ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్
జిల్లా కేంద్రంలో ల్యాబ్ భవన నిర్మాణానికి శంకుస్థాపన
జగిత్యాల, మార్చి 29: జిల్లాలో త్వరలో రేడియాలజీ సేవలు అందుబాటులోకి రానున్నాయని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో రూ.75 లక్షలతో చేపట్టిన రేడియాలజీ పరీక్షల కేంద్ర భవన నిర్మాణానికి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత, మున్సిపల్ చైర్పర్సన్ బోగ శ్రావణితో కలిసి మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో వైద్యశాఖకు రూ.11వేల కోట్ల బడ్జెట్ను సీఎం కేసీఆర్ కేటాయించారని గుర్తు చేశారు. జిల్లాలో మెడికల్, నర్సింగ్ కళాశాలలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. జిల్లా కేంద్రంలో రేడియాలజీ ల్యాబ్ కోసం భూమిని గుర్తించిన కలెక్టర్ను అభినందించారు. అనంతరం కలెక్టర్ జీ రవి మాట్లాడుతూ.. మూడునెలల్లోగా రేడియాలజీ ల్యాబ్ భవన నిర్మాణ పనులు పూర్తి చేయించి సేవలు అందుబాటులోకి వచ్చేలా కృషి చేస్తామన్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాల, డయోగ్నోస్టిక్ సెంటర్, రేడియాలజీ ఒకే ప్రాంతంలో ఉండడం పేద ప్రజలకు చాలా ఉపయోగపడుతుందని తెలిపారు. జడ్పీ చైర్పర్సన్ దావ వసంత మాట్లాడుతూ.. జిల్లాకు రేడియాలజీ ల్యాబ్ మంజూరు చేసిన సీఎం కేసీఆర్, కృషి చేసిన మంత్రి, స్థానిక ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రశేఖర్గౌడ్, డీఎంహెచ్వో శ్రీధర్, మున్సిపల్ కమిషనర్, సంబంధిత అధికారులు, స్థానిక కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులున్నారు.