సిరిసిల్ల రూరల్, మే 14 : రాష్ట్రంలోని అన్ని పోలీసుస్టేషన్లకు భవనాలు ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని, ఇందుకు ఈ ఏడాదిలో బడ్జెట్లో నిధులు కేటాయించిందని రాష్ట్ర డీజీపీ మహేందర్రెడ్డి స్పష్టం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రమైన సిరిసిల్లలోని బైపాస్రోడ్డులో ఉన్న కలెక్టరేట్ ప్రాంగణంలో నిర్మిస్తున్న జిల్లా పోలీసు కార్యాలయాల భవనాల సముదాయాన్ని ఆయన సందర్శించారు. రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కొలేటి దామోదర్ గుప్తా, మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్కుమార్ జైన్, హౌసింగ్ బోర్డు ఎస్పీ డాక్టర్ చేతన్, కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ రాహుల్ హెగ్డే, హౌసింగ్ బోర్డు అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. మొదట జిల్లా పోలీస్ భవనాల మ్యాప్ను పరిశీలించి, నిర్మాణంలో ఉన్న పోలీస్ భవనాన్ని కలియ తిరిగి పర్యవేక్షించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. శాంతి భద్రతల పర్యవేక్షణను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పోలీసుశాఖకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నారని చెప్పారు.
నూతన జిల్లాల్లో మొదటగా డీపీవో భవనాలు పూర్తి చేసిన తర్వాత పోలీస్స్టేషన్ల భవనాలు అవసరమయిన చోట గుర్తించి, నిర్మిస్తామని చెప్పారు. ప్రజలకు సత్వర పోలీసు సేవలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అన్ని హంగులుతో, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో జిల్లా పోలీసు కార్యాలయ భవనాలను నిర్మిస్తున్నదన్నారు. జిల్లా పోలిసు ప్రదాన కార్యాలయాల సముదాయన్ని వీలైనంత త్వరగా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. కాంట్రాక్టర్స్, డిజైనర్స్, ఆర్కిటెక్కర్స్, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ అధికారులు ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీలో చెప్పిన సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. జిల్లా పోలీసు కార్యాలయాన్ని ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలన్నారు. కార్యక్రమంలో తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ చీఫ్ ఇంజినీర్ విజయ్కుమార్, అదనపు ఎస్పీ చంద్రయ్య, ఆర్డీవో శ్రీనివాస రావు, డీఎస్పీ చంద్రకాంత్, ఈఈ శ్రీనివాస్, డీఈఈ విశ్వనాథం, ఏఈ రాజశేఖర్, సీఐలు అనిల్కుమార్, ఉపేందర్, వెంకటేశ్, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది ఉన్నారు.
రాజన్న సన్నిధిలో పూజలు
వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వరస్వామివారిని శనివారం రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో వారికి ఎస్పీ రాహూల్హెగ్డే మర్యాదపూర్వకంగా పూలమొక్కను అందజేశారు. ఆలయ ప్రాంగణంలో డీజీపీ పోలీస్ వందనం స్వీకరించారు. అనంతరం స్థానాచార్యులు అప్పాల భీమాశంకర్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఏఈవో బ్రహ్మన్నగారి శ్రీనివాస్ వారికి స్వామివారి ప్రసాదాన్ని, చిత్రపటాన్ని అందజేశారు. వారి వెంట వేములవాడ డీఎస్పీ చంద్రకాంత్, పట్టణ సీఐ వెంకటేశ్, రూరల్ సీఐ బన్సీలాల్, అర్బన్ తహసీల్దార్ మునీందర్, ఆలయ అధికారులు, తదితరులు ఉన్నారు.