మాఘమాస జాతరకు సర్వం సిద్ధమైంది. ఏటా పుష్య బహుళ అమావాస్య రోజున ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం అనవాయితీగా వస్తున్నది. శనివారం సిరిసిల్ల జిల్లాకేంద్రం, కోనరావుపేట, గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట మండలాల్లో అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఆలయాలకు రంగులు వేసి ముస్తాబు చేసింది. విద్యుత్దీపాలతో అలంకరించింది. భక్తులు స్నానాలు చేసే ప్రాంతాల్లో తగిన భద్రతా చర్యలు చేపట్టింది.
రాజన్న సిరిసిల్ల, జనవరి 20 (నమస్తే తెలంగాణ)/ గంభీరావుపేట/ కోనరావుపేట/ ముస్తాబాద్/ నేతన్నచౌరస్తా : సిరిసిల్ల శివారులోని సమీకృత కలెక్టరేట్కు 3 కిలోమీటర్ల దూరంలో గుట్టల మధ్య కొలువుదీరిన రామలింగేశ్వరస్వామి ఆలయంలో నాయీబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఏటా జాతరను నిర్వహిస్తారు. 800 ఏండ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో నిర్వహించే ఉత్సవాలకు జిల్లా నుంచే కాకుండా వరంగల్, మెదక్, హైదరాబాద్ తదితర జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. ఇక్కడ స్వామివారికి కల్యాణం చేస్తే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. అలాగే సిరిసిల్ల శివారులోని మానేరులో గంగభవానీ, మడేళేశ్వరస్వామి సన్నిధిలో గంగపుత్ర సంఘం, రజక సంఘాల ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహిస్తారు. శనివారం ఉదయం ఆరుగంటల నుంచి ఆలయాల్లో పూజలు ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు గంగభవానీ శంకరుల కల్యాణోత్సవం జరిపిస్తారు. కుటుంబసమేతంగా భక్తులు స్వామివార్లను దర్శించుకుంటారు.
పాండవులు నడయాడిన క్షేత్రం భీముని మల్లారెడ్డిపేట …
గంభీరావుపేటకు తొమ్మిది, సిరిసిల్ల నుంచి 26 కిలోమీటర్ల దూరంలో ఉన్న భీముని మల్లారెడ్డిపేట శివారులో రెండు అంతస్తుల్లో శ్రీ సీతారామ లక్ష్మణ ఆలయం, ఎదురుగా భక్త హనుమాన్ మందిరాలు నెలవై ఉన్నాయి. పాండవులు నడయాడిన ప్రాంతంగా ప్రసిద్ధిగాంచిన ఈ ఆలయంలో మాఘమాస నాడు మహా జాతర జరుగుతుంది. పచ్చని చెట్లు, చుట్టూ గుట్టలు, కింద కోనేరు, పక్కనే జలపాతాలతో ఈ ప్రాంతం ప్రకృతి రమణీయతకు నెలవుగా ఉంటుంది. ఇక్కడ జరిగే వేడుకలకు సిరిసిల్ల జిల్లాతో పాటు కామారెడ్డి, సిద్ధిపేట తదితర జిల్లాల నుంచి భక్తులు తరలివస్తారు.
మామిడిపల్లి సీతారామ స్వామి ఆలయం
కోనరావుపేట మండలం మామిడిపల్లి శివారులోని గుట్టపై శ్రీసీతారాముల ఆలయం ఉన్నది. సిరిసిల్ల జిల్లా కేంద్రం నుంచి 22 కిలోమీటర్లు, వేములవాడ నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈక్షేత్రానికి బస్సు సౌకర్యం ఉన్నది. మాఘమాస రోజున ఇక్కడ జాతర జరుగుతుంది. భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తుంటారు. ఇక్కడ దర్శించుకున్న భక్తులకు సంతాన భాగ్యం కలుగుతుందని నమ్మకం.
ఎల్లారెడ్డిపేట కేశవపెరుమాండ్ల సన్నిధిలో
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నది కేశవ పెరుమాండ్ల స్వామి ఆలయం. ఇక్కడ ఘనంగా జాతర జరుగుతుంది. మండల కేంద్రం నలుమూలల ఉంచి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. సాయంత్రం వరకు సాగే ఈజాతర కోసం ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. ఒక్క రోజు జిల్లాలోని నాలుగు మండలాల్లో జరిగే జాతర ఉత్సవాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతున్నది. అలాగే అక్కపెల్లి శివారులోని బుగ్గరాజేశ్వరస్వామి ఆలయంలోనూ మాఘమాస జాతరను ఘనంగా నిర్వహిస్తారు. ఇక్కడి కోనేరును పవిత్రమైనదిగా భక్తులు భావిస్తుంటారు. ఇక్కడ స్నానాలు చేసిన తర్వాత బుగ్గలింగేశ్వరుడిని దర్శించుకుంటారు.
నారాయణపూర్-కొండాపూర్లో..
ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్ మండలాల్లోని నారాయణపూర్, కొండాపూర్ శివారు మానేరు తీరాన కొలువైన హనుమాన్ ఆలయం వద్ద ఏటా జాతర ఘనంగా జరుగుతుంది. రెండు మండలాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తారు. వాగులో స్నానాలు చేసి స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు.