కార్మిక క్షేత్రం సిరిసిల్లలో వేగంగా చీరెల తయారీ
యువతుల కోసం ప్రత్యేకంగా లంగావోణి సారీలు
రేయింబవళ్లు శ్రమిస్తున్న సిరిసిల్ల నేతన్నలు
7.5కోట్ల మీటర్లలో ఇప్పటికే 3.63 కోట్ల మీటర్ల వస్త్రం రెడీ
సిద్ధమైన 54.87 లక్షల చీరెలకు ఎప్పటికప్పుడు ప్రాసెసింగ్
వెనువెంటనే జిల్లాలకు సరఫరా
రాజన్న సిరిసిల్ల, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ) ;సద్దులకు సర్కారు సారె ముస్తాబవుతున్నది. కార్మిక క్షేత్రంలో నూరు వర్ణాలు.. 859 డిజైన్లతో ఆడబిడ్డలు మురిసేలా రూపుదిద్దుకుంటున్నది. రేయింబవళ్లూ శ్రమిస్తున్న నేతన్నల చేతుల్లో జరీ అంచులతో రామబాణం, గులాబీ, దమయంతి, గుమ్మడి పువ్వు.. ఇలా తీరొక్క రంగుల్లో ఆవిష్కృతమవుతున్నది. ఈసారి యువతుల కోసం ప్రత్యేకంగా లంగావోణి చీరెలను యంత్రాంగం తయారు చేయిస్తున్నది. ఏడున్నర కోట్ల మీటర్లలో ఇప్పటికే 3.63 కోట్ల మీటర్ల వస్త్రం రెడీ కాగా, సిద్ధమైన 54.87 లక్షల సారీలను ఎప్పటికపడు ప్రాసెసింగ్ చేస్తూ జిల్లాలకు తరలించింది. వచ్చే నెల 15కల్లా కోటి చీరెల టార్గెట్ను ఛేదించడమే లక్ష్యంగా అడుగులు వేస్తూ తయారీని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నది.
సద్దుల సారె ముస్తాబవుతున్నది. ఆడబిడ్డలు మెచ్చేలా తీరొక్క రంగుల్లో, విభిన్నమైన డిజైన్లతో తయారవుతున్నది. ఏడున్నర కోట్ల మీటర్లలో ఇప్పటికే 3.63 కోట్ల మీటర్ల వస్త్రం రెడీ కాగా, వచ్చే నెలకల్లా పూర్తిచేసి త్వరలోనే పంపిణీ చేసేందుకు యంత్రాంగం సిద్ధమవుతున్నది.
బతుకమ్మ చీరెల పంపిణీని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. ఆడబిడ్డలు మురిసెలా రంగురంగులు, అందమైన డిజైన్లతో తయారు చేస్తున్నది. ఇందుకోసం రూ.లక్షలు ఖర్చు పెట్టి 15వేల మరమగ్గాలను ఆధునీకరించింది. పట్టణంలోని మగ్గాలపై ప్లేన్ చీరెలు, టెక్స్టైల్స్ పార్కులోని రేఫియర్ సాంచాలపై చెక్స్, కొత్తకొత్త డిజైన్లతో తయారు చేస్తున్నారు. ఏడున్నర కోట్ల మీటర్లు, కోటి చీరెలు లక్ష్యం కాగా, ఇప్పటివరకు 3.63 కోట్ల మీటర్లు, 54.87 లక్షల చీరెలు తయారయ్యాయి. వీటిని సిరిసిల్లతో పాటు హైదరాబాద్లోని కాటేదాన్లో 15 ప్రాసెసింగ్ యూనిట్లలో ఫినిషింగ్ చేశారు. గట్టాలలో ప్యాకింగ్ చేసి వెంట వెంటనే రాష్టంలోని అన్ని జిల్లాలకు లారీల ద్వారా తరలిస్తున్నారు.
