రాజన్న సిరిసిల్ల, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ): మరమగ్గాలకు మహర్దశ రాబోతున్నది. లోదుస్తుల నుంచి మొదలు పెండ్లి దుస్తుల తయారీతో వస్త్ర విపణిలో సిరిసిల్ల బ్రాండ్ ఇమేజ్ను చాటనున్నది. మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ చొరవతో మరమగ్గాలను ఆధునీకరించేందుకు చేనేత జౌళిశాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ఆధునీకరణ వైపు అడుగులు వేస్తున్నది. దేశీయ మార్కెట్లో పోటీని తట్టుకునేందుకు సాంకేతిక నైపుణ్యంతో నాణ్యమైన వస్ర్తాల తయారీకి శ్రీకారం చుట్టబోతున్నది. అందుకు రాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందించేందుకు ముందుకొచ్చింది. బతుకమ్మ, రంజాన్, క్రిస్మస్, విద్యార్థుల యూనిఫాంల తయారీ ఆర్డర్లు ఇచ్చి తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను సర్కారు అభివృద్ధిలోకి తెచ్చింది. కేవలం సర్కారు ఇచ్చిన ఆర్డర్లపైనే ఆధార పడకుండా తమ కాళ్లపైన తాము నిలబడేలా వస్త్ర ఉత్పత్తిదారులు రేపియర్ మరమగ్గాల ఆధునీకరణ చేపడుతున్నారు. లోదుస్తుల నుంచి మొదలు పెండ్లి వస్ర్తాల తయారీ వరకూ ఇక్కడే జరగాలని, దేశీయ మార్కెట్లో సిరిసిల్ల బ్రాండ్ ఇమేజ్ చాటాలంటూ మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపునకు స్పందించారు. సాంచాలకు జకార్డు పరికరాలను అమర్చి తీరొక్క వస్ర్తాలను తయారు చేసి మార్కెట్లో మంచి గుర్తింపు పొందేలా అడుగులు వేస్తున్నారు.
ఒక్కో మరమగ్గానికి రూ.7లక్షల వ్యయం
టెక్స్టైల్స్ పార్క్లోని ఆటోమెటిక్ రేపియర్ లూంల ఆధునీకరణకు సాంచాకు రూ.7లక్షల చొప్పున ఖర్చవుతున్నది. పార్క్లో ప్రస్తుతం 20 యూనిట్లు, 300 సాంచాలను నవీకరించేందుకు యజమానులు నిర్ణయం తీసుకున్నారు. వీటన్నింటికీ దాదాపు రూ.210 కోట్లు ఖర్చు కానున్నది. ఒక్కొక్క యజమాని వద్ద 25 నుంచి 30 వరకు రేపియర్ లూంలుండగా, వాటి నవీకరణకు రూ.1.75 కోట్ల నుంచి రూ.2.50 కోట్ల వరకు వ్యయం కానున్నది. అందులో 25 శాతం తెలంగాణ టెక్స్టైల్స్ అప్పారెల్ పాలసీ (టీ-ట్యాప్) కింద రీయింబర్స్మెంట్ ఇవ్వనున్నది. ప్రభుత్వం అందించనున్న ప్రోత్సాహంతో టెక్స్టైల్స్ పార్కుతోపాటు సిరిసిల్ల పట్టణంలోని మూమూలు సాంచాలను కూడా నవీకరించాలని యజమానులు ఆలోచన చేస్తున్నారు. వరంగల్ జిల్లా మడికొండలో ప్రస్తుతం జకార్డ్ రేపియర్ లూంలు నడుస్తున్నాయి. వాటిపై పట్టుచీరలు, షర్టింగ్, షూటింగ్ వస్ర్తాలు తయారవుతున్నాయి. మడికొండను సందర్శించి వచ్చిన సిరిసిల్ల వస్త్ర ఉత్పత్తిదారులు లూథియానాకు స్టడీటూర్ వెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఖరీదైన వస్ర్తాల తయారీలో సిరిసిల్ల
ఇప్పటివరకు ముతక రకం వస్ర్తాలు తయారు చేసిన సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ఇక నుంచి ఖరీదైన వస్ర్తాల ఉత్పత్తిపై దృష్టి సారించింది. నూతన సాంకేతికను అందిపుచ్చుకుని నాణ్యమైన వస్ర్తాలను తయారు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నది. జకార్డ్ మిషన్ల అప్గ్రేడేషన్తో లెనిన్, అరవింద్, గ్వాలియర్, రేమాండ్స్, వెంకటగిరి, కంచి లాంటి పట్టు చీరెలు తయారు చేసే అవకాశం ఉంటుంది. లోదుస్తులు, తువ్వాలలు, లుంగీలలో ఖ్యాతి గడించిన తిరుపూర్నకు దీటుగా ఉత్పత్తి చేయాలని మంత్రి కేటీఆర్ యజమానులకు సూచించారు. ప్రభుత్వ ఖర్చులతో యజమానులు, ఉత్పత్తిదారులను తిరుపూర్కు స్టడీ టూర్కు పంపించారు. అక్కడి ఉత్పత్తిదారులు, పారిశ్రామిక వేత్తలను సిరిసిల్లకు రప్పించి అవగాహన సదస్సులు నిర్వహించారు. మంత్రి సూచన మేరకు ఖరీదైన వస్ర్తాల తయారీకి అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే అప్పారెల్ పార్క్లో గోకుల్దాస్ కంపెనీ లోదుస్తుల తయారీ యూనిట్ను ఈ నెలాఖరులోగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నది. అందులో 1500 మంది మహిళలకు ఉపాధి కల్పించబోతున్నది. పార్క్లోనూ రేపియర్ లూంలు ఆధునీకరించి ఉత్పత్తులు ప్రా రంభిస్తే వందలాదిమందికి ఉపాధి లభిస్తుంది. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది.
