గంభీరావుపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ప్రతిరోజూ ప్రతిజ్ఞ, ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతు లు నిర్వహిస్తున్నారు. గుర్తింపు కోసం ఐడీ కార్డు లు, సాంస్కృతిక, క్రీడా పోటీలు చేపట్టి.. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ నాణ్యమైన విద్యనంది స్తున్నామని ప్రిన్సిపాల్ వెంకట్నాయక్ తెలిపారు. దీంతో కళాశాలలో విద్యార్థుల సంఖ్య 226 చేరుకున్నదని ఆయన చెప్పారు.
విద్యార్థులకు గుర్తింపు కార్డులు
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మొత్తం 226 విద్యార్థులకు కళాశాల తరఫున గుర్తింపు కార్డులను అందించారు. దీంతో కళాశాలలో విద్యనభ్యసిస్తున్న వారికి సమాజంలో కొత్త గుర్తింపు వచ్చినట్లయింది. కళాశాల చరిత్రలో ఇంటర్ విద్యార్థులు ఎన్నడూ గుర్తింపు కార్డులు వినియోగించలేదు. దీంతో విద్యార్థులకు ప్రతిరోజూ కళాశాలకు హాజరుకావాలన్న బాధ్యత పెరిగింది.
ప్రతిరోజూ ప్రార్థన.. ప్రత్యేక తరగతులు
క్రమశిక్షణతో కూడిన ఉత్తమ విద్యనందించాలన్న లక్ష్యంతో కళాశాల ఆవరణలో ప్రతిరోజూ ఉదయం విద్యార్థులతో ప్రార్థన చేయిస్తున్నారు. దీంతో విద్యార్థులు సరైన సమయానికి కళాశాలకు హాజరవుతున్నారు. అలాగే ప్రతి విద్యార్థి చదువుపై శ్రద్ధ వహిస్తూ రోజూ ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రతినెల యూనిట్, వారానికో స్లిప్టెస్టులు నిర్వహిస్తూ శతశాతం ఉత్తీర్ణత సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు. విద్యార్థులు ప్రతి రోజూ కళాశాలకు వచ్చేవిధంగా చర్యలు తీసుకుంటున్నారు. కార్పొరేట్ను మైమరిపించేలా గంభీరావుపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల అన్నింట ముందుకు సాగుతుండడంతో సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం జూనియర్ కళాశాలల్లో చదివే విద్యార్థుల బంగారు భవిష్యత్కు భరోసా కల్పిస్తున్నది. ప్రైవేట్కు దీటుగా సకల సౌకర్యాలు కల్పిస్తూ.. అనుభవజ్ఞులైన అధ్యాపకులతో నాణ్యమైన విద్యనందిస్తున్నది. ఉదయం.. సాయంత్రం వేళలో ప్రత్యేక తరగతులతోపాటు ప్రతినెలా పరీక్షలు నిర్వహిస్తున్నది. ఈ క్రమం లో ఏటేటా అడ్మిషన్ల సంఖ్య పెరగడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
– గంభీరావుపేట, డిసెంబర్ 25
ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ
చదువుల్లో వెనుకబడిన ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. విద్యార్థుల బంగారు భవిష్యత్కు బాటలు వేసే విధంగా క్రమశిక్షణతోపాటు నాణ్యమైన బోధన అందిస్తున్నాం. విద్యార్థులు ప్రతిరోజూ కళాశాలకు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. విద్యా బోధనతోపాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ కళాశాలలో సకల వసతులు కల్పిస్తున్నాం.
– వెంకట్నాయక్, ప్రిన్సిపాల్, గంభీరావుపేట
ప్రతిరోజూ ప్రత్యేక తరగతులు
ప్రతిరోజూ విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. మాకు వచ్చిన సందేహాలను అధ్యాపకులు నివృత్తి చేస్తున్నారు. ప్రైవేట్ కళాశాలల మాదిరిగా మాకు కూడా గుర్తింపు కార్డులు ఇచ్చారు. ప్రతినెలా పరీక్షలు పెడుతున్నారు. కళాశాలలో వసతులు బాగున్నాయి.
– నిఖిత, విద్యార్థిని, ఎంపీసీ, ఫస్టియర్
ప్రతిజ్ఞ చేస్తున్నాం
కళాశాలలో విద్యతోపాటు క్రమశిక్షణ నేర్పిస్తున్నారు. ప్రతి రోజూ తరగతి గదికి వెళ్లే ముందు అందరం సామూహికంగా కలిసి ప్రతిజ్ఞ చేస్తున్నాం. కళాశాలకు సమాయానికి రావడం అలవాటైంది. అందరం సమయపాలన పాటిస్తున్నాం.
– కేశవ్, విద్యార్థి, బైపీసీ, సెకండియర్