‘మన ఊరు – మన బడి’ కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల రూపు రేఖలను సమూలంగా మార్చివేస్తోంది. కోట్లాది రూపాయలు ఖర్చుచేసి ప్రతి పాఠశాలను అందంగా, అద్భుతంగా తీర్చిదిద్దుతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొదటి దశలో 867 పాఠశాలలను ఎంపిక చేసి వాటి అభివృద్ధికి రూ.300 కోట్లకు పైగా నిధులతో పనులు చేపట్టింది. ఇందులో ప్రతి మండలానికి రెండు పాఠశాలలను ఎంపిక చేసి మోడల్గా తీర్చిదిద్దే పనులు శరవేగంగా నడుస్తున్నాయి. వీటిలో 82 పాఠశాలల్లో పనులు పూర్తయ్యాయి. వీటిని బుధవారం నుంచే ప్రారంభిస్తుండగా, ప్రభుత్వ పాఠశాలల్లో వస్తున్న మార్పులను చూసి విద్యార్థులు, తల్లిదండ్రుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
.. ఇక్కడ కనిపిస్తున్న భవనం కార్మిక క్షేత్రంలోని కుసుమ రామయ్య ప్రభుత్వ ఉన్నత పాఠశాల. ఇందులో చాలా వరకు కార్మికుల పిల్లలే చదువుకుంటున్నారు. నాటి సమైక్య పాలనలో తరగతి గదులు లేవు. ఉన్న గోడలు శిథిలావస్థకు చేరి ఎప్పుడు కూలుతాయో తెలియని పరిస్థితి ఉండేది. ఉన్నది ఒకటే పెద్ద హాలు. అందులోనే తడకలు కట్టి తరగతి గదులు నిర్వహించే వారు. కనీస సౌకర్యాలు లేని దుస్థితి. మూత్రశాలలు లేని కారణంగా దాహం వేసినా మూత్రం వస్తుందనే భయంతో విద్యార్థులు నీళ్లు తాగకపోయేది. ఫలితంగా అనారోగ్యం పాలయ్యే వారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ‘మన ఊరు.. మనబడి’తో ఈ పాఠశాలకు మహర్దశ వచ్చింది. భవన నిర్మాణం చేపట్టి విశాల తరగతి గదులు నిర్మించారు. విద్యార్థులకు తాగునీరు, మూత్రశాలలు, మధ్యాహ్నం భోజనం చేసేందుకు గది, ఇలా మౌలిక వసతులు కల్పించారు. దీంతో విద్యార్థుల సంఖ్య 550 వరకు పెరిగింది. రూ.12 లక్షలతో భవనాన్ని ఆధునీకరించారు. చుట్టూ సీసీ కెమెరాలు, సోలార్ బల్బులు ఏర్పాటు చేశారు. సంఖ్యకు తగ్గట్టు ఉపాధ్యాయులను నియమించారు. నాణ్యమైన విద్యనందిస్తున్నారు. ఇలా రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా 172 పాఠశాలలు ఎంపిక చేసి పనులు చేపడుతున్నారు. ఇందులో 22 పాఠశాలల్లో పనులు పూర్తయ్యాయి.
