పెద్దపల్లి రూరల్, మే 12: పెద్దపల్లి మండలం రాగినేడులో శ్రీ నాగలింగేశ్వరస్వామి ఆలయంలో శ్రీ పంచాయతన విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్గుప్తా నేతృత్వంలో పుష్పగిరి పీఠాధిపతి శ్రీ విద్యానంద భారతీస్వామి ఆధ్వర్యంలోని శిష్య బృందం 25 మంది వేద మంత్రోచ్ఛారణల మధ్య కార్యక్రమాన్ని కనులపండువలా నిర్వహించారు. ఆలయ గోపురంపై పీఠాధిపతి కుంభాభిషేకం జరిపించారు. ఉత్సవానికి మంత్రి కొప్పుల ఈశ్వర్, స్నేహలత దంపతులు, ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేతకాని, ఎమ్మెల్యేలు దాసరి మనోహర్రెడ్డి, కోరుకంటి చందర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జీ రఘువీర్సింగ్ హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ముఖ్య అతిథులుగా వచ్చిన వారందరికీ పుష్పగిరి పీఠాధిపతి శ్రీ విద్యానందభారతీస్వామి శాలువాలు కప్పి, జ్ఞాపికలు అందజేస్తూ ఆశీర్వదించారు.
ప్రజలకు శివయ్య ఆశీస్సులు
రాగినేడు శ్రీ నాగలింగేశ్వరస్వామి పరిపూర్ణ ఆశీస్సులు పెద్దపల్లి ప్రాంత ప్రజలందరికీ ఉంటా యి. శివలింగాన్ని గుర్తించి స్వచ్ఛందంగా భూదా నం చేసిన పోతరాజుల భూమయ్య, పోతరాజుల లక్ష్మయ్య కుటుంబాలకు స్వామి దీవెనలు ఉంటాయి. చెట్టు కింద శివయ్యకు ఆలయం నిర్మాణం చేయించిన కోలేటి దామోదర్ గుప్తాకు అభినందనలు. వారి కుటుంబానికి సైతం స్వామివారి దివ్యాశీస్సులు ఉండాలని కోరుకుంటున్న.
– పుష్పగిరి పీఠాధిపతి శ్రీ విద్యానంద భారతీస్వామి
ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు
రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల అభివృద్ధికి సహకరిస్తున్న సీఎం కేసీఆర్కు పెద్దపల్లి జిల్లా, మండల, రాగినేడు గ్రామ ప్రజల పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు. యాదాద్రి, వేములవాడ, కొండగట్టు మాదిరిగా రాగినేడు శ్రీ నాగలింగేశ్వర స్వామి ఆలయానికి నిధులు మంజూరు చేయించి, అద్భుతంగా ఆలయం నిర్మాణం చేయించిన సీఎం కేసీఆర్కు ఈ ప్రాంత ప్రజలంతా రుణపడి ఉంటరు.
– కోలేటి దామోదర్ గుప్తా, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్
దామోదర్గుప్తా అభినందనీయుడు
రాగినేడులో స్వయంభూ శివలింగానికి బ్రహ్మాండమైన ఆలయం నిర్మించి ప్రజల చెంతకు ప్రశాంత వాతావరణం తెచ్చిపెట్టిన దామోదర్గుప్తా అభినందనీయుడు. ఆలయ నిర్మాణానికి ఎంతగానో కృషిచేశారు. ఇంత గొప్ప పనిచేసిన ఆయనకు ప్రజల దీవెనలు ఉంటాయి.
-మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎంపీ వెంకటేశ్నేతకాని