సిరిసిల్ల రూరల్, జూన్ 16: సిరిసిల్ల టెక్స్టైల్పార్క్కు విద్యుత్ సబ్సిడీ మంజూరైంది. రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో 2015 నుంచి 2020 దాకా ఆరేండ్లకాలానికిగాను పరిశ్రమలకు 50శాతం విద్యుత్ సబ్సిడీ మంజూరు చేసింది. ఈ మేరకు జీవో ఆర్టీ నం.88 ను విడుదల చేయగా, యజమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి కేటీఆర్కు రుణపడి ఉంటామని పేర్కొంటున్నారు.
2003లో టెక్స్టైల్పార్క్ ఏర్పాటు
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో వరుస ఆత్మహత్యల నివారణ, కార్మికులకు ఉపాధి కల్పనతోపాటు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు పరిశ్రమల స్థాపన కోసం 2003లో తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి శివారులో టెక్స్టైల్ పార్క్ను అప్పటి ఎన్డీఏ, టీడీపీ ప్రభుత్వాలు ప్రారంభించాయి. తర్వాత 2004-05లో ఐదు యూనిట్లతో పార్క్ ప్రారంభమైంది. చిన్న మధ్య, తరహా పరిశ్రమలకు అనువుగా 216 పాట్లను ఏర్పాటు చేశారు. వీటిలో ప్రస్తుతం 114 పరిశ్రమల్లో సుమారు 3వేల మంది కార్మికులు ప్రత్యక్షంగా, మరో 3 వేల మంది పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. ఏటా 160కోట్ల మీటర్ల వస్త్ర ఉత్పత్తి జరుగుతుంది. ప్రభుత్వం ఆర్డర్లు పెరగడంతో మరింత ఉత్పత్తి పెరిగింది. స్థానికంగా సమస్యలను అధిగమిస్తూ, పరిశ్రమను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో మంత్రి కేటీఆర్ చేనేత, జౌళిశాఖ మంత్రిగా ఉన్న సమయంలోనే వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రణాళికలు చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా 145 పరిశ్రమలకు సబ్సిడీ
రాజన్న సిరిసిల్ల జిల్లాతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా హన్మకొండ, సంగారెడ్డి, యాదగిరి భువనగిరిలోని 145 పరిశ్రమలకు 50 శాతం సబ్సిడీని ఇవ్వనున్నారు. రాష్ట్రంలో ఉన్న యూనిట్లలో అత్యధికంగా 114 పరిశ్రమలు జిల్లాలోనే ఉన్నాయి. వీటికి రూ.30కోట్ల 15లక్షల 48వేల 507 విద్యుత్ బిల్లు ఉండగా, 50శాతం సబ్సిడీ అంటే రూ.15కోట్ల 7లక్షల,72వేల 863 మాఫీ కానుంది. బద్దెనపల్లి పార్క్లో 111 యూనిట్లకు రూ.29 కోట్ల 32 లక్షల 80వేల89 ఉండగా, 50 శాతం సబ్సిడీ అంటే రూ.14 కోట్ల 66లక్షల 40వేల45 మంజూరైంది. అసిస్టెంట్ డైరెక్టర్ పరిధిలోని మరో 3 యూనిట్లకు రూ.65 లక్షల 9వేల 435 బిల్లు ఉండగా, 50శాతం సబ్సిడీ అంటే రూ.32 లక్షల 54వేల 717 మంజూరైంది. ఇది 2015 జనవరి1 నుంచి 2020 డిసెంబర్ 31 వరకు ఉన్న బిల్లుకు మాత్రమే వర్తించనున్నది. అంతకుముందు మంత్రి కేటీఆర్ 2010 నుంచి 2014 దాకా రూ.8.64కోట్ల విద్యుత్ సబ్సిడీ అందించడం, ఇపుడు ఆరేండ్ల విద్యుత్ సబ్సిడీ విడుదల చేయడంతో పరిశ్రమల యజమానులు సంబురపడుతున్నారు.
మంత్రి కేటీఆర్కు రుణపడి ఉంటాం..
సిరిసిల్ల వస్త్రపరిశ్రమకు మంత్రి కేటీఆర్ అండగా నిలుస్తున్నారు. టెక్స్టైల్ పార్కు విద్యుత్ బిల్లు సబ్సిడీ మంజూరు చేయడం సంతోషంగా ఉంది. గతంలో రాష్ట్రం ఏర్పడగానే ఐదేళ్ల విద్యుత్ సబ్సిడీ 8.63కోట్లు ఇచ్చారు. ఇప్పుడు ఆరేండ్ల విద్యుత్ సబ్సిడీ 14.98కోట్లు మంజూరు చేస్తూ జీవో జారీ చేయడం సంతోషంగా ఉంది. ఇంకా పార్కులోని పరిశ్రమలకు ప్రభుత్వ ఆర్డర్లు, బతుకమ్మచీరలు సైతం అందించి కాపాడారు. యాజమానులకు, కార్మికులకు అండగా నిలుస్తున్న సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కు థాంక్స్. రుణపడి ఉంటాం.
– అన్నల్దాస్ అనిల్కుమార్, అధ్యక్షుడు (టెక్స్టైల్ పార్క్)