.. జగిత్యాల కేంద్రంలోని బేడ బుడిగ జంగాల కాలనీలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఇది. మొన్నటి వరకు మామూలు పాఠశాల. రంగులు వెలిసిపోయిన గోడలు, నీటి సౌకర్యం లేక తాళం వేసిన మూత్రశాలలు, విద్యుత్ సౌకర్యం లేక ఇబ్బందికరంగా కనిపించే పరిసరాలు, చీకటి కొట్టంగా కనిపించే వంట గది. పిల్లలకు మధ్యాహ్న భోజనం వండేందుకు నిత్యం ఎదురయ్యే తిప్పలు, సరైన రక్షణ లేని దుస్థితి, మూత్రశాలలు సరిగా లేక, పూర్తి స్థాయి ప్రహరీ లేక ఉదయం పాఠశాల ఆవరణలో కనిపించే మందు సీసాలు.. అయితే, కాలం మారింది. ప్రభుత్వం చేపట్టిన మన ఊరు.. మన బడి కింద ఈ పాఠశాల తొలి విడుతలో ఎంపికైంది. ఈ క్రమంలో పాఠశాలను పూర్తిగా విద్యుదీకరించారు. దీని కోసం కొత్తగా వైరింగ్ చేయించారు. తరగతి గదులతో పాటు, అన్ని గదుల్లోనూ ఫ్యాన్లు, ట్యూబులు బిగించారు. విద్యుదీకరణ కేటగిరీలో రూ.1,64,456 వెచ్చించారు. తాగునీటి కోసం పాఠశాలలో ట్యాంకును ఏర్పాటు చేశారు. నల్లాలను బిగించారు. బోర్ వేయించారు. వీటికి రూ.1,42,592 ఖర్చు చేశారు. మేజర్, మైనర్ రిపేరింగ్ కేటగిరీలో భాగంగా పాఠశాల తలుపులు, కిటికీలను రిపేర్ చేయించారు. టాయిలెట్స్లో కొత్త బేసిన్లను అమర్చారు. టాయిలెట్లో మొత్తం ఫ్లోరింగ్ చేయించారు. మూత్రశాలలు, మరుగుదొడ్లకు రన్నింగ్ వాటర్ సౌకర్యం కల్పించారు. రూ.6.58,272 లక్షలతో మేజర్, మైనర్ రిపేరింగ్ పనులు పూర్తి చేశారు. రూ.2,08,839 వెచ్చించి ప్రహరీ, గేట్ను ఏర్పాటు చేశారు. పాఠశాలకు రంగులు వేయించారు. బుడిగజంగాల ప్రాథమిక పాఠశాలకు రూ.11,74,169 వెచ్చించి సకల సౌకర్యాల విద్యాలయంగా తీర్చిదిద్దారు. దీంతో పాటు, పాఠశాలలో గతంలో తాగునీటి సౌకర్యం లేక ఇబ్బందయ్యేది. ప్రభుత్వం మిషన్ భగీరథ ద్వారా పాఠశాలకు కుళాయి కనెన్షన్ ఏర్పాటు చేసింది. ఈ చర్యలతో నిన్నటి వరకు కళావిహీనంగా కనిపించిన, ఈ బడి నేడు సరి కొత్త శోభతో మెరిసిపోతున్నది.
కరీంనగర్, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ పాఠశాలలు అంటే ఒకప్పుడు చెత్తా చెదారంతో నిండిన లోగిళ్లు.. పగిలిపోయిన నీటి పైపులు.. విరిగి పోయిన తులుపులు.. కిటికీలు, విద్యార్థుల సంగతి దేవుడెరుగు గురువు కూర్చునేందుకే కుర్చీలు లేని దుస్థితిలో కనిపించేవి. గదులు సరిపోక, ఉన్న గదుల్లో వసతులు లేక అనేక పాఠశాలల్లో చెట్ల కింద పాఠాలు సాగే దృశ్యాలు కోకొల్లలుగా ఉండేవి. చక్కటి విద్యాబోధనను అందించే ఉపాధ్యాయులున్నా పాఠశాలల పరిసరాలు చూసి తమ పిల్లలను పంపించే పరిస్థితులు ఉండేవి కావు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మన ఊరు- మన బడి, మన బస్తీ- మన బడి కార్యక్రమం ఇప్పుడు సర్కారు బడుల రూపురేఖలు మార్చి వేస్తోంది. ఒక పక్క పాఠశాల పరిసరాలను అందగా తీర్చిదిద్దుతూనే అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది. నీటి సౌకర్యంతో కూడిన టాయిలెట్లు, విద్యుదీకరణ, తాగు నీటి సరఫరా, విద్యార్థులు, సిబ్బందికి సరిపడా ఫర్నీచర్, పాఠశాల మొత్తం పెయింటింగ్ వేయడం, మైనర్, మేజర్ మరమ్మతులు, గ్రీన్ చాక్ బోర్డులు ఏర్పాటు చేయడం, ప్రహరీలు, కిచెన్ షెడ్లు, శిథిలమైన తరగతి గుదుల స్థానంలో కొత్త గదులు, ఉన్నత పాఠశాలల్లో డైసింగ్ హాల్స్ నిర్మాణం, డిజిటల్ విద్య మొదలైన 12 రకాల మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నది.
