ప్రతి ధాన్యపు గింజనూ కొంటామన్న ముఖ్యమంత్రి కేసీఆర్ మరోమారు రైతుబాంధవుడు అని నిరూపించుకున్నారు. ఆయన చేసిన ప్రకటనతో రైతులు సంతోషంలో మునిగితేలుతున్నారు.. కేంద్రం కొర్రీలు పెట్టినా భరోసానిచ్చారని చెబుతున్నారు. అడుగడుగునా అన్నదాతకు అండగా నిలుస్తున్న ఆయన రుణం తీర్చుకోలేనిదని స్పష్టం చేస్తున్నారు. ధాన్యం కొనుగోలుపై సీఎం స్పష్టమైన హామీ ఇచ్చిన నేపథ్యంలో పలువురు రైతులు తమ మనోగతాన్ని ‘నమస్తే’తో పంచుకున్నారు.
రైతుల గోస తెల్సుగావట్టే కొంటున్నడు
నిజంగ రైతుల మేలు కోసం ఆలోచించే ఒకే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్ సారు.. ఎవ్వలుగూడ గిట్ల రైతుల కోసం మంచిపనులు చెయ్యలే. యాసంగి వడ్లు మేమే కొంటమన్న బీజేపోళ్లు తప్పించుకొని.. పంట సేతికచ్చినంక యాసంగి వడ్లు కొనం.. బియ్యం కొంటం అని రెండు మాటలు మాట్లాడిన్రు.. వాళ్ల తీరు చూసి నాకు బాధనిపించింది. కేంద్రం కొంటదనుకొని నేను తొమ్మిదెకరాలల్ల వరేసిన. వాళ్లు కొనం అనేటాల్లకు పరేషాన్ అయిన. రైతుగోస తెల్సెపటికె ఇయ్యాళ రూ.1960కి కొంటం అని కేసీఆర్ సార్ చెప్పిండు. ముఖ్యమంత్రి సార్ను రైతులు ఎన్నటికీ మర్సిపోరు.
– ఇల్లెందుల పద్మారెడ్డి, రైతు, బొప్పాపూర్ (ఎల్లారెడ్డిపేట)
బీజేపోళ్లు ఉత్త మాటల మనుషులే..
కేసీఆర్ సార్ రైతుల పక్షపాతి అని మరోసారి నిరూపించుకున్నరు. కేంద్రం వడ్లు కొననప్పటికీ ముఖ్యమంత్రి ముందడుగు వేయడం రైతులకు శుభపరిణామం. టీఆర్ఎస్ ప్రభుత్వం వడ్లు కొనకుంటే రైతులు చాలా నష్టపోయెటోళ్లు. ఎకరానికి సుమారు రూ.10 వేల నష్టం వచ్చేది. ఇప్పటికైనా రైతులు అలోచించి వచ్చే ఎన్నికల్లో తగిన నిర్ణయం తీసుకోవాలె. బీజేపోళ్లు మాటల మనుషులే కానీ చేతల్లో చూపరని ఇప్పటికైనా తెల్సుకోవాలె. రైతులంతా అగంగాకుంట కొనుగోలు కేంద్రాలకు వరి ధాన్యం తరలించాలె.
– ఎడవెల్లి కొండల్రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ (హుజూరాబాద్)
రైతుల గోస తెలిసిన వ్యక్తి
ఆరుగాలం భూమిని నమ్ముకుని ఎవుసం చేసే రైతుల గోసను పట్టించుకున్న పెద్దసారు నిర్ణయం చాలా గొప్పది. యాసంగి వడ్లను కొనేది లేదని ప్రధానమంత్రి చెప్పినా ముఖ్యమంత్రి సారు మేం కొంటామని చెప్పినంక రైతులకు ధైర్యం వచ్చింది. నాకు దమ్మన్నపేట శివారుల మూడెకరాలున్నది అందుల ఎకరం అరుతడి పంటలు, మిగతా రెండెకరాలల్ల వరేసిన. కేంద్రం కొనకపోతే పెట్టిన పెట్టుబడి తీర్చలేక రోడ్డున పడేవాళ్లం. రాష్ట్ర ప్రభుత్వమే వడ్లు కొంటదని చెప్పిన సీఎం కేసీఆర్ సారుకు రుణపడి ఉంటం.
-అరుట్ల అంజిరెడ్డి. రైతు. దమ్మన్నపేట, (గంభీరావుపేట)
ముఖ్యమంత్రి రైతు పక్షపాతి
వడ్లను కొంటానని ప్రకటించిన సీఎంకేసీఆర్ రైతు పక్షపాతి అని మరోసారి రుజువైంది. బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రైతులు పండించిన ధాన్యం కొనబోమని తొండి పెట్టింది. పంటలు చేతికొచ్చిన ఈ సమయంలో రైతులను పరేషాన్ జేసింది. గొప్ప మనసున్న నేత కేసీఆర్ మద్దతు ధర రూ.1960 పెట్టి గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల ద్వారా తీసుకుంటామని చెప్పడం సంతోషం. ఆయనకు రైతుల తరఫున కృతజ్ఞతలు.
– కావటి రాజుయాదవ్, ఆర్బీఎస్ మండలాధ్యక్షుడు, (ఓదెల)
కేంద్రపోళ్లు ఆగంజేసిన్రు..
నేను ఐదేండ్ల సంది ఐదెకరాలు కౌలుకు దీసుకొని వరి వేస్తున్న. ఈ యేడు వడ్లు బాగా పండినయ్..ఇగ అప్పులు తీరుతయ్ అని సంతోషపడ్డ టైంల కేంద్రపోళ్లు ఆగం చేసిన్రు.. సీఎం కేసీఆర్ మత్తు కొట్లాడినా వడ్లు కొనేందుకు ఒప్పుకోలె..మస్తు రందీపెట్టుకున్న. అప్పులు తీర్చుడెట్ల అని పరేషాన్ల పడ్డ.. అయితే ఇయ్యాళ్ల సీఎం సారు ప్రతి వడ్ల గింజనూ కొంటమని చెప్పడంతో మురిసిపోయిన. బొందిలో జీవమున్నంత కాలం ఆయన జేసిన మేలును తలుచుకుంటం.
-కొత్తూరి రాజమల్లయ్య, కౌలు రైతు, నల్లగొండ( కొడిమ్యాల)