రాజన్న సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రమైన సిరిసిల్ల కార్మిక క్షేత్రంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. పట్టణంలోని మార్కండేయ వీధిలో మామిడాల వీరమ్మ (80) అనే వృద్ధురాలు మంగళవారం ఉదయం మృతి చెందింది. ఆ వీధిలోని ఓ ఇంట్లో వీరమ్మ గత కొంతకాలంగా కొడుకు బాలరాజ్తో కలిసి ఉంటున్నది. బాలరాజు టెక్స్టైల్ పార్కులో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. వీరమ్మ పెద్ద కొడుకు పాండు గతంలోనే చనిపోయాడు. భర్త విశ్వనాథం కూడా మృతిచెందాడు.
బాలరాజు భార్యతో విడిగా ఉంటూ తల్లి వీరమ్మను చూసుకుంటున్నాడు. మంగళవారం ఉదయం తీవ్ర అస్వస్థకు గురైన వీరమ్మ మృతిచెందింది. వీరమ్మ మృతిచెందిన విషయం ఇంటి యజమానికి తెలుపగా మృతదేహాన్ని ఇంట్లోకి అనుమతించలేదు. రోడ్డుపైనే ఉంచాలని చెప్పాడు. దాంతో చేసేదేమీ లేక రోడ్డుపైన ఓ బల్లపై మృతదేహాన్ని ఉంచారు. నిరుపేద నేత కుటుంబం కావడంతో కనీసం అంతక్రియలకు సైతం డబ్బు లేదని బాలరాజు విలపించాడు.
వృద్ధురాలు మృతదేహం రోడ్డుపైనే ఉండటం, రోడ్డుపైనే బంధువుల రోధనలు, ధైన్య స్థితిని చూసి కాలనీవాసులు చలించిపోయారు. ఈ విషయం బీఆర్ఎస్ కౌన్సిలర్ అడిచెర్ల రూప సాయికుమార్ తెలిసింది. దాంతో రూప సాయికుమార్ వీరమ్మ ఇంటికి వెళ్లి నివాళులు అర్పించారు. కుటుంబసభ్యులను పరామర్శించారు. వృద్ధురాలు అంతక్రియలు తామే తామే నిర్వహిస్తామని ధైర్యం చెప్పారు. అండగా ఉంటామని అన్నారు.