Mallareddy | ఎర్రటి నిప్పుకనికల్లాంటి రాజస్థాన్ ఎడారులు.. గడ్డకట్టే చల్లటి జమ్మూ కశ్మీర్ లోయలు.. ఇలా ఎండా, వాన, చలి ఎరుగకుండా దేశ రక్షణ సేవలు అందించిన సైనికుడు ఆయన. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు సరిహద్దుల్లో ప్రాణాలను పణంగా పెట్టి ప్రజల రక్షణ కోసం పునరంకితమైన యోధుడు ముచ్చర్ల ముద్దుబిడ్డ ఒలాద్రి మల్లారెడ్డి. వివిధ హోదాల్లో పని చేసిన ఆయన ఆదివారం (డిసెంబర్ 31న) పదవీ విరమణ చేశారు.
సోమవారం ఆయన స్వగ్రామం రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం ముచ్చర్లకు చేరుకోనున్నారు. ఈ సందర్భంగా దేశ సేవలో అమూల్యమైన సేవలందించి తిరిగి స్వగ్రామానికి వస్తున్న సందర్భంగా గ్రామస్తులు, కుటుంబీకులు హర్షం వ్యక్తం చేశారు. దేశం నాకేమిచ్చిందని కాకుండా.. తాను దేశానికి ఏం చేశానన్నదే ముఖ్యమని భావించి కనీపెంచిన తల్లిదండ్రులు, కట్టుకున్న భార్యాబిడ్డలను వదిలి సైన్యంలో చేరి అమూల్యమైన సేవలు అందించారని గ్రామస్తులు కొనియాడారు.
ముచ్చర్ల గ్రామానికి చెందిన ఒలాద్రి నర్సారెడ్డి-అనసూయ దంపతులకు మల్లారెడ్డి జన్మించాడు. ఇంటర్ వరకు చదువుకున్నారు. ఆ తర్వాత సైన్యంలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం కష్టపడ్డారు. చివరకు 1983 జనవరి 30న సరిహద్దు భద్రతా దళం(BSF)లో చేరారు. రాజస్థాన్, కశ్మీర్, గుజరాత్, పంజాబ్ రాష్ట్రాల్లో వివిధ హోదాల్లో పని చేశారు. 39 సంవత్సరాల పాటు సైన్యంలో కొనసాగారు. ఆయన భారత్-పాక్ మధ్య 1999లో జరిగిన కార్గిల్ యుద్ధంలోనూ పాల్గొన్నారు.