పథకం అమలు కావడం లేదని పేర్కొనడం ఈటల అవివేకానికి నిదర్శనం
ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్
బీజేపీ నాయకులు భాషతీరు మార్చుకోవాలి: టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీఆర్
మానకొండూర్, ఫిబ్రవరి 8: దళితబంధు పథకం దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నదని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ పేర్కొన్నారు. మండల కేంద్రంలో మంగళవారం ఆయన టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, సుడా చైర్మన్ జీవీఆర్తో కలిసి విలేకరులతో మాట్లాడారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసమే దళితబంధు తీసుకువచ్చారని, ఇప్పటి వరకు ఈ పథకం అమలు కావడం లేదని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పేర్కొనడం అతని అవివేకానికి నిదర్శనమన్నారు. దళితుల జీవితాల్లో వెలుగులు నింపాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ దళితబంధు పథకం ప్రవేశపెట్టారని స్పష్టం చేశారు. ఈటల రాజేందర్కు రాజకీయ భిక్ష పెట్టింది కేసీఆర్ అని, అలాంటి మహోన్నత వ్యక్తిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు మాట్లాడుతూ, హుజూరాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరుగడం లేదని, దళితబంధు పథకం అమలు కావడం లేదని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పేర్కొనడం హాస్యాస్పదమన్నారు. ఉప ఎన్నికలో ఇచ్చిన హామీలు వందశాతం అమలయ్యాయని పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ టికెట్ ఇచ్చి ఈటలను ఎమ్మెల్యే, మంత్రిని చేస్తే, ఇప్పుడు బీజేపీ ఎమ్మెలేగా తెలంగాణ సంక్షేమ పథకాలను విమర్శిస్తున్నాడని దుయ్యబట్టారు. హుజూరాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి కేంద్రం నుంచి ఎన్ని వందల కోట్ల నిధులు తీసుకువస్తావో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే ఈటల, ఎంపీ బండి సంజయ్కు మైక్ పట్టుకున్న, ప్రెస్మీట్ పెట్టిన ప్రతిసారి సీఎం కేసీఆర్ను తిట్టడం తప్పా మరోధ్యాస ఉండదని విమర్శించారు. సీఎం కేసీఆర్ భాష మార్చుకోవాలని ఉపన్యాసాలు చేస్తున్న ఎమ్మెల్యే ఈటల ముందుగా తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ భాషతీరు మార్చుకోవాలని సూచించాలని హితవు పలికారు. బీజేపీ నాయకుల భాషతీరు మారకపోతే భవిష్యత్లో ప్రజలే గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. సమావేశంలో జడ్పీటీసీ తాళ్లపెల్లి శేఖర్గౌడ్, మత్స్యపారిశ్రామిక సహకార సంఘం జిల్లా మాజీ అధ్యక్షుడు పోలు లక్ష్మణ్, ఆర్బీఎస్ మండల కన్వీనర్ రామంచ గోపాల్రెడ్డి, సర్పంచ్ రొడ్డ పృథ్వీరాజ్, నాయకులు గుర్రం కిరణ్గౌడ్, పారునంది కిషన్, పడాల శంకరయ్య, శాతరాజు యాదగిరి, మల్లగల్ల నగేశ్, నెల్లి మురళి, రెడ్డి సంపత్రెడ్డి పాల్గొన్నారు.