రాజన్న సిరిసిల్ల, మార్చి 4 (నమస్తే తెలంగాణ): మహిళా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలపై విస్తృతంగా ప్రచారం చేసేందుకు టీఆర్ఎస్ ప్రణాళికలు వేసింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘కేసీఆర్ మహిళా బంధు’ పేరుతో రాష్ట్రమంతటా అంబరాన్నంటేలా సంబురాలు నిర్వహించాలన్న మంత్రి కేటీఆర్ పిలుపుతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు.
సిరిసిల్లలో భారీ ఏర్పాట్లు..
‘కేసీఆర్ మహిళా బంధు’ సంబురాలకు సిరిసిల్ల జిల్లా శ్రేణులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నాయి. వివిధ రంగాలలో రాణిస్తున్న మహిళలను గుర్తించి సన్మానించేందుకు జాబితా సిద్ధం చేస్తున్నారు. మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాను రాష్ర్టానికే స్ఫూర్తిగా నిలిపేలా కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, అన్ని మండల, గ్రామాశాఖల అధ్యక్షులు, నాయకుల ఆధ్వర్యంలో కార్యాచరణ రూపొందించారు. షెడ్యూల్డ్ ప్రకారం.. 6న ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, గంభీరావుపేట, ముస్తాబాద్, తంగళ్లపల్లి మండల కేంద్రాల్లో ర్యాలీలు తీస్తారు. మహిళల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ప్లకార్డులు చేతపట్టుకుని ప్రదర్శిస్తారు. బతుకమ్మలు, బోనాలతో శోభాయాత్ర నిర్వహిస్తారు. కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ థాంక్యూ పేరిట మానవహారం ఏర్పాటు చేస్తారు. ప్రధాన కూడళ్ల వద్ద వేదికలు ఏర్పాటు చేసి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
అదే వేదికపైనా వివిధ శాఖల్లో పనిచేస్తున్న, రంగాలలో రాణించిన మహిళలను సన్మానిస్తారు. 7న కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీతో పాటు లబ్దిదారుల ఇంటికి వెళ్లి వారి సంతోషాన్ని మాటల్లో తెలుసుకోవడం, సెల్ఫీలు తీసుకుంటారు. కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య పాల్గొంటారు. 8న జిల్లా కేంద్రంలో 5వేల మందితో కొత్తబస్టాండ్ నుంచి ప్రభుత్వ కళాశాల మైదానం దాకా భారీ ర్యాలీ తీస్తారు. అక్కడే పెద్ద కేక్ కట్ చేస్తారు. కళాశాల మైదానంలో సమావేశం నిర్వహిస్తారు. కేసీఆర్ మహిళా బంధు అనే అతిపెద్ద ముగ్గు ప్రదర్శన కోసం సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో టీఆర్ఎస్ పట్టణ పార్టీ కార్యకర్తలు ముఖ్య భూమిక పోషించేలా కార్యక్రమాలు చేపట్టనున్నారు. కాగా, ‘కేసీఆర్ మహిళా బంధు’ సంబురాలను అంబరాన్నంటేలా నిర్వహించనున్నట్లు మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ తెలిపారు.
మూడు రోజులు వేడుకలు..
మంత్రి కేటీఆర్ ఆదేశాలతో మూడు రోజుల షెడ్యూల్ ఖరారు చేశారు. 6న సంబురాలు ప్రారంభిస్తారు. సీఎం కేసీఆర్కు రాఖీ కడతారు. పారిశుద్ధ్య కార్మికులు, డాక్టర్లు, ప్రతిభ కలిగిన విద్యార్థినులు, ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు, స్వయం సహాయక సంఘాల నాయకులను గౌరవపూర్వకంగా సన్మానిస్తారు. కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, థాంక్యూ కేసీఆర్ ఆకారం వచ్చేలా మానవహారాలు ఏర్పాటు చేస్తారు.
7న కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ఇతర మహిళా సంక్షేమ కార్యక్రమాల లబ్ధిదారులను వారి ఇండ్ల వద్దకు వెళ్లి కలువాలి. లబ్ధిదారులతో సెల్ఫీలు తీసుకుంటారు.8న నియోజకవర్గ స్థాయిలో మహిళలతో సమావేశాలు, సంబురాలు నిర్వహిస్తారు.