కరీంనగర్ జిల్లాలో 18 బడులు ముస్తాబు
జిల్లాలో మొత్తం 651 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, మన ఊరు మన బడి, మన బస్తీ మన బడి కింద మూడేళ్లలో మూడు దశల్లో పనులు చేపట్టి అన్ని పాఠశాలలను అందంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. అందులో భాగంగా మొదటి దశలో 120 ప్రాథమిక, 16 ప్రాథమికోన్నత, 94 ఉన్నత కలిపి మొత్తం 230 పాఠశాలలను ఎంపిక చేశారు. వీటిలో రూరల్లో 182, అర్బన్లో 48 పాఠశాలలు ఉన్నాయి. దీని కోసం ముందుగా రూ.31 కోట్లు విడుదల చేశారు. వీటిలో అనేక పాఠశాలల్లో పనులు శర వేగంగా నడుస్తున్నాయి. ప్రతి పాఠశాలలో అవసరమైన పనులు గుర్తించి అంచనాలు రూపొందించిన అధికారులు పనులు నిర్వహిస్తున్నారు. అయితే, కరీంనగర్ అర్బన్లో 1, రూరల్లో 1 చొప్పున మిగతా మండలాల్లో ప్రతి మండలానికి రెండు చొప్పున 30 పాఠశాలలను మోడల్గా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో ఇప్పటికే 18 పాఠశాలల్లో పనులు పూర్తయ్యాయి.
చక్కబడ్డ మన బడులు
రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా 13 మండలాల్లో 550 పాఠశాలలుండగా, ‘మన ఊరు.. మనబడి’లో భాగంగా 172 పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు విద్యాశాఖ ఎంపిక చేసింది. అందుకు ప్రభుత్వం ముందుగా రూ.20 కోట్లు మంజూరు చేసింది. 12 అంశాలతో పాఠశాలలో బడుల ఆధునీకరణ చేపట్టింది. పనులు ప్రారంభించిన వాటిలో వంద శాతం పూర్తయిన పాఠశాలలు 22 ఉండగా మరో 146 పాఠశాలల పనులు పూర్తి కావాల్సి ఉన్నది. విద్యాశాఖ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో పనులు వేగంగా సాగుతున్నాయి. సిరిసిల్ల నియోజకవర్గ పరిధిలో 80, వేములవాడ పరిధిలో 61, మానకొండూరు నియోజకవర్గ పరిధిలోని ఇల్లంతకుంట మండలంలో 17, చొప్పదండి నియోజకవర్గ పరిధిలోని బోయినిపల్లి మండలంలో 14 చొప్పున పాఠశాలలను ఎంపిక చేసి పనులు ప్రారంభించారు. ప్రహరీ, మూత్రశాలలు, అదనపు తరగతి గదుల నిర్మాణం వంటి మొత్తం 12 అంశాలపై మెరుగులు దిద్దుతున్నారు. శిథిలమైన పూర్వకాలం నాటి పాఠశాలల భవనాలు తొలగించి కొత్తగా నిర్మిస్తున్నారు. వందశాతం పనులు పూర్తయినవి 22, కాగా, 75 శాతం 100, 50 శాతానికి పైగా పూర్తయినవి 46 ఉన్నాయి.
జగిత్యాల జిల్లాలో 274 స్కూళ్ల ఎంపిక
జగిత్యాల జిల్లాలోని 20 మండలాలు, ఐదు మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 783 (పంచాయతీరాజ్, ప్రభుత్వ యాజమాన్యాల ఆధీనంలోని) పాఠశాలలు ఉన్నాయి. వీటిలో మన ఊరు.. మన బడి కార్యక్రమం కింద మొదటి దశలో 274 పాఠశాలలు ఎంపికయ్యాయి. వీటి కి ప్రొసీడింగ్స్ మంజూరు చేయగా, ఇందులో ఇప్పటికే 250కిపైగా పాఠశాలల్లో పనులు మొదలయ్యాయి. ఈ పథకం కింద జిల్లాలో 65 పాఠశాలల్లో అదనపు తరగతిగదులను నిర్మిస్తున్నా రు. 263 పాఠశాలల్లో డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీని కల్పిస్తున్నారు. 269 పాఠశాలల్లో విద్యుదీకరణ పనులు చేపడుతున్నారు. 163 పాఠశాల ల్లో డైనింగ్హాల్స్ నిర్మాణం చేస్తున్నారు. మేజర్, మైనర్ రిపేరింగ్ వర్క్స్ 269 పాఠశాలల్లో చేపడుతున్నారు. 32పాఠశాలల్లో కంపౌండ్ల నిర్మా ణం చేస్తున్నారు. 21 పాఠశాలల్లో కిచెన్ షెడ్స్ నిర్మాణం చేస్తున్నారు. 40 పాఠశాలల్లో టాయిలెట్ విత్ రన్నింగ్ వాటర్ ఫెసిలిటీని ఏర్పాటు చేసే ప్రక్రియ శరవేగంగా కొనసాగుతున్నది.
