పోడు భూములు సాగు చేసుకుంటున్న గిరిపుత్రులు, అటవీశాఖ అధికారుల మధ్య తరచూ వివాదాలు నెలకొంటున్నాయి. దీంతో గిరిజనులు మంత్రులు, ప్రజాప్రతినిధులకు వారి గోడును వెల్లబోసుకున్నా.. గత ప్రభుత్వాలు చొరవ చూపలేదు. ఏళ్ల తరబడి ఉన్న ఈ సమస్యను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి పరిష్కార దిశగా అడుగులు వేసింది. సెంటు భూమి కూడా లేని పేదలకు పోడు భూముల్లో హక్కు కల్పించి న్యాయం చేయాలని ఆదేశించింది. ఒక వైపు అటవీ భూములను కాపాడుతూనే.. మరో వైపు పోడు భూముల సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు చర్య లు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 8 నుంచి గిరిజన గ్రామాల్లో సభలు పెట్టి అటవీ హక్కుల చట్టంపై అవగాహన కల్పించింది. అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది.
ముగిసిన దరఖాస్తుల ప్రక్రియ
ఏళ్ల తరబడి పోడు భూముల సాగు చేసుకుంటున్న వారి నుంచి ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించింది. జిల్లాలోని ఎనిమిది మండలాలు, 67 గ్రామాల్లో పోడు భూములు సాగు చేసుకుంటున్న వారి వివరాలు సేకరించింది. అటవీ, పంచాయతీ, రెవెన్యూ శాఖలు సంయుక్తంగా ఐదు రోజుల పాటు నలుగురు అధికారుల చొప్పున 67 బృందాలతో గ్రామ సభలు నిర్వహించాయి. ఈ నెల 12 నుంచి 18 వర కు దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 5,939 దరఖాస్తులు రాగా, అందులో గిరిజనులు 2,842, ఇతరులు 3,097దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం పోడు భూములు 14,013.23 ఎకరాలు. ఇందులో గిరిజనులు 7,7878, ఇతరులు 6,227ఎకరాలు సాగు చేసుకుంటున్నట్లు దరఖాస్తులు వచ్చాయని అధికారులు పేర్కొన్నారు. పంచాయతీ కార్యదర్శికి లబ్ధిదారులు దరఖాస్తులు సమర్పించారు. వచ్చిన వాటిలో నుంచి అర్హులను గుర్తించేందుకు అధికారులు త్వరలో సర్వే చేపట్టి లబ్ధిదారుల సంఖ్య, ఇవ్వాల్సిన భూమి వివరాలను ప్రభుత్వానికి నివేదించనున్నారు.
2005కు ముందు కబ్జాలో ఉన్నవారే అర్హులు
అటవీ హక్కు చట్ట ప్రకారం 13 డిసెంబర్ 2005 కు మందు నుంచి దున్నుకుంటున్న వారికే అర్హత ఉంటుంది. చట్టంపై అవగాహన లేకపోవడం, వారిపై అటవీశాఖ అధికారులు కేసులు పెట్టి కోర్టుల చుట్టూ తిప్పడంతో అనేక ఇబ్బందులకు గురయ్యారు. జిల్లాలో పోడు భూములు సాగు చేసుకుంటున్న వారంతా మంత్రి కేటీఆర్ను కలిసి గోడు వెల్లబోసుకున్నారు. వారి ఆవేదనను అర్థం చేసుకున్న మంత్రి రాష్ట్ర వ్యాప్తంగా సమస్యను పరిష్కరించాలని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. అందుకు ఆయన సానుకూలంగా స్పందిస్తూ వెంటనే ఆదేశాలు ఇవ్వడం, కేటీఆర్ సూచనతో అధికారులు జిల్లాలో గ్రామ సభలు పెట్టి దరఖాస్తులు స్వీకరించారు. అక్రమాలకు పాల్పడినవారు ఎం తటి వారైనా సరే జైలుకు పంపిస్తామని, పోడు భూములు కేవలం పేదలకు మాత్రమే అందాలన్నది సర్కారు ఉద్దేశమని అమాత్యుడు రామన్న పేర్కొన్నారు.. అక్రమాలకు చెక్పెట్టేందుకు ప్రజలంతా లబ్ధిదారులను సూచించాలని కోరారు. ఇందు కోసం కలెక్టరేట్, గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ప్రత్యేక ఫిర్యాదు బాక్సులను ఏర్పాటు చేయాలని కలెక్టర్కు సూచించారు.
దరఖాస్తులను పరిశీలిస్తాం
పోడు భూముల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటున్నది. అందులో భాగంగా ఈ నెల 8 నుంచి అవగాహన సదస్సులు నిర్వహించాం. 12నుంచి అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించాం. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, సర్వే చేపడుతాం. లబ్ధిదారుల జాబితా రూపొందించి సర్కారుకు నివేదిస్తాం.