జిల్లాలో వానకాలం వరి పంట అంచనాలకు మించి దిగుబడి వస్తున్నది. అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలుకు ఏర్పాట్లు చేసింది. సీఎం కేసీఆర్ రైతులు పండించిన ప్రతి గింజా కొనాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలోని 255 గ్రామ పంచాయతీలు ఉండగా అధికారులు 265 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం సేకరణ ప్రారంభించారు. గత నెల 26 నుంచి 249 సెంటర్లలో వడ్లు కొంటున్నారు. ఇప్పుడిప్పుడే కోతలు ప్రారంభమైనందున మిగిలిన కేంద్రాలు ప్రారంభించలేదు.
టార్గెట్ 3.50 లక్షల మెట్రిక్ టన్నులు
మెట్ట ప్రాంతమైన సిరిసిల్ల ఏడేళ్ల కింద కరువు, దుర్భిక్షంతో తల్లడిల్లి పోయింది. వర్షాభావ పరిస్థితులు, మరోవైపు సాగునీటి వనరులు లేక సేద్య రంగం పూర్తిగా నిర్వీర్యమైంది. తెలంగాణ ప్రభు త్వం నిర్మించిన మధ్యమానేరు ప్రాజెక్టు, మల్లన్నసాగర్ ద్వారా ఎగువ మానేరుకు గోదావరి జలాల ను తెప్పించడం వల్ల భూగర్భ జలాలు జిల్లాలో ఆరుమీటర్ల ఎగువకు చేరాయి. 24గంటల కరెం ట్, సరిపడా సాగునీటితో బీడు భూములన్నీ పచ్చ గా మారాయి. ఎటు చూసినా కాలువలు, చెరువుల్లో నీరుతో కోనసీమను తలపిస్తున్నాయి.
4 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి అంచనా
ఏడు దశాబ్దాల చరిత్రను తిరగరాస్తూ అంచనాలకు మించి ధాన్యం దిగుబడి వచ్చింది. రైతుబం ధు, రైతుబీమా, ఉచిత కరెంట్, సాగునీరు, ఎరువులు, విత్తనాలు ఇచ్చి రైతును ప్రోత్సహించడంతో దండిగా వరి పంటను సాగు చేశారు. వానకాలంలో 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికార యంత్రాంగం అంచనా వేసింది. అందులో 3.50లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేయాలని నిర్ణయించిం ది. సెంటర్లు ప్రారంభించిన 19రోజుల్లోనే 5,510 మంది రైతుల నుంచి 71 కోట్ల విలువ గల 37 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది.
మొబైల్లోనే రిజిస్ట్రేషన్..
కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించాలనుకొనే రైతులుతమ మొబైల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. ఆధార్కార్డు, పట్టాదారు పాసుపుస్తకం, భూమి వివరాలు, మొబైల్ నంబర్, బ్యాంకు ఖాతా, ఐఎఫ్సీ కోడ్ వంటివి నమోదు చేసుకుంటే కేంద్రాలకు వెళ్లిన వెంటనే తూకం వేస్తారు. మున్సిపల్ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు కలెక్టర్ అనురాగ్ జయంతి ఆధ్వర్యంలో అధికారులు నిత్యం ధాన్యం కొనుగోళ్లను పర్యవేక్షిస్తూ ఇబ్బందులు తలెత్తకుండా చర్య లు తీసుకుంటున్నారు.
రెండు రోజుల్లో నగదు జమ ..
అన్నదాతలు విక్రయించిన ధాన్యానికి డబ్బులు రెండు రోజుల్లో జమ చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. విక్రయించిన రైతులకు వెంట వెంటనే ఖాతాలో నగదు జమ చేయాలని ప్రభు త్వం ఆదేశాలతో అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కేంద్రాల్లో అన్ని మౌలిక సౌకర్యాలను ఏర్పాటు చేశారు. కాంటాలు, తాలుతీసే యంత్రా లు, వర్షానికి వడ్లు తడువకుండా ఉండేందుకు టార్పాలిన్లు అందుబాటులో ఉంచారు.