటా 200 ఎకరాల చొప్పున అటవీ విస్తరణకు కార్యాచరణ సిద్ధం చేశారు. అంతేకాకుండా, ఈ యేడు తన నిధుల నుంచి 1.04 కోట్లను గ్రీన్ ఫండ్ కింద విడుదల చేశారు. అందులో భాగంగా శనివారం ఆయన మంత్రులు అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్తో కలిసి అంజన్న సన్నిధికి చేరుకుని గ్రీన్ చాలెంజ్కు శ్రీకారం చుట్టనున్నారు. ఈ మేరకు అధికారయంత్రాంగం ఏర్పాట్లు చేయగా, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పరిశీలించి, దిశానిర్దేశం చేశారు.
– మల్యాల, జూలై 14
మల్యాల, జూలై 14: జగిత్యాల జిల్లాలోని కొండగట్టు అంజన్న సన్నిధి చుట్టూ అటవీప్రాంతానికి మహర్దశ పట్టనున్నది. 1095 ఎకరాల అటవీ ప్రాంతాన్ని రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్కుమార్ దత్తత తీసుకున్నారు. హరితహారంలో భాగంగా గతంలో కీసరగుట్ట సమీపంలోని అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకున్న ఆయన, గ్రీన్భాలెంజ్లో భాగంగా అభివృద్ధి చేశారు. ఇటీవల సీఎం కేసీఆర్ కొండగట్టు ఆలయ అభివృద్ధి విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టిన నేపథ్యంలో ఎంపీ సంతోష్కుమార్ సైతం ఆలయం చుట్టూ అటవీప్రాంత భూములను దత్తత తీసుకునేందుకు స్వచ్ఛందంగా ముందు కు వచ్చారు. ఆలయం చుట్టూ ఉన్న అటవీ ప్రాంతం 1095 ఎకరాలను ఏటా 200 ఎకరాల చొప్పున దశలవారీగా గ్రీన్ఫండ్ను కేటాయిస్తూ అభివృద్ధి చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ యేడు 1.04 కోట్ల గ్రీన్ఫండ్ను సంతోష్కుమార్ కేటాయించారు.
శనివారం మంత్రు లు ఇంద్రకరణ్రెడ్డి, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, రాజ్యసభ సభ్యులు సంతోష్కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కలిసి అటవీ ప్రాంతంలో మొక్కలు నాటనున్నారు. కొండగట్టు అటవీ ప్రాంతంలో ఎక్కువగా ఔషధ మొక్కలు కలిగి ఉండడంతో అటవీశాఖ నేతృత్వంలోని వననర్సరీల ద్వారా మొక్కలను సరఫరా చేయనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కొండగట్టు ఆంజనేయస్వామి వారి దర్శనం చేసుకున్న తర్వాత ముత్యంపేట అటవీసెక్షన్ పరిధిలోని కొండగట్టు అర్బన్ ఫారెస్ట్ బీట్లోని వాచ్టవర్ సమీపంలో మొక్కలను నాటనున్నారు. మంత్రుల పర్యటన ఏర్పాట్లను ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, జగిత్యాల డీఎఫ్ఓ వెంకటేశ్వర్రావు, కొడిమ్యాల ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ బుర్ర లత, ఆరు మండలాల నాయకులతో కలిసి పరిశీలించారు.