19 పాఠశాలల్లో వంద శాతం పూర్తి
జిల్లాలో మన ఊరు…మన బడి పనులకు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు టాప్ ప్రయార్టీ ఇచ్చి పనులు శరవేగంగా జరిగేలా చూస్తున్నారు. దాదాపు మొదటి దఫా ఎంపికైన అన్ని పాఠశాలల్లోను పనులు ప్రారంభమయ్యాయి. కాగా, గత నెల 28 వరకు జిల్లాలో 19 పాఠశాలల్లో 100 శాతం పనులు పూర్తయ్యాయి. మరో 17 పాఠశాలల్లో సైతం పనులు పూర్తి చేసేందుకు అధికారులు శ్రమిస్తున్నారు. గొడిశెలపేట, చందోళి, రాఘవపట్నం, కొత్తపేట, సంఘంపల్లి, ఫోర్ట్ ప్రాథమిక పాఠశాల, చల్గల్ మండల పరిషత్ పాఠశాల, ధరూర్ మండల ప్రాథమికోన్నత పాఠశాల, కుమ్మరిపల్లి ప్రాథమిక పాఠశాల, రాయికల్ జిల్లా పరిషత్ పాఠశాల, పెంబట్ల ప్రాథమిక పాఠశాల, మద్దునూర్ మండల ప్రాథమిక పాఠశాల, పెంబట్ల మండల ప్రాథమికోన్నత పాఠశాల, ఎకీన్పూర్ జిల్లా పరిషత్ పాఠశాల, శివాజినగర్ మండల ప్రాథమిక పాఠశాల, రామన్నపేట మండల ప్రాథమిక పాఠశాల, రామన్నపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, తొంబర్రావుపేట మండల ప్రాథమిక పాఠశాల, కల్వకోట మండల ప్రాథమిక పాఠశాలల్లో వందశాతం పనులు పూర్తి చేసుకున్నాయి. ఇక మరో 214 పాఠశాలల్లో పనులు యాభై శాతానికి పైగా పూర్తి కావచ్చాయి.
పెద్దపల్లి జిల్లాలో
జిల్లాలో మొత్తం 549 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా ‘మన ఊరు మన బడి’ లో భాగంగా మొదటి విడుతగా 191 పాఠశాలలను ప్రభుత్వం ఎంపిక చేసింది. వీటిల్లో పనులు నిర్వహించేందుకు ప్రభుత్వం ముందుగా రూ.5 కోట్లను విడుదల చేయగా ఇప్పటి వరకు 161 స్కూళ్లల్లో రూ.4.39కోట్లు ఖర్చు చేసి పనులను కొనసాగిస్తున్నారు. ఇందులో ఇప్పటికే 22 స్కూళ్లలో అభివృద్ధి పనులు పూర్తయ్యాయి. మరో 46 స్కూళ్లల్లో పనులు తుది దశకు చేరుకోగా 133 పాఠశాలల్లో పనులు వివిధ దశల్లో ఉన్నాయి. మొదట జిల్లాలోని 14 మండలాల్లో మండలానికి రెండు చొప్పున పనులను చేపట్టేందుకు నిర్ణయించి, ప్రారంభానికి సిద్ధం చేశారు. 22 పాఠశాలలను మరింత వేగంగా అందుబాటులోకి తీసుకువచ్చారు.
పూర్తయిన పాఠశాలలు ఇవే..
