రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్, మే 19: ప్రజారోగ్యమే లక్ష్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన ‘హెల్త్ ప్రొఫైల్’ వేగంగా సాగుతున్నది. సర్కారు ఆదేశాలతో రంగంలోకి దిగిన వైద్య, ఆరోగ్య యంత్రాంగం, రెండు నెలలుగా నిత్యం 50 బృందాలతో ఇంటింటికీ వెళ్లి పరీక్షిస్తున్నది. కలెక్టర్ అనురాగ్ జయంతి నిత్యం సమీక్షిస్తుండగా, ఇప్పటివరకు 1,08,892 గృహాల్లో 2,36,291 మందిని పరీక్షించి 3,43,534 రక్తనమూనాలు సేకరించింది. టార్గెట్ను పూర్తి చేసేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నది.
సర్వే వేగంగా పూర్తి చేస్తాం
జిల్లాలో హెల్త్ ప్రొపైల్ సర్వేను వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఆ దిశగా ఇప్పటికే సర్వే బృందాల సంఖ్యను పెంచాం. ఫలితాలను వేగంగా విశ్లేషించి నిక్షిప్తం చేసేందుకు జిల్లా కేంద్రమైన సిరిసిల్లలోని డయాగ్నస్టిక్ హబ్తో సహా సిద్దిపేట, కరీంనగర్ జిల్లాల హబ్ల సేవలను ఉపయోగించుకుంటున్నాం.
– అనురాగ్ జయంతి, రాజన్న సిరిసిల్ల కలెక్టర్
రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్, మే 9: ప్రజారోగ్యమే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. వైద్యాన్ని మరింత చేరువ చేసే దిశగా అడుగులు వేస్తున్నది. అందులో భాగంగా ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ రూపొందిస్తున్నది. వివిధ వ్యాధులతో బాధపడుతున్నవారికి మరింత మెరుగైన వైద్యం అందించడం, దేశంలో ఎక్కడికి వెళ్లినా ఆన్లైన్లో ఉన్న సమాచారం ఆధారంగా సేవలు పొందే వీలుగా చేపడుతున్న ఈ కార్యక్రమానికి పైలట్ ప్రాజెక్టులుగా రాజన్న సిరిసిల్ల, ములుగు జిల్లాలను ప్రభుత్వం ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని మార్చి 5న వేములవాడలో మంత్రి కేటీఆర్ ప్రారంభించిన విషయం విదితమే. ఆ తర్వాతి నుంచే జిల్లాలో సర్వే మొదలైంది. ఆరోగ్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి 18ఏళ్ల పైబడిన వారందరి ఆరోగ్య వివరాలు సేకరించి ఆన్లైన్లో నిక్షిప్తం చేస్తున్నారు. ప్రతి ఒక్కరి బ్లడ్ గ్రూప్ నుంచి మొదలుకొని 30 రకాల పరీక్షలు నిర్వహిస్తున్నారు. బీపీ, షుగర్తోపాటు క్యాన్సర్, గుండెపోటు, కిడ్నీ, లివర్, ఊపిరితిత్తులు, క్షయ లాంటి వివిధ రకాల వ్యాధులను పరీక్షిస్తున్నారు.
వేగంగా సర్వే..
ఒకే ఒక్క క్లిక్తో ప్రజల ఆరోగ్య చరిత్ర తెలుసుకునేలా ఈ-హెల్త్ ప్రొపైల్ రూపొందించే కార్యక్రమంలో కలెక్టర్, డీఎంహెచ్వో తలమునకలై ఉన్నారు. సర్వేను వీలైనంత త్వరగా పూర్తి చేసే లక్ష్యంతో కలెక్టర్ అనురాగ్ జయంతి పర్యవేక్షణ లో జిల్లాలోని 15 పీహెచ్సీల పరిధిలో 203 బృందాలు ఇంటింటికీ వెళ్లి పరీక్షలు చేస్తున్నారు. మరింత వేగం పెంచేందుకు ఫైనల్ సంవత్సరం నర్సింగ్ విద్యను అభ్యసిస్తున్న 84 మంది సేవలనూ ఉపయోగించుకుంటున్నారు. ఫలితంగా వేగం పెరిగింది. 18 ఏండ్లు, ఆ పైన వ్యక్తులు 3.60లక్షల మంది ఉండగా, ఇప్పటి వరకు 2 లక్షల 40 వేల మందిని పరీక్షించి 3,43,534 రక్తనమూనాలను సేకరించారు.
