రాజన్న సిరిసిల్ల, మార్చి 4 (నమస్తే తెలంగాణ) : ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, వైద్యాన్ని మరింత చేరువ చేసే దిశగా అడుగులు వేస్తున్నది. అందులో భాగంగా ‘హెల్త్ ప్రొఫైల్’కు శ్రీకారం చుడుతున్నది. రాజన్న సిరిసిల్ల జిల్లాను ఇప్పటికే పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరి ఆరోగ్య వివరాలు సేకరించాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన వైద్య ఆరోగ్య శాఖ, సిరిసిల్ల జిల్లాలో 4,22,812 మంది ఉన్నట్లు గుర్తించింది. అయితే హెల్త్ ప్రొఫైల్కు సంబంధించి గతంలో జ్వర సర్వే చేసిన ఆరోగ్య సిబ్బంది, ఆశ కార్యకర్తలకు బాధ్యతలను అప్పగించారు. ఒక ఏఎన్ఎం, ఇద్దరు ఆశ కార్యకర్తలతో కూడిన 220 బృందాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే వేములవాడ ప్రధాన దవాఖానలో ఆరోగ్య సిబ్బందికి పలుసార్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు శిక్షణ తరగతులు కూడా నిర్వహించారు. వీరంతా ఇంటింటికీ వెళ్లి ప్రతి ఒక్కరికి ఎలాంటి జబ్బులున్నాయో సమగ్ర ఆరోగ్య సమాచారం సేకరిస్తారు. రక్తం, మూత్ర, తెమడ పరీక్షల కోసం నమూనాలు తీసుకుని జిల్లా కేంద్రంలో ఉన్న తెలంగాణ డయాగ్నోస్టిక్ కేంద్రానికి పంపిస్తారు. అక్కడ అన్ని రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసి రిపోర్టు ఇస్తారు. మండలం, గ్రామాల వారీగా సేకరించిన ఆరోగ్య జాబితా వివరాలను ఆన్లైన్లో చేరుస్తారు. 13 ఆరోగ్య కేంద్రాలు, 2 అర్బన్ హెల్త్ సెంటర్లు, సిరిసిల్ల ఏరియా దవాఖాన, వేములవాడ దవాఖానలున్నాయి. వ్యాధి నిర్ధారణ కోసం తీసుకున్న శాంపిళ్లను వెంట వెంట డయాగ్నోస్టిక్ కేంద్రానికి పంపించేందుకు 23 వాహనాలను సిద్ధం చేసింది.
నేడు ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్
హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టు కార్యక్రమాన్ని మంత్రి కేటీఆర్ వేములవాడ పట్టణంలోని ప్రధాన దవాఖానలో శనివారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లూ చేశారు. కాగా, ఈ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించగానే జిల్లాలోని అన్ని ఆరోగ్య కేంద్రాల పరిధిలోని సిబ్బంది ఇంటింటికీ వెళ్లి రక్త, మూత్ర నమూనాలు సేకరించి, వ్యాధుల వివరాలు తెలుసుకుంటారు.
సకాలంలో వైద్యం..
మనిషికి ఎప్పుడు ఎలాంటి వ్యాధులు వస్తున్నాయో తెలియని పరిస్థితి. అత్యవసర సమయంలో పేషెంట్ ఆరోగ్య పరిస్థితి తెలియక పరీక్షలు చేయాల్సి వస్తుంది. దీనివల్ల వైద్యం అందించడంలో జాప్యం జరుగుతుంటుంది. కొన్నిసార్లు మనిషి ప్రాణాలకే ప్రమాదముంటుంది. కానీ, ‘హెల్త్ ప్రొపైల్’తో వైద్యం సకాలంలో అందించడానికి అవకాశముంటుంది. అది ఎలాగంటే ‘హెల్త్ ప్రొఫైల్’లో భాగంగా 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరి ఆరోగ్య వివరాలను సేకరిస్తారు. మనిషి బరువు, బ్లడ్ గ్రూప్ నుంచి మొదలు.. దీర్ఘకాలిక వ్యాధుల వరకు ప్రతి ఆరోగ్య సమాచారాన్ని తీసుకుంటారు. ప్రతి వ్యక్తికి ఈ-హెల్త్ కార్డు ఇచ్చి, వివరాలను ఆన్లైన్లో పొందుపరుస్తారు. దీని వల్ల ఆ వ్యక్తికి ఏదైనా అయినా.. లేదంటే దేశంలో ఎక్కడికైనా వెళ్లినప్పుడు అనారోగ్యం పాలైనా.. ఆన్లైన్లో నిక్షిప్తం చేసిన డాటా ఆధారంగా మెరుగైన వైద్యం వెంటనే అందించడానికి వీలుంటుంది. కొందరికి బీపీ, షుగర్ తదితర దీర్ఘకాలిక వ్యాధులున్నా.. ముందస్తు సమాచారంతో ఆ రోగికి ఎలాంటి పరీక్షలు చేయాలి? ఏ మందులు ఇవ్వాలో..? వైద్యులు గుర్తించి తక్షణమే వైద్యం చేసే అవకాశముంటుంది.
ఆన్లైన్లో హెల్త్ ప్రొపైల్..
హెల్త్ ప్రొపైల్ ప్రాజెక్టులో 18ఏళ్లు దాటిన వారందరి ఎత్తు, బరువుతో పాటు 30 రకాల పరీక్షలు నిర్వహిస్తాం. ఆరోగ్య సమాచారం ఆన్లైన్లో నమోదు చేసి ఈహెల్త్ కార్డును జారీ చేస్తాం. హెల్త్ ప్రొపైల్ ప్రాజెక్టును శనివారం వేములవాడ ప్రభుత్వ దవాఖానలో మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారు. ఆ తర్వాతే జిల్లాలోని వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పరీక్షలు చేస్తారు. ఈ మేరకు ఇప్పటికే జిల్లాలోని పీహెచ్సీల సిబ్బంది, వైద్యాధికారులు, ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలకు అవగాహన కల్పించాం.