వేములవాడ రూరల్, జూన్ 12: లలిత కళలకు వెన్నలవాడ వేములవాడ అని సినారె చెప్పిన మాటలు ఇంకా తనకు గుర్తున్నాయని, సినారె ఆశయ సాధనకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు పేర్కొన్నారు. ఆదివారం వేములవాడ రూరల్ మండలం హన్మాజీపేట గ్రామంలో సినారే వర్ధంతి కార్యక్రమంతోపాటు తెలంగాణ సారస్వత పరిషత్తు హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాజన్న సిరిసిల్ల జిల్లా సమగ్ర స్వరూపం గ్రంథావిష్కరణ, రాజన్న సిరిసిల్ల వైభవం అనే కార్యక్రమంలో శాతవాహన యూనివర్సిటీ వీసీ మల్లేశం, పరిషత్ అధ్యక్షుడు ఎల్లూరి శివారెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు మాట్లాడుతూ జ్ఞానపీఠ అవార్డు గ్రహిత సీ నారాయణరెడ్డి గారి మాటలు ఇంకా నేను మరిచిపోలేదని, 1969లో గంటసాల సభలో పాల్గొన్నప్పుడు ఆయన చెప్పిన కవిత్వంలో లలిత కళలకు వెన్నలవాడ వేములవాడ అనే మాట నాకు బాగా గుర్తుందన్నారు. ఆయన ఆశయసాధనలో భాగంగా వేములవాడలో వేద పాఠశాలతో పాటు రానున్న రోజుల్లో సంగీతం, నాట్య పాఠశాలలు రానున్నాయన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కళాకారులకు పెద్దపీట వేస్తున్నదన్నారు. పట్టణంలోని సినారె భవనం శిథిలావస్థకు చేరడంతో, ఈ భవనాన్ని తీసివేసి రూ.10 కోట్లతో కొత్తగా సినారె ఆడిటోరియాన్ని కొత్తగా నిర్మించబోతున్నామన్నారు. సినారె తెలుగు ప్రాంతా నికి ముద్దబిడ్డ అని, తెలుగు ప్రజలందరికి వారంటే ఎనలేని గౌరవం అన్నారు. హన్మాజీపేట మూలవాగుపై బిడ్జి నిర్మాణంతో పాటు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా ఆయన సానుకూలంగా స్పందించారు. అలాగే శాతవాహన యూనివర్సిటీ వీసీ మల్లేశంతో పాటు తెలంగాణ సారస్వత పరిషత్ అధ్యక్షులు ఎల్లూరి శివారెడ్డి, పత్తిపాక మోహన్, రాము, వంశీరామరాజు, ఎస్వీ రామరావు తమకు సినారేతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. అనంతరం సినారె ఘాట్ వద్ద నివాళులర్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ జంకె విజయ, తెలంగాణ సారస్వత పరిషత్తు ప్రధాన కార్యదర్శి జుర్రు చెన్నయ్య, జిల్లా సమగ్ర స్వరూపం కోర్కమిటి కన్వీనర్ గరిపెల్లి అశోక్, కోరికమిటి సభ్యులు పత్తిపాక మోహన్, పెద్దింటి అశోక్, జనపాల శంకర్య్య, సంకెపల్లి నాగేంద్రశర్మ, పరుశరాం, ఎలిగొండ రవి, గోనే బాల్రెడ్డి, జిందం అశోక్, వడ్డెపల్లి సంద్య, సినారె కుతూరు అల్లులు, గంగ, యమున, సరస్వతి, కృష్ణవేణి, భాస్కర్రెడ్డి, సురేందర్రెడ్డి, సంతోష్రెడ్డి, వెంకట్రెడ్డితో పాటు కవులు, కళాకారులు పాల్గొన్నారు.