ప్రతి ఒక్కరికీ డిజిటల్ హెల్త్ కార్డు..
రక్త నమూనాలు సేకరించి గుర్తించిన వ్యాధులు, అందించాల్సిన చికిత్స వివరాలను ‘డిజిటల్ హెల్త్ ప్రొఫైల్’ రూపంలో కంప్యూటర్లో భద్రపరుస్తారు. సదరు వ్యక్తులకు ఉచితంగా మందులు అందజేయడమే కాకుండా భవిష్యత్లో వచ్చే వ్యాధులను ముందుగానే అంచనా వేసి కట్టడి చేసేందుకు ప్రత్యేక గుర్తింపు సంఖ్యతో కూడిన డిజిటల్ హెల్త్ కార్డును కార్డును అందజేయనున్నారు. ఆ కార్డుకు ఆధార్ సంఖ్యను అనుసంధానిస్తారు. దీని వల్ల ఆ వ్యక్తి ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ఉన్నపుడు డిజిటల్ ఆరోగ్య కార్డు ద్వారా అతని ఆరోగ్య సమాచారాన్ని డాక్టర్ పూర్తిగా తెలుసుకునే వీలు కలుగుతుంది. మెరుగైన వైద్యం అందుతుంది.
అత్యాధునిక పరిజ్ఞానంతో విశ్లేషణ, ఫలితాలు నిక్షిప్తం..
అయితే నమూనాలు పరీక్షించడంలో జాప్యం జరుగుతుండడంతో నివారణకు మంత్రి కేటీఆర్ చొరవతో 30 కోట్ల విలువైన పరికరాలను ఉపయోగిస్తున్నారు. ఫలితాలను కచ్చితత్వంతో విశ్లేషించడం, నమోదు చేసేందుకు ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్తో నడిచే పరికరాలు వాడుతున్నారు. ఏఐ పరిజ్ఞానంతో నిక్షిప్తం చేస్తున్నారు. మూడు ఇంటిగ్రేటెడ్ అనలైజర్ మిషన్లు, నాలుగు సీపీబీ అనలైజర్లు, ఆరు రక్త గ్రూపులు, సెంట్రల్ ఫ్యూజియర్ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ సాంకేతిక విభాగం పర్యవేక్షణలో వీటి నిర్వహణ ఉంటుంది. రోజుకు సగటున ఆరు వేల రక్తనమూనాలను పరీక్షించడంతో పాటు వాటి పూర్తి వివరాలను కంప్యూటర్లో నమోదు చేస్తున్నారు. ప్రతి ఒక్కరి ఆరోగ్య వివరాలను గోప్యంగా ఉంచడానికి ప్రత్యేక సాఫ్ట్వేర్ను రూపొందిస్తున్నారు. ఇంకా రక్త నమూనాలను వేగంగా విశ్లేషించేందుకు సిరిసిల్లలోని తెలంగాణ డయాగ్నస్టిక్ హబ్తో సహా సిద్దిపేట, కరీంనగర్ జిల్లాల తెలంగాణ డయాగ్నస్టిక్ హబ్ సేవలను ఉపయోగించుకుంటున్నారు. నమూనాలను వేగంగా తరలించేందుకు మొత్తం 26 ప్రత్యేక వాహనాలను అద్దె ప్రాతిపదికన సమకూర్చుకున్నారు.