రాజన్న సిరిసిల్ల, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): దేశంలో వ్యవసాయం తర్వాత లక్షల మందికి ఉపాధినిస్తున్నది టెక్స్టైల్స్ రంగమే. నాడు చేనేత మగ్గాలకే పరిమితమైన ఈ వస్త్ర పరిశ్రమ నేడు ఆటోమెటిక్ మరమగ్గాలతో ఎన్నో సవాళ్లను అధిగమిస్తూ అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నది. లోదస్తులు మొదలు పెళ్లి దుస్తుల వరకు తయారయ్యే మన దేశంలో పెద్ద పరిశ్రమలతో పాటు అనేక కుటీర పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయి. వేలాది మంది దుస్తుల తయారీలో ఉ పాధి పొందుతూ జీవనం సాగిస్తున్నారు. ఇలాంటి అతి పెద్ద పరిశ్రమకు చేయూతనివ్వాల్సిన కేం ద్రం, వస్త్రం తయారు చేసే నేతన్నలపైనే కక్ష కడుతున్నది. పండించిన వడ్లు కొనమంటూ అన్నదాతలను ఇబ్బందులకు గురిచేస్తూనే వస్త్ర పరిశ్రమపై పన్నుల భారం మోపుతూ లక్షలాది మంది ఉపాధిని దెబ్బతీసున్నది. సరిగ్గా రెండు దశాబ్దాల క్రితం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను స్వరాష్ట్రంలో బతుకమ్మ, క్రిస్మస్, రంజాన్ వివిధ రకాల వస్త్ర ఉత్పత్తికి ఆర్డర్లు ఇచ్చి కేసీఆర్ సర్కారు పునర్జీవం పోయగా, కేంద్ర సర్కారు మాత్రం 12 శాతం జీఎస్టీ విధించి పరిశ్రమను నష్టాల్లోకి నెట్టేలా వ్యవహరిస్తున్నది.
మోయలేని భారం
తెలంగాణలో దాదాపు 40 వేల మరమగ్గాలు, వెయ్యి దాకా చేనేత మగ్గాలున్నాయి. రాష్ట్ర వ్యా ప్తంగా లక్ష మంది వరకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. ఒక్క సిరిసిల్ల జిల్లాలోనే 30 వేల మరమగ్గాలుంటే 20 వేల పైచిలుకు కార్మికులకు పరిశ్రమ ఉపాధినిస్తున్నది. తెలంగాణ స ర్కారు అందిస్తున్న చేయూతతో ఒక్కో కార్మికుడు నెలకు రూ.15 వేల నుంచి రూ.20 వేల దాకా సంపాదిస్తున్నారు. రోజుకు 20 లక్షల మీటర్ల వస్ర్తా లు ఉత్పత్తి అవుతున్నాయి. రాష్ట్ర సర్కారు ఇస్తున్న ఆర్డర్ల వల్లే పరిశ్రమ నిరంతరాయంగా నడుస్తున్నది. బీజేపీ ప్రభుత్వం జీఎస్టీ పేరిట వస్త్ర పరిశ్రమపై పన్ను మీద పన్ను వేస్తున్నది. గతంలో జీఎస్టీ పరిధిలోకి తేవద్దని ఎంత మొత్తుకున్నా చేర్చింది. నూలుపై 5 శాతం, రంగులు, రసాయనాలపై 18 శాతం, తయారైన వస్ర్తాలపైనా 5 శాతం పన్ను విధించింది. అసలే కుంటుతూ గెంటుతూ నడుస్తున్న టెక్స్టైల్స్ రంగంపై కేంద్రం విధించిన పన్నులు భారంగా మారగా, తాజాగా అదనంగా 7 శాతం పెంచి 12 శాతానికి చేసింది. వచ్చే సంవత్సరం జనవరి 1 నుంచి అమల్లోకి తెస్తామని ప్రకటించినందున వ్యాపారుల్లో ఆందోళన నెలకొంది. పెంచిన జీఎస్టీ వల్ల మీటరు బట్టకు రూ.4 నుంచి రూ.5 వరకు పెరిగే అవకాశం ఉం ది. విధించిన 12 శాతం పన్నుతో కేంద్ర సర్కారు కు రూ.కోట్లల్లో ఆదాయం సమకూరనుండగా, ఇది కార్మికులు,ప్రజలపై పెనుభారం పడనున్నది.
రోడ్డున పడే ప్రమాదం..
