కరీంనగర్, జూలై 25(నమస్తే తెలంగాణ): ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాలతో జిల్లా తడిసి ముద్దయింది. ఎడతెరిపి లేకుండా పడుతుండడంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఎక్కడ చూసినా జలమయమైన దృశ్యాలు కనిపిస్తున్నాయి. పలు కాలనీలు, గ్రామాల్లోకి వర్షపు నీరు చేరింది. చాలా చోట్ల పంటలు నీట మునిగాయి. గోదావరి, మానేరు, మూలవాగు, మోయతుమ్మెద వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో ప్రాజెక్టులు, జలాశయాలకు భారీగా వరద చేరుతున్నది. ఎగువమానేరు మత్తడి దుంకుతోంది. చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. రహదారులు, కాజ్వేల పైనుంచి వరద ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. కాగా, సోమవారం రాత్రి నుంచి మంగళవారం రాత్రి వరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురవడంతో జనజీవనం అతలాకుతలమైంది. అత్యధికంగా ముత్తారం మండలంలో 147.4 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.