రాజన్న సిరిసిల్ల, మే 17 (నమస్తే తెలంగాణ): పోక్సో కేసులో ఇరుక్కున్న కుమారుడిని కాపాడేందుకు ప్రయత్నరించిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ రాజీనామా చేయాలని బీఆర్ఎస్ పట్టుపడుతోంది. మైనర్ బాలికను మోసం చేసిన తనయుడిని దాచి పెట్టి.. పోలీసులకు ఆలస్యంగా అప్పగించిన బండి సంజయ్ మంత్రి, ఎంపీ పదవికి రాజీనామా చేయాలంటూ బీఆర్ఎస్ పార్టీ రాజన్న సిరిసిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య డిమాండ్ చేశారు.
సంజయ్ రాజీనామా చేయాలని సోమవారం నియోజకవర్గ కేంద్రాలైన సిరిసిల్ల, వేములవాడలో ధర్నాలు, నిరసనలు చేపడుతామని అగయ్య పేర్కోన్నారు. సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, మాజీ ప్రజాప్రతినిధులు పార్టీ శ్రేణులతో కలిసి ధర్నా చేపడుతామని ఆగయ్య వెల్లడించారు.

వేములవాడలో నియోజకవర్గ ఇంఛార్జ్ చల్మెడ లక్ష్మీనర్సింహారావు ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్లో ధర్నా నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ధర్నాకు ఆయా నియోజకవర్గాల్లోని పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిదులు, మండలాల అధ్యక్షులు, సింగిల్ విండో చైర్మన్లు, సర్పంచులు, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులతో పాటు మాజీ ప్రజాప్రతినిధులు, మహిళ నేతలు భారీగా హాజరై విజయవంతం చేయాలని ఆగయ్య పిలుపునిచ్చారు.