Sircilla | సిరిసిల్ల టౌన్, ఏప్రిల్ 7: అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ నాగేంద్ర చారి హెచ్చరించారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మంగళవారం ఉదయం సిరిసిల్ల పట్టణంలోని సిక్కులవాడలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు, నంబర్ ప్లేట్లు లేని 23 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న బోయిని శ్రీనివాస్, బల్వీర్ సింగ్, చందర్ సింగ్లపై కేసులు నమోదు చేశారు. వారినుంచి 14 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. ప్రజల రక్షణతో పాటు వారికి భద్రతాభావం (Sense of Security) కల్పించడం, అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆయా ప్రాంతాల్లోకి కొత్తగా వచ్చే వ్యక్తులు లేదా నేరస్తులు షెల్టర్ తీసుకుంటున్నారా అనే విషయాలు కూడా గుర్తించే అవకాశం ఉంటుందన్నారు. ఎవరైనా అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. యువత అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, తల్లిదండ్రులు తమ పిల్లలను చదువుపై దృష్టి పెట్టేలా ప్రోత్సహించాలని సూచించారు.
గంజాయి అక్రమ రవాణా, నిల్వ, సరఫరా వంటి అంశాలపై ఎవరికైనా సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని డీఎస్పీ కోరారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని హామీ ఇచ్చారు. అలాగే స్వీయ రక్షణ కోసం కాలనీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, ఈ విషయంలో పోలీస్ శాఖ పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. భద్రతా పరమైన అంశాల్లో, నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ఎవరైనా ప్రజా జీవనానికి భంగం కలిగించినా, చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.