సిరిసిల్ల రూరల్, ఫిబ్రవరి 18: రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ తంగళ్లపల్లి మండలం ఓబులాపూర్లో సమ్మక్కకు మొక్కులు చెల్లించుకున్నారు. నెత్తిన బంగారం పెట్టుకొని వెళ్లి అమ్మవార్లకు సమర్పించారు. ఈ సందర్భంగా జాతర కమిటీ సభ్యులు కేటీఆర్ను సన్మానించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. మంత్రి రాకతో జాతరలో సందడి వాతావరణం నెలకొంది. అమాత్యుడితో సెల్ఫీలు దిగేందుకు యువతీయువకులు ఉత్సాహం చూపగా, వారిని ఆప్యాయంగా పలుకరించారు. వృద్ధులతో ముచ్చటించారు. మంత్రి వెంట ఎమ్మెల్సీ భానుప్రసాద్రావు, నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, జడ్పీ చైర్పర్సన్ అరుణ, ఆర్బీఎస్ జిల్లా కన్వీనర్ గడ్డం నర్సయ్య, గ్రంథాలయ పరిషత్ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, టీఆర్ఎస్ సీనియర్ నేత చిక్కాల రామారావు ఉన్నారు.
దర్శించుకున్న మంత్రి, ఎమ్మెల్యేలు..
రాష్ట్ర బీసీ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కుటుంబ సభ్యులతో మేడారంలో మొక్కులు చెల్లించుకున్నారు. నిలువెత్తుబంగారం సమర్పించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలపై, సీఎం కేసీఆర్పై నిరంతరం అమ్మవార్ల దీవెనలు ఉండాలని వేడుకున్నారు. పెద్దపల్లి జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కుటుంబ సభ్యులతో కలిసి మేడారంలో పూజలు చేశారు. అమ్మవారికి నిలువెత్తు బంగారం సమర్పించారు. సీఎం కేసీఆర్ నిండు నూరేళ్లూ సల్లగా ఉండాలని, దేశానికి కేసీఆర్ నాయకత్వం వహించేలా దీవించాలని అమ్మవార్లను కోరుకున్నారు. ఎలిగేడులోని ‘పెండ్లిపోరు గుట్ట’ వద్ద ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి, వీణవంక జాతరలో ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి మొక్కులు చెల్లించుకున్నారు.
గద్దెలపై సమ్మక్క, సారలమ్మ కొలువుదీరడంతో శుక్రవారం భక్తులు వెల్లువలా తరలివచ్చారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 50 చోట్లకుపైగా జాతరలు జరగ్గా, సుమారు 10 లక్షల మందికిపైగా దర్శించుకున్నారు. రేకుర్తి, కేశవపట్నంతోపాటు గోదావరిఖని, నీరుకుల్లలో గంటల తరబడి క్యూలైన్లలో వేచి మరీ తల్లులను దర్శించుకున్నారు. అంతటా ఉదయం నుంచి రాత్రి దాకా సేవలో తరించారు. వనదేవతలకు ఒడిబియ్యం, చీర, పసుపు, కుంకుమ, బంగారం (బెల్లం) సమర్పించి, పిల్లాపాప, గొడ్డూ గోదను సల్లంగా చూడాలని వేడుకున్నారు. జాతర ప్రాంతాల్లో ఎదుర్కోళ్లు, గొర్రెలు, మేకలను బలిచ్చి మొక్కులు చెల్లించుకున్నారు.అక్కడే వంటలు చేసుకొని, సామూహిక భోజనాలు చేసి, తిరుగుపయనమయ్యారు.