వేములవాడ, సెప్టెంబర్ 30: ‘ఇతర రాష్ర్టాల నుంచి తెలంగాణకు వస్తున్న ప్రతిపక్ష పార్టీల నాయకులు ఇక్కడి అభివృద్ధిని చూసి కండ్లు తెరవండి. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్ తెచ్చిన సంక్షేమ పథకాలను మీ రాష్ర్టాల్లో అమలు చేయండి. అంతేగానీ కండ్ల మంటతో అనవసర విమర్శలు చేయద్దు’ అంటూ వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు హితవు పలికారు. శుక్రవారం వేములవాడ పట్టణంలోని శ్రీరాజరాజేశ్వరగార్డెన్స్లో బల్దియా పరిధిలో 61, వేములవాడ అర్బన్ మండలంలో ముగ్గురు, వేములవాడ రూరల్ మండలానికి చెందిన 97 మందితో కలిపి మొత్తం 181మంది లబ్ధిదారులకు సుమారు 1.80 కోట్ల విలువైన కల్యాణలక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ దేశంలోనే ఎక్కడాలేనివిధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని చెప్పారు. ఇక్కడి ప్రజలను కంటికిరెప్పలా కాపాడుకుంటున్నారని పేర్కొన్నారు. గడిచిన నాలుగేండ్లలో వేములవాడ నియోజకవర్గానికి 539 కోట్ల రైతుబంధు, 60కోట్ల విలువైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశామని చెప్పారు. పెరిగిన ఆసరా లబ్ధిదారులతో ప్రతినెలా 69వేల మందికి 14కోట్ల పింఛన్లు అందుతున్నాయని చెప్పారు. లక్షా ఐదు వేల మందికి బతుకమ్మ చీరెలు పంపిణీ చేశామన్నారు. బతుకమ్మచీరలో మానవీయకోణం ఉందని, వీటి ద్వారా నేతన్నలకు ఎంతో ఉపాధి కలుగుతుందన్నారు. పట్టణంలో ప్రతి ఇంటికి శుద్ధమైన తాగునీరు అందిస్తున్నామని చెప్పారు. వంద పడకల దవాఖాన ఏర్పాటుచేసి మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ బూర వజ్రమ్మ, జడ్పీటీసీ మ్యాకల రవి, తహసీల్దార్లు రాజారెడ్డి, నక్క శ్రీనివాస్, వైస్ ఎంపీపీ ఆర్సీరావు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పుల్కం రాజు, ఊరడి ప్రవీణ్, గోస్కుల రవి, ఆర్బీఎస్ మండల కోఆర్డినేటర్ కట్కం మల్లేశం, జడల శ్రీనివాస్ ఉన్నారు.