100 రంగులు.. 859 డిజైన్లు
ఆడబిడ్డలకు ఉచితంగా అందిస్తున్న చీరెలు అద్భుతమైన డిజైన్లతో నేతన్నల కళానైపుణ్యం ఉట్టిపడేలా తయారవుతున్నాయి. మొత్తం వంద రంగులు.. 859 చీరలు తయారవుతుండగా, ఒక్కో డిజైన్లో 34 రకాల రంగులను పొదుగుతున్నారు. నాణ్యతా ప్రమాణాలతో చీరెలు తయారు చేయాలని మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు చేనేత జౌళిశాఖ డైరెక్టర్ శైలజారామయ్యార్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ముంబై, సూరత్ లాంటి పట్టణాలకు చెందిన డిజైన్ మాస్టర్లతో ఏటా కొత్త కొత్త మోడళ్లలో చీరెలు తయారు చేస్తున్నారు. ఇందుకోసం ఒక్కో సాంచా ఆధునీకరణకు రూ.20వేల నుంచి రూ.30వేల దాకా ఖర్చు పెట్టారు. డాబీలను భీవండి, సూరత్, ఇచ్చల్ కరంజీల నుంచి కొనుగోలు చేశారు. రెండు వైపులా బంగారు రంగులో మెరిసే జరీ అంచులున్నాయి. హంస, నెమలితో పాటు అనేక రకాల డిజైన్లతో పట్టుచీరెలను తలపించే విధంగా అంచులతో చీరెలు తయారవుతున్నాయి. ఇందులో మగువలను ఆకట్టుకునే విధంగా రామబాణం, గులాబీ, మెజంతా, టమాట, దమయంతి, గుమ్మడి పూవు, పచ్చ ఇలా తీరొక్క రంగుల్లో అద్భుతమైన చీరలు తయారు చేస్తున్నారు. సెప్టెంబర్ 15లోగా కోటి చీరల తయారీ లక్ష్యం పెట్టుకుని చేనేత జౌళిశాఖ అధికారులు ముందుకు పోతున్నారు. యువతుల కోసం లంగావోణీ చీరెలు తయారు చేస్తున్నారు.
పది జిల్లాలకు చేరిన చీరెలు..
పండుగ సమీపిస్తున్న తరుణంలో చీరెల తయారీ ఊపందుకున్నది. రోజుకు పది లక్షల మీటర్ల వస్ర్తాలు ప్రాసెసింగ్ చేస్తున్నారు. మరమగ్గాలపై తయారైన చీరలు వెనువెంటనే జౌళిశాఖ తనిఖీ కేంద్రానికి ఆటోల్లో చేరవేస్తున్నారు. అక్కడ 50 మంది అధికారులు వాటి నాణ్యతను పరీక్షించిన తర్వాత ప్రాసెసింగ్ యూనిట్లకు తరలిస్తారు. అక్కడ ఫినిషింగ్ అయిన చీరెలను గట్టాలలో ప్యాకింగ్ చేసి, జిల్లాలకు తరలిస్తున్నారు. సిరిసిల్లలో గీతానగర్లోని తాటిపాముల దామోదర్, తంగళ్లపల్లి మండల కేంద్రంలోని బొట్ల వెంకటస్వామి ప్రాసెసింగ్ యూనిట్లలో చీరెలు ఫినిషింగ్ అవుతున్నాయి. ఇందులో బీహార్, ఒడిశా లకు చెందిన 100 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ప్యాకింగ్ అయిన చీరెల గట్టాలు నాగర్కర్నూలు, నల్గొండ, మంచిర్యాల, జనగామ, వరంగల్, హైదరాబాద్, నర్సంపేట, ఖమ్మం, వనపర్తి, కరీంనగర్కు తరలించినట్లు అధికారులు తెలిపారు. జిల్లాలకు చేరిన అనంతరం గ్రామీణాభివృద్ధి, పౌరసరఫరాల శాఖల అధికారులు మండలాలకు తరలించి రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేస్తారు.