రాజన్న సిరిసిల్ల, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ): సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గోపాల్నగర్లోని సర్కారు బడి 23 మంది పిల్లలతో నడిపించలేక నాడు మూసివేత దిశకు చేరింది. తెలంగాణ సర్కారు కల్పించిన మౌలిక సౌకర్యాలు, ఆంగ్లబోధన, ఉచిత దుస్తులు, మధ్యాహ్న భోజనంతో నేడు 211 మందితో కళకళలాడుతున్నది. కార్మిక క్షేత్రమైన సిరిసిల్లలో ఒకప్పుడు అనేక స్కూళ్లు విద్యార్థుల లేక సమీప పాఠశాలల్లో విలీనం చేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇందుకు కారణాలు తెలుసుకున్న ప్రభుత్వం, బడుల్లో సౌకర్యాలతో ఆంగ్ల బోధన అందించేందుకు చర్యలు తీసుకుంది. ప్రాథమిక పాఠశాల నుంచే ఆంగ్ల బోధన ప్రవేశపెట్టింది. అప్పటికే ప్రైవేటులో చదువుతున్న విద్యార్థులకు ఫీజులు భారమై ఇబ్బందులు పడుతున్న తల్లిదండ్రులకు సర్కారు కల్పించిన సౌకర్యాలు, ఆంగ్ల బోధన ఊరట నిచ్చింది. ప్రైవేటుకు స్వస్తి చెప్పి తమ పిల్లలను సర్కారు బడిలో చేర్పించేందుకు ముందుకు వచ్చారు. కార్మికుల నుంచి మొదలు ఉన్నతవర్గాల వరకు సర్కారు బడిలోనే చదివిస్తుండడంతో ఏటా అడ్మిషన్లు దొరకని పరిస్థితి ఏర్పడింది.
ప్రైవేటుకు దీటుగా విద్యాబోధన..
ప్రైవేటుకు దీటుగా విద్యను అందిస్తుండడంతో గోపాల్నగర్ ప్రాథమిక పాఠశాల సక్సెస్గా నడుస్తున్నది. సినారె కళామందిర్ పక్కనే నాలుగు గదులతో నిర్మించిన ఈ పాఠశాలకు పలు స్వచ్ఛంద సంస్థలు చేయూతనిస్తున్నాయి. నాడు 23 మంది విద్యార్థులున్న ఈ పాఠశాలలో 2017లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడంతో క్రమంగా విద్యార్థుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఈఏడాది 211 మంది తో కళకళలాడుతుండగా వారిలో 188 మంది ప్రైవే టు పాఠశాలలకు చెందిన వారే ఉండడం విశేషం. ఇద్దరు టీచర్లు ఉండగా, మరొకరు డిప్యూటేషన్పై వచ్చారు. మరో నలుగురు ఉపాధ్యాయులను పిల్లల తల్లిదండ్రుల భాగస్వామ్యంతో నియమించుకుని ప్రైవేటుకు దీటుగా విద్యాబోధన అందిస్తున్నారు. క్విజ్, చిత్రలేఖనం, క్రీడలు, యోగా, సాంస్కృతిక కార్యక్రమాలు, ఇలా విద్యార్థు ల్లో ఉన్న నైపుణ్యతను వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక పాఠశాల యాజమాన్య కమిటీ ప్రతి నెలా సమావేశం ఏర్పాటు చేసుకుని అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పిల్లల చదువుపై చర్చిస్తూ తల్లిదండ్రుల ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు. విద్యార్థులు ఏ సబ్జెక్ట్లో బలహీనంగా ఉన్నారో గుర్తించి ఆ సబ్జెక్ట్ను బోధిస్తున్నారు. సాయంత్రం గంట సమ యం ఎక్కువ కేటాయించి స్టడీ అవర్స్ నిర్వహిస్తున్నారు. నియమించుకున్న ఉపాధ్యాయులకు తల్లిదండ్రులే జీతాలు చెల్లించేలా నిర్ణయం తీసుకోవడం స్ఫూర్తిదాయకం.
స్వచ్ఛంద సంస్థల ప్రోత్సాహం..
సక్సెస్ పుల్గా నడుస్తున్న గోపాల్నగర్ బడికి పలు స్వచ్ఛంద సంస్థలు ప్రోత్సాహాన్ని ఇస్తున్నాయి. ఎర్త్ ఫౌండేషన్ సంస్థ దత్తత తీసుకుని విద్యార్థులకు యూనిఫాం, బ్యాగు లు, క్రీడా సామగ్రి అందిస్తున్నది. అర్క మి త్ర సంస్థ ఆంగ్లవిద్యకు సంబంధించిన నోట్బుక్కులు, టై,బెల్టులు సరఫరా చేస్తున్నది. వైద్యులు, ప్రజాప్రతినిధులు తమ వంతుగా వాటర్ ఫిల్టర్, మైక్, ప్రొజెక్టర్ను విరాళంగా ఇచ్చారు. ప్రతి విద్యార్థి పుట్టిన రోజును పురస్కరించుకుని పాఠశాల ఆవరణలో మొక్క లు నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నారు. పాఠశాల చుట్టూ ప్రహరి, బాలురు, బాలికలకు వేర్వేరుగా మూత్ర శాలలు ఏర్పాటు చేశారు. సీఎస్ఆర్ నిధుల కింద బడికి డెస్కులు ఇచ్చారు. గివ్ తెలంగాణ లాంటి సంస్థలు సైతం విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు, క్రీడాసామగ్రి అందిస్తున్నది. 2016లో 23మంది విద్యార్థులుంటే ఆంగ్ల బోధన ప్రవేశపెట్టిన తర్వాత 2017లో 93, 2018లో 117, 2019లో 130, 2020 లో 135, 2021లో 145, 2022లో 195 మంది, నర్సరీ విద్యార్థులు 16 మొత్తం 211 మంది విద్యార్థులు చేరారు.
