సిరిసిల్ల / సిరిసిల్ల టౌన్, ఫిబ్రవరి 18 :రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సిరిసిల్లలో విస్తృతంగా పర్యటించారు. శుక్రవారం తంగళ్లపల్లి మండలంతోపాటు సిరిసిల్ల పట్టణంలో కలియదిరిగారు. మొదట తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లిలో రైతు వేదికను ప్రారంభించారు. అనంతరం ఓబులాపూర్లో సమ్మక్క జాతరకు హాజరై మొక్కులు చెల్లించుకున్నారు. ఆ తర్వాత రగుడులోని సాయి మణికంఠ ఫంక్షన్హాల్లో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా తోట ఆగయ్య బాధ్యతల స్వీకరణ, జిల్లా స్థాయి కార్యకర్తల సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలకు కష్టమొస్తే ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. అంతకుముందు సిరిసిల్లలో అమాత్యుడికి ఘన స్వాగతం పలికారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లు, రహదారుల వెంట ఏర్పాటు చేసిన గులాబీ జెండాలతో సుందరీకరించారు. సుమారు వెయ్యి మంది వందలాది బైక్లతో ఎల్లమ్మ జంక్షన్ నుంచి గాంధీ, అంబేద్కర్, నేతన్న చౌరస్తాల మీదుగా సాయిమణికంఠ ఫంక్షన్హాల్ వరకు మంత్రి కేటీఆర్తో కలిసి ర్యాలీ తీశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, జడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ, ఎమ్మెల్యేలు చెన్నమనేని రమేశ్బాబు, రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, ఎమ్మెల్సీ భానుప్రసాద్రావు, నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావుతో కలిసి అమాత్యుడు ప్రత్యేక వాహనంలో రాగా, దారిపొడవునా ‘మంత్రి కేటీఆర్ జిందాబాద్’ అంటూ నినదించారు.