పెద్దపల్లి జిల్లాలో 191 పాఠశాలల్లో పనులను ప్రారంభించగా 22 పాఠశాలల్లో సంపూర్ణంగా అన్ని పనులను పూర్తి చేశారు. అవి అంతర్గాం మండలంలోని అక్బర్ నగర్ ఎంపీయూపీఎస్, అంతర్గాంలోని ఎంపీపీఎస్, ధర్మారం మండలంలోని ధర్మా రం జడ్పీహెచ్ఎస్ హైస్కూల్, పత్తిపాక జడ్పీహెచ్ఎస్ హైస్కూ ల్, ఎలిగేడు మండలంలోని ధూళికట్ట ఎంపీపీఎస్ ప్రైమరీ స్కూల్, జూలపల్లి మండలంలోని వడ్కాపూర్ ప్రాథమిక పాఠశాల, కమాన్పూర్ మండలం రొంపికుంటలోని ఎస్సీ ఎంపీపీఎస్, గుండారం ఎంపీయూపీఎస్, మంథనిలోని జడ్పీహెచ్ఎస్ బాలుర హైస్కూల్, ముత్తారం మండలంలోని కేషన్పల్లి ఎంపీయూపీఎస్, కేషన్పల్లిలోని ఎంపీయూపీఎస్, పాలకుర్తి మండలంలోని రామారావుపల్లి ఎంపీయూపీఎస్, జీడీనగర్ ఎంపీపీఎస్ ప్రాథమిక పాఠశాల, పెద్దపల్లి మండలంలోని రాఘవాపూర్ ధర్గా ఎంపీపీఎస్ ప్రాథమిక పాఠశాల, రామగిరి మం డలంలోని నరసింహులపల్లి ఎంపీపీఎస్, సుందిళ్ల ఎంపీపీఎస్ ప్రాథమిక పాఠశాలలు, రామగుండం మండలంలోని ఎంపీపీఎస్ ప్రాథమిక పాఠశాల, విఠల్నగర్ ఎంపీయూపీఎస్ స్కూళ్లు, శ్రీరాంపూర్ మండలంలోని కిష్టంపేట ఎంపీయూపీఎస్, శ్రీ రాంపూర్ జడ్పీహెచ్ఎస్ హైస్కూల్, సుల్తానాబాద్ మండలంలోని కాషపల్లి ఎంపీపీఎస్ ప్రాథమిక పాఠశాల, గర్రెపల్లి జడ్పీ హెచ్ఎస్ హైస్కూళ్లల్లో మనఊరు-మనబడి పనులు పూర్తయ్యాయి.
విద్యారంగంలో నూతన శకం
ప్రభుత్వం సర్కారు విద్యను బలోపేతం చేస్తున్నది. ఈ క్రమంలో పాఠశాలల్లో మరింత మెరుగైన సౌకర్యాలను కల్పించా లని నిర్ణయించింది. జిల్లాలో మొత్తంగా 549 ప్రభుత్వ పాఠశాలలు ఉంటే 191పాఠశాలలను ఎంపిక చేసి వసతి సౌకర్యాలను కల్పిస్తు న్నాం. ఇందులో ఇప్పటికే 22 పాఠశాలల్లో మన ఊరు మన బడి పనులను పూర్తి చేశాం. ఉపాధిహామీ పనుల పెండింగ్ వల్ల ఇంకా 46 స్కూళ్లల్లో పూర్తి కాలేదు.
-మాధవి, జిల్లా విద్యాధికారి, పెద్దపల్లి
ప్రభుత్వ పాఠశాలలకు జీవం
మన ఊరు, మన బడి పథకం ప్రభుత్వ పాఠశాలలకు జీవం పోసింది. వెలిసిన గోడలతో, సౌకర్యాల లేమితో కనిపించిన పాఠశాల నేడు సర్వాంగ సుందరంగా మారిపోయింది. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు లేక అడ్మిషన్లు లేకుండా పోయాయి. మూత్రశాలలు, మరుగుదొడ్లు లేక పడ్డ అవస్థలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పుడు ప్రభుత్వం తెచ్చిన పథకంతో పాఠశాలలన్నింటికి ఊతం వచ్చింది. మా బుడిగ జంగాల కాలనీ పాఠశాలల్లో రూ. 11,74,169ను వెచ్చించి ప్రభుత్వం అభివృద్ధి పనులు పూర్తి చేసింది. ఇప్పుడు మా పాఠశాలను చూస్తే మాకే ఉత్సాహం వస్తున్నది. మా పాఠశాల పిల్లలోను సంతోషం నెలకొంది. ప్రభుత్వం తీసుకున్న మన ఊరు.. మన బడి పథకానికి ధన్యవాదాలు.
-మ్యాడారం కృష్ణవేణి, బేడ, బుడిగ జంగాలకాలనీ ప్రధానోపాధ్యాయురాలు.