బడిని బతికించుకున్నాం
గోపాల్నగర్ ప్రాథమిక పాఠశాలలో ఒకటో తరగతి నుంచి 5వరకు బోధన జరుగుతుంది. నేను ఈ బడిలో హెచ్ఎంగా బాధ్యతలు తీసుకున్న సమయంలో 23 మంది పిల్లలే ఉన్నారు. పాఠశాల చుట్టూ ఎంతో ప్రైవేటు స్కూళ్లు ఉండేవి. అవి విద్యార్థులతో కిక్కిరిసి కనిపించేవి. విద్యార్థుల సంఖ్యలేకపోవడంతో మా స్కూలు సమీప పాఠశాలలో విలీనం చేస్తారన్న ప్రచారం జరిగింది. ఇది నా మనసును చాలా కలిచివేసింది. ఎలాగైనా బడిని బతికించుకోవాలన్న పట్టుదలతో తోటి ఉపాధ్యాయులతో కలిసి ఇంటింటికీ తిరిగి పిల్లలను చేర్పించాలని కోరాం. మీ బడిలో ఇంగ్లిష్ మీడియం లేదు కదా..? అన్న తల్లిదండ్రుల మాట మాలో ఆలోచన కలిగించింది. మా బడి పక్కనే నివాసం ఉంటున్న జాయింట్ కలెక్టర్ యాస్మిన్ భాషాను ఓ రోజు ఆహ్వానించాం. పిల్లల సంఖ్య చూసి ఆమె నివ్వెరపోయింది. ఇంగ్లిష్ మీడియం కావాలంటున్నారని చెప్పాం. స్పందించిన ఆమె వెంటనే ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టాలని అధికారులను ఆదేశించారు. నెలరోజుల్లోనే అమలైంది. ఇంకా రాష్ట్ర సర్కారు వసతులు కూడా కల్పించింది. మళ్లీ ఇంటింటికీ తిరిగి ఆంగ్లబోధన చేస్తున్నట్లు చెప్పాం. దీంతో ఒక్కొక్కరుగా బడిలో చేరుతూ వచ్చారు. నాడు 23 ఉన్న సంఖ్య నేడు 211కు చేరింది. తరగతి గదులు కూడా సరిపోవడం లేదు. స్థానికంగా ఉండే పిల్లలే కాదు సర్ధాపూర్, పెద్దూరు, జెగ్గారావుపల్లె గ్రామాల నుంచి విద్యార్థులు మా బడికి వస్తున్నందుకు చాలా సంతోషమనిపిస్తున్నది.
– భూక్యా చంద్రకళ, ప్రధానోపాధ్యాయురాలు, గోపాల్నగర్ పాఠశాల
మోడల్ స్కూల్కు ఎంపికయ్యేలా విద్యాబోధన
మా స్కూల్లో చదువుతున్న విద్యార్థులు మోడల్ స్కూల్, నవోదయ పాఠశాలలకు ఎంపికయ్యేలా తీర్చిదిద్దుతున్నాం. ఇప్పటికే 15 మంది విద్యార్థులు మోడల్ స్కూల్లో చేరారు. ప్రతి నెలా విద్యార్థుల తల్లిదండ్రుల ముందు వారి నైపుణ్యాన్ని ప్రదర్శించేలా చర్యలు తీసుకుంటున్నాం. ఏ అంశంలో బలహీనంగా ఉన్నాడో గుర్తించి అందులో రాణించేలా చేస్తున్నాం. అవసరమైతే విద్యార్థులకు సమయం ముగిసినా మరో గంట అదనంగా స్టడీ అవర్స్ నిర్వహిస్తున్నాం.
– మామిండ్ల వేణుగోపాల్, ఉపాధ్యాయుడు
ప్రైవేటు నుంచే వస్తున్నరు
ఆంగ్ల బోధన ప్రవేశపెట్టినందున చాలా మంది విద్యార్థులంతా ప్రైవేటును వీడి సర్కారు బడిలోనే చేరుతున్నరు. ప్రైవేటులో వేలకు వేలు ఫీజులు కట్టలేక పోతున్నరు. ఇక్కడైతే యూనిఫాంల నుంచి మొదలు, పుస్తకాలు కూడా ఉచితంగా లభిస్తున్నాయి. నాణ్యమైన విద్యాబోధన అందిస్తుండడంతో తల్లిదండ్రుల ఆలోచన మారింది. పిల్లలను సర్కారు బడికే పంపుతున్నరు. ఒకప్పుడు వెలవెలబోయి కనిపించిన బడి ఈ రోజు కళకళలాడుతుండడంతో సంతోషంగా ఉంది. బడికి మంచి పేరు తేవాలన్న లక్ష్యంతో ముందుకు పోతున్నాం.
– ఆడెపు శివకుమార్, ఉపాధ్యాయుడు