రాజన్న సిరిసిల్ల, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): ఒకప్పుడు సమైక్య పాలకుల చేతగాని తనంతో పల్లెలంటేనే మొహం చాటేసే పరిస్థితి ఉండేది. తెలంగాణ సర్కారు వచ్చిన తర్వాత వాటి రూపురేఖలే మారిపోయాయి. పల్లె ప్రగతి కార్యక్రమంతో విప్లవాత్మక మార్పు వచ్చింది. నెల నెలా తగినన్ని నిధులు వస్తుండడంతో గ్రామాల్లో పనులు పరుగులు పెట్టాయి. పారిశుధ్య నిర్వహణ సులభమవడంతో వీధులు మెరుస్తున్నాయి. ప్రతి గ్రామంలో ఆరోగ్యకరమైన వాతావర ణం నెలకొంది. సీజనల్ వ్యాధులు తగ్గుముఖం పట్టా యి. నాటిన మొక్కలతో ఏపుగా పెరిగి ఆహ్లాదాన్ని అం దిస్తున్నాయి. పల్లె పకృతి వనాలలో మార్నింగ్ వాక్ చే స్తున్నారు. రోడ్లవెంట, చెరువు కట్టల కింద జరిగే దహ న సంస్కారాల దృశ్యాలు వైకుంఠధామాల నిర్మాణాలతో కనిపించకుండా పోవడమే కాకుండా పల్లెల్లో కులాల మధ్య అంతరాలు తొలగిపోయాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 255 గ్రామ పంచాయతీలు ఉండగా, అన్ని గ్రామాలు పల్లె ప్రగతి కార్యక్రమంతో అభివృద్ధి బాట పట్టాయి. అన్ని పంచాయతీలలో వైకుంఠధామాలు నిర్మించారు. 265 పల్లెల్లో ప్రకృతి వనాలు, మంకీఫుడ్ కోర్టులు, నర్సరీలు ఏర్పాటయ్యాయి. ప్రజలు చైతన్యవంతులయ్యారు. తాము నివసించే పరిసర ప్రాంతాలతో పాటు గ్రామాన్ని అం దంగా దిద్దుకుంటున్నారు. ప్రతి ఇంటి ఆవరణ, ఇంటి ముందు పూలు, పండ్ల మొక్కలు పెంచుతున్నారు. జిల్లాలో 1,068 మంది పారిశుధ్య సిబ్బంది క్రమం తప్పకుండా గ్రామాలను శుభ్రం చేస్తున్నారు. క్రమంగా అభివృద్ధి చెందుతుండడంతో గ్రామాల్లో భూముల ధరలు అమాంతం పెరిగిపోయాయి. గతంలో రూ.2లక్షలు ఉన్న ఎకరం భూమి ఏకంగా పది రెట్లు పెరిగింది.
నాడు చీదరించుకున్నోళ్లే.. నేడు ఆదర్శమంటున్నరు..
ఎల్ఎల్బీ పూర్తి చేసిన నేను ఊరికి సేవ చేద్దామని సర్పంచుగ పోటీ చేసి గెలిచిన. మీ ఊరిని చూస్తే ఉమ్మేయడానికి కూడా ఇష్టమనిపిస్తలేదన్న మా ఫ్రెండ్ మాటలకు మస్తు బాధపడ్డ. నేను పుట్టిన ఊరు ఇలా ఉంటుందా? అని మదనపడ్డా. మా అన్నయ్య మదన్రెడ్డితో కలిసి తెల్లారి ఊరంతా తిరిగి పరిశీలించా. ఎక్కడ చూసినా చెత్త కుప్పలతో రోడ్లే కనిపించలేదు. ఊళ్లో మరుగుదొడ్లు ఉన్నా చెంబులు పట్టుకొని వెళ్లే వారిని చూసి వికారమనిపించింది. తాగునీటి సౌలతుల్లేవు. ఎవరైనా చనిపోతే ఊరొడ్డుకున్న చెట్ల కిందనే దహన సంస్కారాలు జరిగేవి. వెంటనే ముస్తాబాద్ నుంచి కొంత మంది పారిశుధ్య సిబ్బందిని తెప్పించి ఒక్కో వార్డులో ఐదు ట్రాక్టర్ల చెత్త తొలగించాం. ఈ సమయంలోనే సీఎం కేసీఆర్ ‘పల్లెప్రగతి’ని ప్రకటించారు. నా ఆలోచనకు తోడైన ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన ప్రత్యేక నిధులతో ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్ కొనుగోలు చేశాం. ఇంటింటికీ చెత్త సేకరిస్తున్నం. 14 సీసీ రోడ్లు వేశాం. వైకుంఠధామం, ప్రకృతి వనం, నర్సరీ, బతుకమ్మ ఘాట్.. ఇలా అనేక పనులు చేపట్టినం. ప్రకృతి వనంలో పండ్ల చెట్లతో పాటు రుద్రాక్ష, రబ్బరు మొక్కలు నాటినం. మరుగుదొడ్లు వినియోగించుకునేలా అవగాహన కల్పించినం. ఫలితంగా జాతీయ స్థాయిలో స్వచ్ఛ భారత్ అవార్డులు దక్కాయి. నాడు తిట్టినోళ్లే నేడు మెచ్చుకుంటున్రు. మా పల్లెను చూసి స్ఫూర్తిగా తీసుకుంటున్నరు.
మార్పు వచ్చింది..
పల్లెప్రగతితో మంచి ఫలితాలు సాధించగలిగాం. నాలుగు విడుతల్లో అన్ని పంచాయతీల్లోని సమస్యలను గుర్తించి వంద శాతం పరిష్కరించాం. మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో నిధులు నెలనెలా వస్తున్నాయి. ట్రాక్టర్లు, ట్రాలీలు, ట్యాంకర్ల కొనుగోలుతో ఏ రోజుకారోజు చెత్తను ఇళ్ల నుంచే సేకరిస్తున్నాం. ఫలితంగా పారిశుధ్యం మెరుగు పడింది. సీజనల్ వ్యాధులు తగ్గుముఖం పట్టాయి. ప్రకృతి వనాలలో ఉదయం, సాయంత్రం వేళల్లో వాకింగ్ చేస్తున్నారు. ఎవెన్యూ ప్లాంటేషన్, ఇండ్ల ఆవరణల్లో మొక్కలు నాటడంతో పచ్చని అందాలతో పల్లెలు స్వాగతం పలుకుతున్నాయి. అభివృద్ధి పనులకు ఆర్థిక సాయం అందించేందుకు దాతలు ముందుకొస్తున్నారు. నాటికీ నేటికి పల్లెల్లో చాలా మార్పు కనిపిస్తున్నది.
– ఎనగందుల రవీందర్, జిల్లా పంచాయతీ అధికారి (రాజన్న సిరిసిల్ల)
జిల్లాలో పల్లె ప్రగతి కింద చేపట్టిన పనుల వివరాలు
గుర్తించిన సమస్యలు: 2,410
పరిష్కరించినవి: 2,410
వైకుంఠధామాలు: 255
కంపోస్టు ఎరువుల షెడ్లు: 255
పల్లె ప్రకృతి వనాలు: 265
నర్సరీలు: 255
డంప్ యార్డులు: 255
శ్రమదానంలో పాల్గొన్న వారి సంఖ్య: 49,755
నిర్వహించిన గ్రామ సభలు: 255
కొనుగోలు చేసిన ట్రాక్టర్లు: 255