కరోనా కష్టకాలంలో పరిశ్రమ నడవక, లక్షలాది మంది ఉపాధి కోల్పోయారు. ఇప్పడిప్పుడే కోలుకుంటున్న పరిశ్రమపై కేంద్ర సర్కారు పన్నుల పేరిట కొరఢా ఝులిపించడంతో పరిశ్రమలు మూత పడి కార్మికుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారనుంది. ఒకప్పుడు పెటీ కోట్స్ తయారీలో దేశంలో నెంబర్ వన్ స్థానంలో ఉన్న సిరిసిల్ల నేడు జీరో స్థాయికి పడిపోయే అవకాశం ఉంది. 350 డయ్యింగ్లు ఉండి 3 వేల మందికి పని కల్పించిన అద్దకం పరిశ్రమలో నేడు 27కి తగ్గి 200 మందికి మాత్రమే పనికల్పిస్తున్నది. నూలు, రంగులు, రసాయనాల ధరలపై పన్నుల మోత కా రణంగా వాటి రేట్లు మూడింతలు పెరిగాయి. కిలో రూ.140 ఉన్న రంగు ప్రస్తుతం రూ.200 దా టింది. దీనిపై జీఎస్టీ 18 శాతం ఉంటే బట్ట తయారైన తర్వాత మరో 12 శాతం పన్ను విధించడం వల్ల మార్కెట్లో వస్ర్తాలకు గిట్టుబాటు ధర రాక పరిశ్రమలు మూసి వేయడం మినహా మరో గత్యంతరం లేదంటూ ఉత్పత్తిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమలే మూసి వేస్తే జిల్లాలో 20 వేలకు పైగా ఉపాధి పొందుతున్న వారంతా రోడ్డున పడే ప్రమాదం ఉంది.
రోడ్డున పడేది కార్మికులే..
అసలే కాటన్ అద్దకం పరిశ్రమలు అంతంత మాత్రంగానే నడుస్తున్నాయి. ఒకప్పుడు 3 వేల మం దికి ఉపాధి కల్పిస్తూ 350 అద్దకం ప రిశ్రమలుండేవి. 323 మూతపడ్డాయి. రంగు లు, రసాయనాలపై 18 శాతం పన్ను కడుతు న్నాం. తయారైన బట్టపై 5 శాతం కడుతుంటే అదనంగా ఏడు శాతం పెంచడం సరికా దు. దీనివల్ల రోడ్డున పడేది లక్షలాది మంది కార్మికులే.
మంత్రి దృష్టికి తీసుకెళ్లినం..
తెలంగాణలో వస్త్ర పరిశ్రమకు సిరిసిల్ల ప్రసిద్ధిగాంచింది. దీనిపై ఆధారపడి వేలాది మంది ఉపాధి పొందుతు న్నరు. కేంద్రం విధించిన జీఎస్టీతో మూతపడే ప్రమాదం ఉన్నది. జీఎస్టీ గతంలో ఉన్నవిధంగా కొనసాగిస్తే ఫర్వాలేదు. బట్టల తయారీపై 12 శాతం పెంచద్దు. ఈ విషయమై మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లగా కేంద్రానికి లేఖ కూడా రాశారు. మంత్రి లేఖతోనైనా కేంద్రం దిగివస్తుందని భావిస్తున్నం.
-జిందం చక్రపాణి, వస్త్ర వ్యాపారి,
టీఆర్ఎస్ పార్టీ పట్టణాధ్యక్షుడు
పన్నుల భారం మోయలేం..
తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన వస్త్ర పరిశ్రమ తెలంగాణ సర్కారు సహకారంతో ముందు కెళ్తున్నది. బతుకమ్మ చీరల ఆర్డర్లతో కార్మికులకు చేతి నిండా పని దొరికింది. కేంద్రం ఇప్పటికే మూడుసార్లు జీఎస్టీ విధించింది. నూలు, రంగులు, రసాయనాలపై, బట్ట తయారీపై విధించింది. బట్ట తయారీపై 5 శాతం ఉంటే దానిని 12 శాతానికి పెంచితే మోయలేని భారం పడుతుంది.
నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి..
రాష్ట్ర ప్రభుత్వం, మంత్రి కేటీఆర్ చొరవతోనే తెలంగాణలో టెక్స్టైల్స్ రంగం బతికి బట్టకడుతున్నది. బడ్జెట్లో రూ.1200 కోట్లు కేటాయించి మరమగ్గాల ఆధునీకరణ, రూ.వేల కోట్ల వస్త్ర ఉత్పత్తుల ఆర్డర్లు ఇవ్వడం వల్లే మనుగడ కొనసాగిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం సహకారమందిస్తే కేంద్రం పన్నుల మీద పన్నులు విధించి పరిశ్రమ నడవకుండా చేస్తున్నది. మంత్రి రాసిన లేఖతోనైనా పెంచిన జీఎస్టీ వెనక్కి తీసుకోవాలి