రాష్ట్ర, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ శనివారం వేములవాడకు వస్తున్నారు. ఇక్కడి ఏరియా దవాఖానలో చిన్నారుల కోసం ప్రత్యేక వార్డు.. ఆధునిక పాలియేటివ్కేర్ సెంటర్, వ్యాధి నిర్ధారణకు ఆధునిక సీటీస్కాన్, క్షయ నిర్ధారణ కేంద్రాన్ని ప్రారంభించడంతోపాటు స్థానికంగా రూ.30.20 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే రమేశ్బాబుతో కలిసి శంకుస్థాపన చేయబోతున్నారు.
రాజన్న సిరిసిల్ల, మార్చి 4 (నమస్తే తెలంగాణ)/ వేములవాడ : ప్రజారోగ్యమే లక్ష్యంగా రాష్ట్ర సర్కారు ముందుకెళ్తున్నది. వైద్యం మరింత చేరువ చేసే లక్ష్యంతో సేవలను మెరుగుపరుస్తున్నది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అనేక వైద్య సదుపాయాలను అందుబాటులోకి తీసుకు రాగా, మంత్రి కేటీఆర్ నేడు పెద్ద ఎత్తున వైద్య కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. శనివారం రాజన్న సిరిసిల్లలో జిల్లాలో పర్యటించనున్న ఆయన ముందుగా ఉదయం 10.30 గంటలకు ఎల్లారెడ్డిపేటకు చేరుకుంటారు. పోతిరెడ్డిపల్లెలో గ్రామ పంచాయతీ భవనం, పాఠశాలలో అదనపు తరగతి గదులను ప్రారంభిస్తారు. 11 గంటలకు వెంకటాపూర్లో రైతు వేదిక, కేసీఆర్ ప్రగతి ప్రాంగణం ప్రారంభించి, 11.30 గంటలకు కేసీఆర్ నగర్లో డబుల్ బెడ్రూం ఇండ్ల గృహప్రవేశాలు చేయిస్తారు. ఆ తర్వాత అక్కడే ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతారు.
హెల్త్ ప్రొఫైల్.. యంత్రాలు ప్రారంభం..
మధ్యాహ్నం 12.30 గంటలకు మంత్రి వేములవాడకు చేరుకుంటారు. తిప్పాపూర్లోని ఏరియా దవాఖానలో హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టును అంకురార్పణ చేస్తారు. అనంతరం అక్కడే 2కోట్లతో ఏర్పాటు చేసిన సీటీస్కాన్, కోటితో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్, 70లక్షలతో లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంక్లు, 15లక్షలతో చిన్నారుల కోసం 10మంచాలతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పిడియాట్రిక్ వార్డును ప్రారంభిస్తారు. అలాగే 15లక్షలతో చివరిదశలో ఉన్నవారికి సేవలందించేందుకు 10మంచాలతో పాలియేటివ్కేర్ సెంటర్(ఆలన), 15లక్షలతో ఏర్పాటుచేసిన టీబీ రోగనిర్ధారణ పరీక్ష కేంద్రాలను ప్రారంభించి అందుబాటులోకి తేబోతున్నారు.
ప్రగతి పనులకు శ్రీకారం..
మధ్యాహ్నం 2గంటలకు వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో టీయూఎఫ్ఐడీసీ నిధులు 20 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. 3 గంటలకు పట్టణ ప్రజల కోసం కోరుట్ల బస్టాండ్ వద్ద 4.50కోట్లతో నిర్మించే సమీకృత మార్కెట్ భవన నిర్మాణానికి భూమి పూజ చేస్తారు. 3.30 గంటలకు మర్రిపల్లిలో రైతువేదిక, కేజీబీవీ నూతన కళాశాల భవనాన్ని ప్రారంభిస్తారు. మంత్రి రాక సందర్భంగా అధికారులు అన్ని ఏర్పాట్లూ చేశారు.