వేములవాడ టౌన్, మార్చి 21 : ఆదిదంపతుల కల్యాణం అశేష భక్తజనవాహిని మధ్య నయనానందకరంగా జరిగింది. దక్షిణకాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ రాజన్న ఆలయంలో సోమవారం పార్వతీరాజరాజేశ్వర స్వామి వారి కల్యాణ వేడుక కనులపండువను తలపించింది. కరోనా నేపథ్యంలో రెండేళ్లుగా ఆంతరంగికంగా నిర్వహించిన ఈ వేడుక, ఈ సారి అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం 9 గంటలకు ఎదరుకోళ్ల కార్యక్రమం ఆసక్తిగా సాగింది. ఎదుర్కోళ్ల సమయంలో వధువు తరపున స్వామివారికి వెయ్యి కోట్లు కట్నంగా ఇస్తున్నట్లు చెప్పే సమయంలో అమ్మవారి తరఫున ఉన్న వారు ఒప్పుకునే ఘట్టం ఆద్యంతం రసవత్తరంగా కొనసాగింది. అనంతరం తీర్థరాజ పూజతో కల్యాణ వేడుకలు మొదలయ్యాయి.
ఆలయ అద్దాల మండపంలో ఉదయం 10.55 గంటల నుంచి 12.55 వరకు అభిజిత్ లగ్న సుముహూర్తాన కల్యాణ తంతు జరిగింది. తొలుత ఆలయం నుంచి ఆదిదంపతులను పల్లకీల్లో వేర్వేరుగా కల్యాణమండపానికి తీసుకువచ్చారు. ఈ కల్యాణానికి ఆచార్యదంపతులుగా గోపన్నగారి వసంత్-సరిత దంపతులు వ్యవహరించారు. శైవ ఆగమ సంప్రదాయం ప్రకారం ఆలయ స్థానాచార్యులు అప్పాల భీమాశంకర్ ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులు నమిలకొండ ఉమేశ్శర్మ, ఈశ్వరగారి సురేశ్, చంద్రగిరి శరత్, అప్పాల రాజాచంద్ర, ఒజ్జల ఆదిత్య, గోపన్నగారి గణేశ్, శివుడు, మామిడిపెల్లి శరత్, ఆస్థాన వేదపండితులు సువర్ణరాధాకృష్ణశర్మ, మధు హరీశ్, జగన్మోహన్తోపాటు అర్చకబృందం కల్యాణ ఘట్టాన్ని ఘనంగా నిర్వహించారు. కాగా రాజన్న ఆలయం తరఫున ఈవో రమాదేవి, వేములవాడ మున్సిపల్ పాలకవర్గం తరఫున చైర్పర్సన్ రామతీర్థపు మాధవి పట్టువస్ర్తాలు, తలంబ్రాలు సమర్పించారు.
శివపార్వతుల తన్మయత్వం..
ఉమ్మడి కరీంనగర్ జిల్లాతోపాటు రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది మంది శివపార్వతులు వచ్చి, స్వామివారి కల్యాణాన్ని కనులారా తిలకించారు. కల్యాణం జరుగుతున్న సమయంలో శివుడిని ఆరాధిస్తూ గంటా, గధాశూలాన్ని ఊపుతూ కనిపించారు. తాము శివుడిని పెళ్లాడినట్లు భావించుకుని ఒకరిపై ఒకరు తలంబ్రాలు పోసుకుని తన్మయత్వం చెందారు. దాదాపు 50వేలకుపైగా భక్తులు తరలివచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. భక్తుల నుంచి 70 వేల కానుకలు సమకూరినట్లు ఆలయ విశ్రాంత ఏఈవో ఆగమరావు వెల్లడించారు.
పెద్దసేవపై ఊరేగిన ఉత్సవమూర్తులు
శివకల్యాణం పూర్తయిన తర్వాత సోమవారం రాత్రి శ్రీ పార్వతీ రాజరాజేశ్వరస్వామి వారలు నెమలి వాహనంపై పురవిహారం చేశారు. పెద్దసేవ ముందు ఉత్సవమూర్తులకు ఆలయ స్థానాచార్యులు అప్పాల భీమాశంకర్ ఆధ్వర్యంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్దసేవపై విద్యుద్దీపాల కాంతుల్లో ఆదిదంపతులు దేదీప్యమానంగా వెలుగొందారు. భక్తులు మంగళహారతులతో స్వాగతం పలికి తమ భక్తినిచాటుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో రమాదేవి, ఆలయ ఏఈవో శ్రీనివాస్, పర్యవేక్షకులు వరి నర్సయ్య, రాజశేఖర్, ఏఈ ద్వారక శేఖర్, ఇన్స్పెక్టర్ చెక్కిళ్ల అశోక్, రవీందర్రెడ్డి తదితరులు ఉన్నారు.