Vemulawada | వేములవాడ, జూన్ 27 : వ్యవసాయమే జీవనాధారంగా భావించిన రైతులకు వాన జాడ కరువైంది. వేసిన పంటను కాపాడుకునేందుకు రైతులు భగీరథ ప్రయత్నమే చేస్తున్నారు. వేములవాడ పురపాలక సంఘం పరిధి విలీన గ్రామం అయ్యోరుపల్లి లో ఉల్లెందుల పోచయ్య తనకున్న నాలుగు ఎకరాల్లో మే చివరి వారంలోనే 25వేల రూపాయలు వెచ్చించి పత్తి పంట కోసం విత్తనాలను నాటాడు. వాతావరణంలో విపరీతమైన వేడి, పైగా వర్షాలు కురవకపోవడంతో మొదటిసారి వేసిన విత్తనాలు భూమిలోనే ఎండిపోయాయి. దీంతో చేసేదేమీ లేక రెండోసారి మరో రూ.25 వేల వరకు ఖర్చు చేసి పత్తి విత్తనాలను వేశాడు.
అయినప్పటికీ వర్షాలు లేకపోవడంతో ఇప్పటికే రూ.50వేల వరకు అప్పు చేసి మరి వ్యవసాయం చేస్తుండగా రెండోసారి వేసిన విత్తనాలను దక్కించుకునేందుకు వాటర్ ట్యాంకర్ తో నీటిని కొనుగోలు చేసి మరి కాపాడుకునేందుకు భగీరథ ప్రయత్నం చేస్తున్నాడు. ఒక్కో ట్యాంకర్ కు రూ.1500 వరకు చెల్లిస్తుండగా మొత్తం నాలుగు ఎకరాలకు ఎనిమిది ట్యాంకర్ల మీరు అవసరమవుతుండగా రూ.12 వేలతో వేసిన విత్తనాలను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. రైతు పోచయ్య మాట్లాడుతూ వర్షాలు లేక మొదటిసారి వేసిన విత్తనాలు ఎండిపోయాయని తెలిపారు. రెండోసారి కూడా విత్తనాలు వేసిన వర్షాలు లేకపోవడంతో అవి కూడా పాడైపోయే ప్రమాదం ఉందని ట్యాంకర్ ద్వారా పంట కాలువలో నీటి జల్లులను కురిపిస్తూ కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నానని తెలిపారు. ఇప్పటికీ అనేక మంది రైతులు రెండోసారి కూడా విత్తనాలను నాటి అప్పుల పాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.