Rasamayi Balakishan | తిమ్మాపూర్, జూలై 23 : మానకొండూరు నియోజకవర్గం గన్నేరువరం మండలం గుండ్లపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ భర్త రాజేందర్ రెడ్డి మృతి చెందడం బాధాకరమని, ఆయనది ఆత్మహత్య కాదని, హత్య అని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ధ్వజమెత్తారు. అమెరికాలో ఉన్న ఆయన వీడియో రిలీజ్ చేశారు. తనతోపాటు ఉన్నప్పుడు సర్పంచ్ గా గ్రామాన్ని ఎంత అభివృద్ధి చేశారని, చెప్పుడు మాటలు నమ్మి కాంగ్రెస్ పార్టీలో చేరిన పాపానికి ప్రాణాలు తీశారని దుయ్యబట్టారు.
గ్రామాభివృద్ధి పై ప్రశ్నించినందుకు అదే గ్రామానికి చెందిన ఎమ్మెల్యే కవంపల్లి పీఏ మురళీధర్ రెడ్డి కక్ష గట్టి వడ్లూరు గ్రామానికి చెందిన ఇద్దరిని ఎగదోసి కొట్టించే ప్రయత్నం చేసి తిరిగి ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయించారని ఆరోపించారు. ఈ అరాచకాల గురించి తెలిపేందుకు క్యాంప్ ఆఫీస్ కి వెళ్ళిన రాజేందర్ రెడ్డి కి ఎమ్మెల్యే నుండి సరైన స్పందన రాకపోవడంతోనే ఆత్మహత్యయత్నం చేసుకున్నాడని ఆరోపించారు. అప్పటికి కూడా ఎమ్మెల్యే ఆయనను అవమానకరంగా మాట్లాడాడని చెప్పారు. నియోజకవర్గంలో జరిగే అరాచకాలను ప్రశ్నిస్తే ఇంకా ఎంతమందిని చంపుతావని ప్రశ్నించారు.
రాజేందర్ రెడ్డి మృతికి కారణమైన మురళీధర్ రెడ్డిని వెంటనే అరెస్టు చేయించాలని డిమాండ్ చేశారు. రాజేందర్ రెడ్డి కుటుంబానికి అండగా ఉంటామని, వారి చిన్నపిల్లలకు న్యాయం చేయాలని, వారి కుటుంబానికి న్యాయం జరగపోతే బీఆర్ఎస్ పక్షాన పోరాడుతామని స్పష్టం చేశారు.