రాజన్న సిరిసిల్ల, మార్చి 12 (నమస్తే తెలంగాణ): ప్రజారోగ్యమే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. వైద్యాన్ని మరింత చేరువ చేసే దిశగా అడుగులు వేస్తున్నది. అందులో భాగంగా ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ రూపొందిస్తున్నది. వివిధ వ్యాధులతో బాధపడుతున్నవారికి మరింత మెరుగైన వైద్యం అందించడం, దేశంలో ఎక్కడికి వెళ్లినా ఆన్లైన్లో ఉన్న సమాచారం ఆధారంగా సేవలు పొందే వీలుగా చేపడుతున్న ఈ కార్యక్రమానికి పైలట్ ప్రాజెక్టులుగా రాజన్న సిరిసిల్ల, ములుగు జిల్లాలను ప్రభుత్వం ఎంపిక చేసింది. కార్యక్రమాన్ని ఈ నెల 5న వేములవాడలో మంత్రి కేటీఆర్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆరోగ్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి 18ఏళ్ల పైబడిన వారందరి ఆరోగ్య వివరాలు సేకరించి ఆన్లైన్లో నిక్షిప్తం చేస్తున్నారు. ప్రతి ఒక్కరి బ్లడ్ గ్రూప్, 30 రకాల పరీక్షలు నిర్వహిస్తున్నారు.
ప్రజల హెల్త్ ప్రొఫైల్ చేపట్టిన రాష్ట్రం దేశంలోనే మొదటిది తెలంగాణ అని చెప్పుకోడానికి గర్వించదగ్గ విషయం. వివిధ దవాఖానలకు వస్తున్న రోగుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈహెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్ట్ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. జిల్లాల వారీగా ఆరోగ్య వివరాలు సేకరించి ఏ జిల్లాలో ఎలాంటి వ్యాధులున్నాయి.. అక్కడ ఎలాంటి దవాఖాన ఏర్పా టు చేయాలో నిర్ణయించి మెరుగైన వైద్యం అం దించేందుకు చర్యలు తీసుకుంటున్నది. ప్రస్తు తం సిరిసిల్ల, కోరుట్ల, కామారెడ్డి, మెట్పల్లి, జగిత్యాల, సిద్దిపేట ప్రాంతాల్లో బీడీ కార్మికులు అధికంగా ఉన్నందున వారికి ఎలాంటి వ్యాధులు న్నాయో పరీక్షలు చేసి, ఆయా జిల్లాల్లో అందుకు తగిన దవాఖానలను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా సర్కారు హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్ట్ను చేపట్టినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు.
ప్రాజెక్ట్లో భాగంగా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రక్త నమూనాల సేకరణ వేగవంతంగా జరుగుతున్నది. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ఒక ఏఎన్ఎం, ఇద్దరు ఆశ కార్యకర్తలతో కూడిన 50 బృందాలను ఏర్పాటు చేశారు. జిల్లాలో 18ఏళ్ల పైబడిన వారు 4లక్షల 22వేల 812మంది ఉన్నట్లు గుర్తించారు. వీరి కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాల ద్వారా 13మండలాల్లోని 255 గ్రామపంచాయతీల్లో ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి ఒక్కరికీ వైద్య పరీక్షలు చేస్తున్నారు. ఈప్రక్రియ చేపట్టిన వారం రోజుల్లోనే 2,756 గృహాలోని 5,837 మందికి రక్త పరీక్షలు చేశారు. సేకరించిన రక్తనమూనాలను సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ డయోగ్నస్టిక్ కేంద్రానికి వెంటవెంటనే తరలిస్తున్నారు. ఈ ప్రక్రియ రెండు నెలల్లో పూర్తి చేసేందుకు వైద్య, ఆరోగ్యశాఖ చర్యలు తీసుకుంటున్నది. కాగా, టీ డయాగ్నోస్టిక్ అధునాతన కంప్యూటర్ ద్వారా పరీక్షలు జరిపిన తర్వాత వచ్చే రెండు రిపోర్టుల్లో ఒకటి పేషెంట్ మొబైల్కు నేరుగా వెళ్తుంది. మరో రిపోర్టు వైద్య, ఆరోగ్యశాఖ వద్ద ఉంటుంది. వివరాలన్నీ ఆన్లైన్లో నిక్షిప్తం చేసిన తర్వాత హెల్త్ కార్డులు అందజేస్తారు.
హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్ట్లో భాగంగా వైద్య, ఆరోగ్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి రక్తనమూనాలు సేకరిస్తున్నది. డీఎంహెచ్వో సుమన్మోహన్రావు ఆధ్వర్యంలో ప్రస్తుతం 50 బృందాలు పనిచేస్తున్నాయి. మరో 150 బృందాలను ఏర్పాటు చేసి కార్యక్రమాన్ని వేగవంతం చేస్తాం. రక్త నమూనాలు సేకరిస్తున్నపుడు ప్రజలంతా వైద్య సిబ్బందికి బాగా సహకరిస్తున్నారు. గ్రామానికి వస్తున్నట్లు ఒకరోజు ముందే తెలియజేస్తున్నందున ఉపాధిహామీ, వ్యవసాయ పనులకు వెళ్లిన వారంతా సమయానికి వచ్చి వైద్య పరీక్షలు చేయించుకుంటూ రక్త నమూనాలు ఇస్తున్నారు. సేకరించిన నమూనాలను వెంట వెంట టీడయోగ్నస్టిక్ సెంటర్కు చేరుస్తున్నాం. ప్రతి ఒక్కరి డాటాను ఆన్లైన్లో ఎంట్రీ చేస్తున్నాం. – కార్తీక్, జిల్లా డాటామేనేజర్, రాజన్న సిరిసిల్ల