300 మరమగ్గాలను నవీకరించబోతున్నం
సిరిసిల్ల మరమగ్గాల పరిశ్రమకు ప్రభుత్వ ఇస్తున్న ప్రోత్సాహంతో అభివృద్ధిలో ముందుకుపోతున్నది. సిరిసిల్ల బ్రాండ్ను దేశవ్యాప్తంగా చాటాలన్నది మంత్రి కేటీఆర్ లక్ష్యం. ఆయన చొరవతో 300 రేపియర్ మరమగ్గాలను అప్గ్రేడ్ చేయాలని నిర్ణయించాం. త్వరలో లూథియానాకు స్టడీటూర్ వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తు న్నాం. పెట్టిన పెట్టుబడికి ప్రభుత్వం కూడా 25శాతం రా యితీ ఇస్తున్నందున ఆధునీకరణ పనులు వేగవంతం చేస్తున్నాం. ఇక నుంచి ఖరీదైన వస్ర్తాల తయారీకి అడుగులు వేస్తున్నం.
– అంకారపు కిరణ్కుమార్, సిరిసిల్ల టెక్స్టైల్స్ పార్క్ అభివృద్ధి కమిటీ ప్రధాన కార్యదర్శి
నాణ్యమైన ఉత్పత్తులు చేపట్టాలని నిర్ణయించాం
మార్కెట్లో విపరీతమైన పోటీ పెరిగింది. అందుకనుగుణంగా నాణ్యమైన వస్త్ర ఉత్పత్తులు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నాం. ఇప్పటివరకు మంత్రి కేటీఆర్ సహకారంతో ప్రభుత్వం మాకు చాలా ప్రోత్సాహాన్ని ఇచ్చింది. బతుకమ్మ చీరెలు, రంజాన్, క్రిస్మస్ వస్ర్తాల తయారీ ఆర్డర్లు ఇచ్చి కార్మికులకు చేతి నిండా పని కల్పించినది. సిరిసిల్ల బ్రాండ్ ఇమేజ్ కావాలన్న మంత్రి ఆశయం మేరకు మరమగ్గాలను ఆధునీకరించబోతున్నం. అన్ని రకాల వస్ర్తాలు తయారు చేయాలని ముందుకు పోతున్నం.
– ఎల్లె లక్ష్మీనారాయణ, సిరిసిల్ల టెక్స్టైల్స్ పార్క్ అభివృద్ధి కమిటీ కోశాధికారి
25 శాతం రీయింబర్స్మెంట్
సిరిసిల్ల టెక్స్టైల్స్ పార్క్లో మరమగ్గాల ఆధునీకరణకు తెలంగాణ ప్రభుత్వం 25 శాతం రీయింబర్స్మెంట్ ఇస్తున్నది. ఇప్పటివరకు బతుకమ్మ చీరెలతోపాటు షర్టింగ్, షూటింగ్ వస్ర్తాలు తయారవుతున్నాయి. నవీకరణతో ఇంకా నాణ్యమైన వస్ర్తాలు తయారు చేయాలన్నది రాష్ట్ర మంత్రి కేటీఆర్ సంకల్పం. అందుకే టీ-ట్యాప్ పథకాన్ని తీసుకువచ్చారు. జకార్డ్ మిషన్ల అమరికతో టర్కీటవల్స్, లుంగీలు, చద్దర్లు ఇలా రకరకాల వస్ర్తాల తయారీకి అవకాశం ఉంటుంది.
– తస్లిమా, సంయుక్త సంచాలకులు, చేనేత జౌళిశాఖ, రాజన్న సిరిసిల్ల