వేములవాడ, ఏప్రిల్ 12: వేములవాడ బల్దియా పన్ను చెల్లింపుదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ముందస్తుగా కట్టేవారికి 5శాతం డిస్కౌంట్ ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకు ఈ నెలాఖారు (ఏప్రిల్ 30) వరకు గడువు విధించింది. గతేడాది అమలు చేసిన రాయితీ పథకానికి విశేష స్పందన లభించింది. 60లక్షల మేర ఆదాయం సమకూరింది. ఇదే స్ఫూర్తితో ఈ యేడు కోటి రాబట్టేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నది. వాడవాడలా విస్తృత ప్రచారం చేయాలని సంకల్పించింది.
వేములవాడ మున్సిపల్ పరిధిలో 13,152 నివాసాలు ఉన్నాయి. ఆస్తిపన్ను డిమాండ్ 2కోట్ల 75లక్షల 77వేలుగా ఉన్నది. గత ఆర్థిక సంవత్సరం 2021-22లో 2కోట్ల 45లక్షల 20 వేలు (90.67 శాతం) వసూలు చేశారు. అంతకుముందు ఆర్ధిక సంవత్సరంతో పోల్చితే 5 శాతం తగ్గుదల కనిపించింది.
ఈ యేడు 3.08 కోట్ల పన్ను డిమాండ్
వేములవాడ బల్దియా పరిధిలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి కరెంట్ బకాయిలు, ఏరియర్స్ కలిపి 3కోట్ల 8లక్షల 38వేల ఆస్తిపన్ను డిమాండ్ ఉన్నది. ప్రభుత్వం గతేడాది సైతం 5శాతం డిస్కౌంట్ ఇవ్వడంతో 60 లక్షల ఆదా యం సమకూరింది. ఈ పరిస్థితుల్లో ఈ సంవత్సరం కోటి లక్ష్యంగా పాలకవర్గం ముందుకెళ్తున్నది. ఈ దిశగా వాడవాడలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రజలను చైతన్యవంతం చేయాలని నిర్ణయించింది. అలాగే వాల్పోస్టర్లు, సోషల్ మీడియా వేదికగా విస్తృత ప్రచారం చేయనున్నది. కరోనా ప్రభావం లేకపోవడంతో పన్ను చెల్లింపుదారుల నుంచి విశేష స్పందన లభించే అవకాశమున్నదని భావిస్తున్నది.
విస్తృత ప్రచారం చేస్తాం
ముందస్తుగా ఆస్తిపన్నులు చెల్లించే యజమానులకు ప్రభుత్వం ఈ ఏడాది కూడా 5శాతం డిస్కౌంట్తో చెల్లించేందుకు అవకాశం కల్పించింది. గతేడాది వేములవాడ పురపాలక సంఘంలో డిస్కౌంట్ ద్వారా 60 లక్షల పన్నులను వసూలు చేశాం. ఈ ఏడాది మరింత విస్తృత ప్రచారం చేసి కోటి రూపాయల వరకు వసూలు చేయాలని నిర్ణయించినం. ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నం. ప్రజలు అవకాశాన్ని అందిపుచ్చుకొని రాయితీ స్కీంను వినియోగించుకోవాలి.
– శ్యాంసుందర్రావు, కమిషనర్ వేములవాడ