జగిత్యాల : జగిత్యాల ( Jagtial ) పట్టణంలోని పురాతన పాఠశాలను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ( Collector B. Satyaprasad ) శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజనాన్ని ( Mid day Meals ) పరిశీలించి, భోజన నాణ్యత, పరిశుభ్రత, వంటశాల నిర్వహణపై వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారికి అందుతున్న ఆహారం నాణ్యత, రుచిపై అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. భోజనం సక్రమంగా, సమయానికి అందుతున్నదా అనే అంశాన్ని కూడా పరిశీలించారు .

డైట్ మెను, వంటగది పరిశుభ్రత, నీటి వినియోగం, నిల్వ, కిచెన్ షెడ్ను ప్రత్యేకంగా పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి సహా పంక్తి భోజనం చేశారు. పాఠశాలల్లో విద్యార్థులకు అందించే భోజనం నాణ్యత అత్యంత ప్రాధాన్యంగా తీసుకోవాలని ఆదేశించారు. పిల్లల ఆరోగ్యం, భవిష్యత్తు దృష్ట్యా పోషకాహారం సమృద్ధిగా అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రభుత్వం నిర్దేశించిన మెనూను ఖచ్చితంగా అమలు చేసి, ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా పరిశుభ్రత ప్రమాణాలు పాటించాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట జిల్లా విద్యాధికారి కె. రాము, జగిత్యాల ఆర్డీవో మధు సూదన్, పాఠశాల ఉపాధ్యాయులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.