సిరిసిల్ల : మరో నాలుగు నెలల్లో పదవిని కోల్పోతున్న బండి సంజయ్ (Bandi Sanjay) గడిచిన నాలుగున్నర సంవత్సరాల్లో చేనేతలకు ఏ ఒక్క రూపాయి సహకారం అందించలేదని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్(MLA Adi Srinivas ) ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ( Revanth reddy ) కి వస్త్ర పరిశ్రమపై బండి సంజయ్ లేఖ రాయడాన్ని తప్పుపడుతూ మీడియాతో మాట్లాడారు. దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా సంజయ్ లేఖ ఉందని విమర్శించారు.
20 వేల మంది ఉన్న కార్మికులు ఉన్న సిరిసిల్ల ( Siricilla) ప్రాంతం నుంచి కాకతీయ టెక్ట్స్ టైల్స్ పార్క్ను వరంగల్ కు తరలించింది మీరు కాదా అని ప్రశ్నించారు. జీఎస్టీ పేరుతో నేతన్నులపై భారము మోపుతుంది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమేనని ఆరోపించారు. జీఎస్టీ ఎత్తివేయాలని తాము అనేకసార్లు ఆందోళనలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఎంపీగా, రాష్ట్ర అధ్యక్షుడిగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న బండి సంజయ్ జీఎస్టీని తొలగించేందుకు ఎందుకు పనిచేయడం లేదని అన్నారు. నేతన్నలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు.