వేములవాడ రూరల్, ఏప్రిల్ 1: అరకిలో కోడికూర కొని.. నాణ్యత బాగాలేదని సెంటర్ నిర్వాహకుడితో కొనుగోలు దారులు పెట్టుకున్న గొడవ తీవ్ర ఘర్షణకు దారి తీసింది. ఇరువర్గాల మధ్య రాయలసీమను తలదన్నేలా గంటపాటు ఫైటింగ్ జరిగింది. చివరికి కోపోద్రిక్తులైన కలకత్తావాసులు, వారి కుటుంబ సభ్యులు ఏది దొరికితే అది కర్రలు, రాడ్లు, యాసిడ్తో దాడి చేయగా, పది మందికి గాయాలైన ఘటన వేములవాడ పట్టణం తిప్పాపూర్లో గురువారం రాత్రి జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఉపాధి కోసం కలకత్తా నుంచి వచ్చి వేములవాడ రాజన్న ఆలయం సమీపంలో ఉంగరాలు అమ్ముతూ.. టాటూలు వేస్తూ జీవిస్తున్న కొన్ని కుటుంబాలు తిప్పాపూర్ వద్ద సప్తగిరికాలనీలో నివాసం ఉంటున్నాయి. అయితే అందులో ఇద్దరు కలకత్తా వాసులు సందీప్, నాగరాజు గురువారం రాత్రి తిప్పాపూర్లో అరకిలో చికెన్ కొనుగోలు చేసి, ఇంటికి వెళ్లారు. అరగంట తర్వాత సందీప్, నాగరాజు మళ్లీ చికెన్ సెంటర్ వద్దకు వచ్చారు. చికెన్ నాణ్యతగా లేదని, వాసన వస్తున్నదని నిర్వాహకుడు హరీశ్తో గొడవపడ్డారు.
ఇదే క్రమంలో అక్కడే ఉన్న హరీశ్ ఫ్రెండ్.. తిప్పాపూర్ మాజీ సర్పంచ్ భర్త దుర్గం పరశురాములు కలుగజేసుకోగా, అతనితోనూ గొడవకు దిగారు. తిరిగి ఇంటికి వెళ్లిపోయారు. అనంతరం హరీశ్ తన స్నేహితులు పరశురాములుతోపాటు చిరంజీవి, మహేశ్, నరేశ్తో పాటు స్థానికులు కొంత మందితో కలిసి సప్తగిరికాలనీలో నివాసం ఉంటున్న సందీప్, నాగరాజు కుటుంబసభ్యుల వద్దకు వెళ్లి మాట్లాడుతుండగా, మాటామాటా పెరిగి ఇరువర్గాల మధ్య రాయలసీమను తలదన్నేలా గంటపాటు ఘర్షణ జరిగింది. దీంతో కలకత్తా వాసులు యాసిడ్, కర్రలతో దాడి చేయగా, హరీశ్, పరశురాములు, చిరంజీవి, మహేశ్, రాజు, నరేశ్, రాజు, శ్రీకాంత్, సాయి, వంశీతో పాటు మరికొంత మందికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు వేములవాడ ఏరియా దవాఖానతోపాటు ప్రైవేటు దవాఖానకు తరలించారు.
మహేశ్ పరిస్థితి విషమంగా ఉండగా కరీంనగర్లో చికిత్స చేయిస్తున్నారు. సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్, సీఐ వెంకటేశ్ విచారణ జరిపి ఇరువర్గాలపై కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు. 11 మందిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు పట్టణ సీఐ వెంకటేశ్ చెప్పారు. ఇందులో తిప్పాపూర్కు చెందిన ఉత్తరాజుల నాగరాజు, పతిపాటి సందీప్, ఉత్తరాజుల లక్ష్మణ్, పత్తిపాటి జాషువా, ఉత్తరాజుల నీళకుమార్, పత్తిపాటి శివాజీ, పత్తిపాటి నోబుల్, పత్తిపాటి థామస్, పత్తిపాటి మణి, గరుడ లక్ష్మి, ఉత్తరాది శివమ్మ ఉన్నారని తెలిపారు. కాగా, దాదాపు గంట పాటు ఘర్షణ జరిగినా పోలీసులు రాలేదని, గంజాయి సేవించి ఆ మత్తులో తమపై దాడిచేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తిప్పాపూర్ వాసులు డిమాండ్ చేస్తున్నారు.