వేములవాడ జనవరి 6: దక్షిణకాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి సన్నిధికి వచ్చే భక్తులకు క్యూ ర్కోడ్ ద్వారా నగదు డిజిటల్ లావాదేవి సేవలను అందుబాటులోకి తీసుకవచ్చేందుకు ఆలయ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం డిజిటల్ సేవలను వినియోగించుకునేందుకు ప్రజలు కూడా మొగ్గు చూపుతుండడంతో ఇందుకు ఏర్పాట్లు చేసేందుకు ఇప్పటికే బ్యాంకులను ఆలయ అధికారులు సంప్రదింపులు జరిపారు. సాంకేతికపరమైన సమస్యలను ముందస్తుగా గుర్తించి అవసరమైన కట్టుదిట్టమైన చర్యలతో ముందుకు తెచ్చేందుకు సిద్ధమవుతున్నారు. సుమారు 50కోట్ల వరకు పలు అర్జిత సేవల ద్వారా స్వామివారికి ఆదాయం సమకూరుతుండగా డిజిటల్ సేవలను అందుబాటులోకి తెస్తే నగదు తీసుకోవడం, బ్యాంకుల్లో జమచేయడం లాంటి ఇబ్బందులు తప్పుతాయని, సేవలు మరింత పారదర్శకంగా ఉండే అవకాశముందని భావిస్తున్నారు. ముందుగా ప్రధాన విభాగాల్లో ఈ సేవలను భక్తులకు అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమవుతున్నారు. స్వామివారి నిత్యసేవలైన ప్రధాన బుకింగ్, కోడెల బుకింగ్ కౌంటర్, రాజన్న అద్దెగదుల విచారణ కార్యాలయం, లడ్డూ ప్రసాదాల విక్రయాల విభాగంతోపాటు స్వామివారికి విరాళాలు అందజేసే కౌంటర్లోనూ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి డిజిటల్ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు నిపుణులతో కూడా సంప్రదింపులు చేస్తున్నట్లు ఈవో కృష్ణప్రసాద్ తెలిపారు. నగదు లావాదేవీలను నిర్వహించేందుకు పట్టణంలోని ప్రధాన మూడు బ్యాంకులు కూడా ముందుకు వచ్చినట్లు ఆలయ అకౌంట్స్ విభాగం అధికారులు చెబుతున్నారు.
త్వరలోనే అందుబాటులోకి..
నగదు డిజిటల్ లావాదేవీలపై ప్రజల్లో ఇప్పటికే అవగాహన బాగా పెరిగింది. ప్రధాన కౌంటర్లలో డిజిటల్ పేమేంట్లపై బ్యాంకు అధికారులను సంప్రదించి చర్చించాం. ప్రధాన బ్యాంకులు కూడా ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చాయి. ఏర్పాటు చేశాక ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ముందుగా నిపుణుల సలహాలు కూడా తీసుకుంటున్నాం. త్వరలోనే డిజిటల్ లావాదేవీలను అందుబాటులోకి తెస్తాం.
– కృష్ణప్రసాద్, ఆలయ సీఈవో