సిరిసిల్ల, ఏప్రిల్ 6: అభయహస్తం లబ్ధిదారులకు సీఎం కేసీఆర్ తీపి కబురందించారు. ఉమ్మడి ప్రభుత్వాల హయాంలో స్వయం సహాయక సంఘాలు(ఎస్హెచ్జీ) జమ చేసుకున్న సొమ్మును తిరిగి వారి ఖాతాలోనే జమ చేయాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. నాటి ఉమ్మడి ప్రభుత్వాలు అందించే పింఛన్ కన్నా తెలంగాణలో పది రెట్లు పింఛన్ అందిస్తుండడంతో ఈ పథకాన్ని నిలిపివేశారు. కాగా లబ్ధిదారులు ఆసరా పింఛన్ తీసుకుండడంతో మహిళలు గతంలో చెల్లించిన వాటాధనాన్ని తిరిగి వారి ఖాతాలో జమ చేయనున్నారు.
పథకం విధివిధానాలు..
తెలంగాణ రాక ముందు స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్న మహిళలు 50 ఏండ్లు దాటితే ‘అభయ హస్తం’ పథకాన్ని వర్తింప జేశారు. దీంతో ‘కో కంట్రి బ్యూటర్ పెన్షన్ యాక్ట్ -2009’లో కింద సభ్యులు ఒక్కొక్కరు ఏడాదికి రూ.365 ప్రీమియం చెల్లిస్తే.. వారికి 60 ఏండ్లు నిండిన తర్వాత రూ.500 చొప్పున పింఛన్ వచ్చేలా పథకాన్ని రూపొందించారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రీమియాన్ని సభ్యులు తొమ్మిదేళ్ల పాటు చెల్లిస్తూ వస్తున్నారు. స్వరాష్ట్రంలో ప్రభుత్వం ‘ఆసరా’ కింద రూ.2016 చొప్పున పింఛన్ అందజేస్తున్నది. పింఛన్ తీసుకుంటున్న వారిలో స్వయం సహాయక సంఘాల సభ్యులు కూడా ఉన్నారు. దీంతో గ్రూపు సభ్యులు అభయహస్తం పింఛన్పై విముఖత చూపారు. అప్పటి నుంచి వేలాది మంది ప్రీమియం చెల్లించకుండా ఆగిపోయారు. గ్రూపు సభ్యులు చెల్లించిన ప్రీమియాన్ని తిరిగి చెల్లించాలని కోరగా, ప్రభుత్వం సానుకూలంగా స్పందించి అంగీకరించింది. నేరుగా సభ్యుల ఖాతాల్లో జమ చేసేందుకు సెర్ప్ అధికారులు జాబితాను సిద్ధం చేశారు.
ఉమ్మడి జిల్లాలో లక్షలాది మందికి లబ్ధి..
ఉమ్మడి జిల్లాలో అభయ హస్తం ప్రీమియా న్ని లక్షలాది మంది చెల్లించారు. ఈ క్రమంలో మండలాల వారీగా ప్రీమియం చెల్లించిన సభ్యులు, బ్యాంక్ ఖాతాల వివరాలను సెర్ప్ అధికారులు సేకరించారు. ప్రభుత్వ అనుమతులు రాగానే చెల్లించిన వాటా ధనాన్ని ఖాతాలోనే జమ చేయనున్నారు. కాగా, రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా 60,881 మంది ప్రీమి యం చెల్లించారని, త్వరలోనే ఖాతాల్లో జమ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.