సిరిసిల్ల టౌన్, ఏప్రిల్ 12: మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అధునాతన వసతులతో కూడిన నూతన అంబేద్కర్ భవనం రూపుదిద్దుకున్నది. ఎస్సీ సంక్షేమశాఖ మంజూరు చేసిన రూ.2కోట్లతో సిరిసిల్ల-వేములవాడ బైపాస్ రోడ్డు ప్రాంతంలోని నర్సింగ్ కళాశాల సమీపంలో ఎకరం స్థలంలో భవన నిర్మాణం పూర్తయింది. గ్రౌండ్ఫ్లోర్లో డైనింగ్ హాల్, కిచెన్, ఫస్ట్ ఫ్లోర్లో సమావేశ మందిరాన్ని నిర్మించారు. వంద మంది కూర్చునేలా మీటింగ్ హాల్లో సీటింగ్ను అమర్చారు. ఈ నెల 14న అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని భవనాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. దీంతో దళిత సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి కేటీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు. కాగా, ప్రారంభానికి సిద్ధమైన భవనాన్ని కలెక్టర్ అనురాగ్ జయంతి మంగళవారం పరిశీలించారు. పరిసరాల్లో మొక్కలు నాటాలని, పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తాగునీరు, విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని సూచించారు. ఆయన వెంట ఎస్సీ వెల్ఫేర్ అధికారి భాస్కర్రెడ్డి, ఈడబ్ల్యూఐడీసీ ఈఈ విరూపాక్ష, పీఆర్ ఈఈ సూర్యప్రకాశ్, తహసీల్దార్ విజయ్కుమార్ తదితరులున్నారు.