ముస్తాబాద్, జూన్ 11: తెలంగాణ సర్కారు అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికే దిక్సూచిగా నిలుస్తున్నాయని నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు అభివర్ణించారు. మన స్కీంలను కేంద్రంతో పాటు ఇతర రాష్ర్టాలు పేర్లు మార్చి అమలు చేయడమే ఇందుకు నిదర్శనమని చెప్పారు. ఈ ఎనిమిదేండ్లలో నీటి వనరుల వినియోగంలో అనితరసాధ్యమైన విజయాలు నమోదు చేసిన ప్రభుత్వం ఇప్పుడు విద్య, వైద్య, క్రీడారంగాలకు ప్రాధాన్యమిస్తున్నదని స్పష్టం చేశారు. ముస్తాబాద్ గవర్నమెంట్ బాయ్స్ హైస్కూల్లో అరబిందో ఫార్మా ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ. 6కోట్ల సీఎస్ఆర్ నిధులతో నిర్మించనున్న పాఠశాల భవనానికి శనివారం కలెక్టర్ అనురాగ్ జయంతి, ఫౌండేషన్ జీఎం రాధామాధవ్, సాకేత్రావుతో కలిసి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ యువత కోసమే ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న క్రీడా ప్రాంగణాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అరబిందో ఫార్మా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అధునాతన కంప్యూటర్ ల్యాబ్, సకల హంగులతో పాఠశాలను నిర్మించడం అభినందనీయమన్నారు.
రాజన్నసిరిసిల్ల జల్లాలో మంత్రి కేటీఆర్ చొరవతో సర్కారు బడులు కార్పొరేట్ తరహాలో రూపుదిద్దుకుంటున్నాయని చెప్పారు. సమీప భవిష్యత్లో తల్లిదండ్రులందరూ తమ పిల్లలను సర్కారు స్కూళ్లకు పంపే రోజులు రావాలని అభిలషించారు. అరబిందో ఫార్మా ఫౌండేషన్ జీఎం రాధామాధవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో 200 పాఠశాలలు నిర్మించామని తెలిపారు. ముస్తాబాద్లో డిజిటల్ బోధనకు వీలుగా 21 అధునాతన తరగతి గదులు, కంప్యూటర్ ల్యాబ్, ఒకేసారి 500 మంది భోజనం చేసేలా డైనింగ్హాల్, విశాలమైన ఆటస్థలం తదితర మౌలిక వసతులు కల్పిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆరబిందో ఫార్మా డైరెక్టర్లు నిత్యానంద్రెడ్డి, చంద్రశేఖర్రెడ్డి ,సాకేత్రావు, ఎంపీపీ జనగామ శరత్రావు, జడ్పీటీసీ గుండం నర్సయ్య, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, రజక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.